గాథాసప్తశతి.. తెలంగాణ మట్టి పరిమళాన్ని తనలో నింపుకొని, భక్తి భావావేశ కుసుమాల్ని సిగలో ధరించి, నవరస స్పర్శచే పరిపూర్ణత చెందింది. శాతవాహన ప్రభువుల సాహిత్య పిపాసకు ప్రతీకయై, ఆనాటి సమాజ వ్యవస్థకు దర్పణమైనది. పాశ్చాత్య పండితులచే కొనియాడబడి, పెక్కు భాషల్లోకి అనువదించబడింది. హాల చక్రవర్తిచే సంకలనం చేయబడిన గాథాసప్తశతి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గ్రంథమని గుర్తించబడింది. కానీ తన పుట్టినిల్లయిన తెలంగాణ ప్రజానీకానికి అంతగా తెలియకపోవడం నిజంగా విచారించాల్సిన విషయమే..
చరిత్రపుటల్లో ప్రాముఖ్యత సంతరించుకొన్న శాతవాహన సామ్రాజ్యం క్రీ.పూ 230 నుంచి క్రీ.శ. 225 వరకు కొనసాగిందని చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహనుల తొలి రాజధాని మన జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కోటిలింగాల. శాతవాహన వంశానికి చెందిన 17వ చక్రవర్తి హాలుడు (క్రీ.శ. 7 నుంచి 12) స్వయంగా కవి. అంతేగాక కవివత్సల బిరుదాంకితుడు. అయన పాలన కేవలం ఐదేండ్లు మాత్రమే సాగినా, తన కృషివల్ల, చరిత్రలో ఎన్నో శతాబ్దాల వరకు చెదరని స్థానం సంపాదించుకొన్నాడు.
రాజ్య పాలనలో భాగంగా, మారువేషాల్లో ఆయన రాజ్యమంతటా పర్యటిస్తున్న సమయాల్లో, జానపదులు పాడుకొంటున్న పెక్కు గాథలకు ఆయన ముగ్ధుడై, వారిద్వారా వందలాది గాథలని సేకరించి, వాటికి తోడుగా తాను రచించిన గాథలను కలిపి, అందులోని 700 గాథలని ఏడు శతకాలుగా విభజించి గాథాసత్తసై పేరిట గ్రంథస్థం చేశాడు. గాథాసత్తసై ఆనాటి రాజభాషగా ఉన్న ప్రాకృత భాషలో సంకలనం చేయబడింది. అందువల్ల పెక్కుమంది కవులు ఈ సంకలనాన్ని గాథాసప్తశతి పేరిట వివిధ భాషల్లోకి అనువదించారు.
ఇక మహాకవి శ్రీనాథుడు ‘శాలివాహన సప్తశతి’ పేరిట ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. అయితే ఇప్పుడా ప్రతులు ఎక్కడా లభించడం లేదు. ‘రాధా గోవింద బసక్’ ఈ గ్రంథాన్ని వచన రూపంలో ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఈ అనువాదాన్ని కలకత్తాకు చెందిన ‘ఏషియాటిక్ సొసైటీ’ వారు 1971లో ముద్రించారు. అంతేగాక వేటూరి ప్రభాకర శాస్త్రి కొన్నిగాథలు, తల్లావఝల శివశంకరశాస్త్రి (100 గాథ లు), రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (400 గాథలు), నరాల రామిరెడ్డి (300 గాథలు), దీవి సుబ్బారావు (700 గాథలు) తెలుగులోకి అనువదించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ అనువాదాన్ని హైదారాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్తు 1931లో ప్రచురించింది. జర్మన్ పండితుడు వెబర్ ఈ సంకలనాన్ని 1870లో మొదటిసారి పాశ్చాత్య ప్ర పంచానికి అందించాడు. ఆ తర్వాత ప్రపంచంలో ని పలు భాషల్లోకి అనువదించబడింది. ప్రాకృత భాషలో సంకలనం చేసిన ఈ గ్రంథంలోని ఏ గా థ కూడా సామాన్య జనానికి ఏమాత్రం అర్థం కాదు. చదవటం కూడా కఠి నంగానే ఉంటుంది. ఉదాహరణకు మొదటి శతకంలోని మొదటి గాథ ప్రాకృత మూలంలో…..
‘పశువఇణో రోసారుణపడిమాసం కంత గౌరిముహ అందంగహి అంఘ పంకఅంవిఅ సంఝా సలిలాంజలిం ణమహ’
ఈ గాథ హాలునిచే రచించబడింది. శివుని ప్రాతః కాల అర్ఘ్యాంజలితో ఈ గ్రంథ సంకలనం ప్రారంభమవుతుం ది. శివుడు అర్ఘ్యాంజలి నిమిత్తం దోసిలి లోకి నీళ్ళు తీసుకొన్నాడు. తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాడని భావించిందేమో గౌరీదేవి, ఆమె ముఖం ఎరుపెక్కింది. అయితే పరమ శివుడు అర్ధనారీశ్వరుడు. అందువల్ల ఎరుపెక్కిన గౌరీదేవి ముఖం శివుని దోసిలిలోని జలాల్లో ఎర్ర తామరలా ప్రతిబింబించింది. ఒక విధంగా చూస్తే శివుడు తన దోసిలి జలాల్లో ఎర్రతామరనుంచుకొని అర్ఘ్యమర్పిస్తున్నట్టుగా ఉన్నది. అటువంటి దోసిలికి వందనం చేద్దామంటాడు రచయిత హాల చక్రవర్తి. ఎంతో అద్భుతమైన భక్తి భావనకు ప్రతీకగా గోచరిస్తుందీగాథ.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక అంశం, గాథాసప్తశతి ప్రాకృత భాషలో అందులో ముఖ్యంగా మహారాష్ట్రీ ప్రాకృతంలో రచించబడింది. ఇందులో కనిపించే ఛందస్సు గాథా ఛందస్సనీ,, సంస్కృతంలో దీనిని ఆర్యా ఛందస్సుగా పేర్కొంటారని, ఈ గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవని, ప్రముఖ రచయిత, గాథాసప్తశతి అనువాదకులైన దీవి సుబ్బారావు వివరించారు.
ఈ గ్రంథంలోని గాథలనిం డా పల్లెటూరి వాతావరణం క నబడుతుంది.చాలా గాథలు సం భాషణల రూపంలో ఉంటాయి.
ఇక మొదటి శతకంలోని 18వ గాథ సిరిధమ్మియ కవిచే రచించ బడిం ది. ఇందులో ఒక పేద వనిత దీనస్థితి దృశ్య రూపంగా గోచరిస్తుంది. అమెకు కట్టుకోవడానికి కేవలం ఒక గుడ్డ మాత్రమే ఉన్న ది. అదికూడా చీకిపోయి ఉన్నది. బహుశ ఆ స్త్రీ వర్షంలో తడిసిందేమో చీకిన గుడ్డ అంచుల్లోంచి నీరు కారుతూ ఉన్నది.
ఆ దృశ్యం చూసిన కవికి ఈ బీద సంసారం ఈదటం తనవల్ల కాదని, ఆ వనిత మాన సంరక్షణ తాను చేయలేమోనని చీకిన గుడ్డ రోదిస్తున్నట్టుగా ఉన్నది. వాస్తవంగా ఆ పేద వనిత ఎదలోని రోదనని చీర అంచుల కన్నీటిలో దర్శింప చేశాడు కవి.
రెండవశతకంలోని రెండవగాథ కవి మా ణుడి రచన. దీనిని పరిశీలిస్తే… గోదావరి నది కి వరదొచ్చింది. కూకటి వేళ్ళతో పెకిలించబడ్డ చెట్టొకటి వరదలో కొట్టుకొని పోతున్నది. చెట్టుపై భాగాన ఒక కాకి గూడుంది. అందు లో ఎగరలేని కాకి పిల్లలున్నాయి. వరదలో చెట్టు కొట్టుకొని పోతుంటే గుండెలవిసిన తల్లి కాకి, తాను మునుగుతాననే భయం లేకుం డా ఆ వరద వెంటే ఎగురుతూ తన పిల్లల్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్త్తున్నది. ఆ దృశ్యం చూసిన కవి మాణుడి గుండె చెరువయింది. అనుకోకుండా ఆయన నోటి నుండి ఒక గాథ వెలువడింది. మాతృప్రేమలో ఉండే ఔన్నత్యాన్ని కళ్ళకు కనబడేట్టు చూపి మన గుండె ల్ని పిండివేస్తుందీ గాథ.
ఎంతో ప్రాశస్త్యమున్న గాథసప్తశతి గ్రంథం శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలలోనే సంకలనం చేయ బడిందని జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమయిన ధర్మపురికి చెందిన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు, సంగనభట్ల నరసయ్య ఆధారాలతో నిరూపించారు.
రెండవ శతకం లోని 91వ గాథ కవి పావచ్చీలుడి రచన.. ఈ గాథ ఆ రోజుల్లోనిదైనప్పటికినీ ఈనాటి పరిస్థితులకు స్పష్టంగా దర్ప ణం పడుతుంది. ఆ రోజుల్లో అక్షర ఙ్ఞానం లే ని వారు కూడా సమాజంలో అధిక గౌరవం పొందుతూ సామాన్య జనం మీద అధికారం చలాయించేవారు. జనులందరూ వాళ్ళకు తల వంచక తప్పేది కాదు. ఆ నాటి సమాజంలోని దౌర్జన్యాలను వివరిస్తాడు కవి.
ఒకవిధంగా హాలచక్రవర్తి సంకలనం నా టి సమాజంలోని విభిన్న కోణాల్ని దర్శింపజేస్తూ తెలంగాణ ప్రాచీన సాహిత్య సంపదని సుసంపన్నం చేసింది. ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగిన గ్రంథం గాథాసప్తశతి.
బసవరాజు నరేందర్ రావు: 99085 16549