ఐక్య రాజ్య సమితి పనుపున మాంట్రియల్లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు ముగింపు చర్చల్లో ప్రపంచ దేశాలు అంగీకారానికి రావడం ఊరట కలిగిస్తున్నది. ముప్ఫై శాతం భూమిని, జలాలను జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కాపాడాలని ఈ సదస్సు నిర్ణయించింది. ఇప్పుడున్న నియమాల ప్రకారం 17 శాతం భూమి, పది శాతం జలాలు మాత్రమే జీవ వైవిధ్య పరిరక్షణ పరిధిలోకి వస్తాయి. ఈ లెక్కన మాంట్రియల్ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని ముందడుగుగానే భావించవచ్చు. వర్ధమాన దేశాలలో జీవ వైవిధ్య పరిరక్షణకు నిధులు కల్పించాలని ఈ సదస్సులో అంగీకారం కుదిరింది. 2025 వరకు వార్షిక నిధిని 200 బిలియన్ డాలర్లకు పెంచుతారు. ఆ తరువాత 2030 వరకు ఏటా 30 బిలియన్ డాలర్ల మేర సమకూరుస్తారు. భూగోళంపైనున్న లక్షలాది వృక్ష జంతుజాలం అంతరించి పోయే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మాంట్రియల్లో కుదిరిన అంగీకారం ప్రాముఖ్యం సంతరించుకున్నది. దీనిని భూతాపం పెరుగుదలను అరికట్టడానికి గతంలో కుదిరిన చరిత్రాత్మకమైన ‘ప్యారిస్ ఒడంబడిక’తో పోలుస్తున్నారు.
భూతాపం పెరిగి వాతావరణ మార్పులు చోటు చేసుకోవడానికైనా, జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడానికైనా ఇంతకాలం అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక విధానమే కారణం. తీరా ముప్పు ముంగిట చేరిన తరువాత వర్ధమాన దేశాలలో అభివృద్ధి కార్యక్రమాలను కట్టడి చేయాలనే వాదనను పారిశ్రామిక దేశాలు ముందుకు తెస్తున్నాయి. భారత్ తదితర మూడవ ప్రపంచ దేశాలు ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తిస్తూనే, ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలు తోడ్పాటు అందించాలని కోరడంలో తప్పులేదు. పేద, వర్ధమాన దేశాలకు నిధులతో పాటు, హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత ప్రవృద్ధ దేశాలపై ఉంటుంది. వాతావరణ మార్పుకే కాదు, జీవ వైవిధ్య విధ్వంసానికి కూడా కారణమైన దేశాలే ఈ భారం మోయాలంటూ భారత్ చేస్తున్న వాదన సమంజసమైనది.
‘దశ కూప సమా వాపీ, దశ వాపీ సమోహ్రదః / దశహ్రద సమః పుత్రో, దశ పుత్రో సమో ద్రుమః – ‘ఒక దిగుడుబావి పది బావులతో సమానం. ఒక చెరువు పది దిగుడుబావులతో సమానం. ఒక కుమారుడు (నేడు కుమార్తె అని కూడా చెప్పుకోవచ్చు) పది చెరువులతో సమానం. ఒక చెట్టు పది మంది పుత్రులతో సమానం’ అని వేదకాలంలోనే మన పూర్వీకులు బోధించారు. ఈ భూగోళంపై సకల జీవరాసుల ఉనికిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఈ నేపథ్యంలో ‘హరిత హారం’ పేర తెలంగాణ రాష్ట్రం సాగిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శప్రాయమైనది. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 268 కోట్ల మొక్కలను నాటడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రం గత మూడేండ్లలో 85.62 కోట్ల మొక్కలను నాటి సాక్షాత్తు పార్లమెంటులో కేంద్రం చేత ప్రశంసలను పొందడం అభినందనీయం. అడవుల సంరక్షణలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు కూడా జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడేవే కావడం గమనార్హం.