సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా పులగం (ఖిలాషాపురం) గ్రామానికి చెంది గుర్తిగౌడ్-సర్వమ్మ దంపతులకు క్రీ.శ.1650 ఆగస్టు 18న జన్మించారు. పాపన్న తండ్రి నాటి మహ్మదీయ పాలకుల అకృత్యాలకు ఎదురు తిరగడంతో ఆయన్ను హత్యచేశారు. పాలకులపై తిరగబడి పాపన్న తనకు దూరమవుతాడనే బెంగతో ఈ విషయం ఆయనకు తెలువకుండా తల్లి సర్వమ్మ పెంచింది.
ఇరువై ఏండ్ల వయస్సులో నాటి పాలకులు చేస్తు న్న దోపిడీ, అరాచకాలను ఆయన కండ్లారా చూశాడు. ఈ దోపిడీ, దౌర్జన్యాలు పోవాలనీ, తెలంగాణ పల్లెల్లో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్షాహీ ఆరవ నవాబు అబ్దుల్లా కుతుబ్ షాహీ పాలిస్తున్న కాలంలో ఆయన సర్కారుపై తిరుగుబాటుకు బీజం వేశాడు. మిత్రులతో కలిసి పాలకులపై యుద్ధం చేశాడు. వీరోచిత పోరాటాలతో పేదలను రక్షించాడు. ఈ క్రమంలోనే ఆయుధాలూ, సైన్యాన్నీ పెద్ద ఎత్తున పోగు చేసుకున్నాడు.
ఖిలాషాపురాన్ని కార్యక్షేత్రంగా చేసుకొని స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. జీర్ణించుకోలేని జమీందారులంతా ఒక్కటై పాపన్న హత్యకు పథకం రచించారు. ఈ కుట్రను పసిగట్టిన పాపన్న ఖిలాషాపురం, తాటికొండ, జనగాం, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు ఆపి, తన సైన్యాన్ని అజ్ఞాతంలోకి పంపాడు. పాపన్న సైతం మారువేశంలో జగిత్యాల జిల్లాలోని చల్గల్ గడీకి వెళ్లాడు.
అక్కడ తనకు పరిచయం ఉన్న జమీందారు కొలాస వెంకట్రావు వద్ద కొద్దిరోజులున్నాడు. విషయం తెలిసిన మహ్మదీయులు పాపన్నను బంధించడానికి దాడిచేశారు. పాపన్న శత్రువులకు దొరకకుండా తన అనుచరులతో హుజూరాబాద్ తాలూకా మొలంగూరు వద్ద ఉన్న సర్వాయిపేట (సైదాపూర్ మండలం, పెరుకపల్లి)కి చేరుకున్నాడు. తర్వాత సర్వాయిపేట శివార్లలోని కోటగిరి గుట్టల్లో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించి పాలన సాగించాడు. అప్పుడు మొదలైన తన విజయ పరంపరలో మచిలీపట్నం నుంచి బీజాపూర్, కౌల్హాస్పూర్ వరకు కోటలు నిర్మించాడు. ఔరంగజేబును సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఖంగుతిన్న ఔరంగజేబు కొలనుపాక సర్దార్ రుస్తుందిల్ ఖాన్కు పాపన్నను అంతమొందించే బాధ్యతను అప్పగించాడు. పాపన్నపై రుస్తుందిల్ఖాన్ దాడిచేయగా అతను ప్రతిఘటించడంతో ఖాన్ పారిపోయాడు. ఈ సమయంలోనే ఢిల్లీలో ఔరంగజేబు వ్యాధి గ్రస్థుడై మరణించాడు. ఆయన మరణంతో గోల్కొండ రాజ్యంలో అనేక మార్పులు చోటుచేసుకొని మొగలుల పాలన పట్టుతప్పిపోయింది. ఇదే అదనుగా పాపన్న దాడులను ఉధృతం చేసి వివిధ కోటలను గెలుచుకున్నాడు. ఆ సమయంలో ఔరంగజేబు కుమారుడు బహద్దూర్ షా ఢిల్లీకి బాద్ షా అయ్యాడు. తెలంగాణలో తమ పాలనకు పూర్వవైభవం తేవడానికి పాపన్నను చంపాలనీ నిర్ణయించాడు. తన సైన్యాన్ని ఖిలాషాపురం కోటపైకి దాడికి పంపించాడు. ఇందులో పాపన్న తన సైన్యాన్ని పెద్ద ఎత్తున కోల్పోయాడు. అలాగే ఆప్తమిత్రుడు, వీరాధివీరుడు సేనాని సర్వన్న సైతం మృత్యువాత పడతాడు. దీంతో అతడి స్మారక చిహ్నంగా సర్వాయిపేటలో సర్వన్న చెరువును తవ్వించాడు. అలాగే సర్వన్న పేరుతో గ్రామాన్ని సర్వాయిపేటగా మార్చాడు.
గోల్కొండ కోటపై పాపన్న జెండా ఎగురుతున్న క్రమంలో బహద్దూర్షా కుయుక్తులు పన్నాడు. ధనరాశులకు లొంగిపోయిన ద్రోహులు కుట్ర చేసి పాపన్నను తీవ్రంగా గాయపరిచారు. అక్కడినుంచి తన మిత్రుడు, యుద్ధవీరుడు మీరా సాహెబ్ తప్పించి జగిత్యాలలోని చల్గల్ గడీ యజమాని వెంకట్రావ్ వద్దకు తీసుకెళ్లాడు. అతడు ఆశ్రయమిచ్చినట్టే ఇచ్చి పాపన్నను పట్టిచ్చాడు. దీంతో సర్దార్ సర్వాయి పాపన్నను బంధించి గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు.
పాపన్ననూ, అతడి మిత్రుడు మీరా సాహెబ్ను కోట ప్రధాన ద్వారం ముందు నరికిచంపారు. వారి తలల్ని కోట గుమ్మానికి వేలాడదీశారు. పాపన్న, మీరా సాహెబ్ల మొండాలను గుర్రాలతో ఈడ్చి హైదరాబాద్ వీధుల్లో తిప్పుతూ ప్రజలకు భయాందోళనలు కలిగించారు. సర్కారుపై తిరగబడిన వారందరికీ ఇలాగే మరణ దండన విధించబడుతుందని దండోరా వేస్తూ హెచ్చరించారు. ఇంతటితో ఊరుకోకుండా పాపన్న, మీరా సాహెబ్ల తలలను ఢిల్లీకి… మొగలాయి పాదుషా బహద్దూర్ షాకు కానుకగా పంపారు. ఈ విధంగా పాపన్న, మీరా సాహెబ్ల ఆత్మలు భారతమాత కంఠాన, అలాగే తెలంగాణ తల్లి మెడలో మణిహారాలై అలంకరింపబడి మహోజ్వలంగా ప్రకాశించాయి. పేదల రక్షణ కోసం పోరాడటమే కాదు, పేదల రాజ్యాన్ని నిర్మించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరితార్థుడు. అమరుడు. ఆచంద్రతారార్కం ఆయన చిరంజీవి. భరతమాత, తెలంగాణ తల్లులకు ముద్దు బిడ్డడు.
-తాళ్ళపల్లి యాదగిరి గౌడ్
99497 89939