మహోన్నత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన భారత దేశంలో ప్రతి పండుగకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వానికి నిదర్శనం. మన ఈ పండుగ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన చిన్న బతుకమ్మ, 9 రోజుల ముందే బొడ్డెమ్మ సంబరాలతో మొదలై అమావాస్య తర్వాత 9 వ రోజు (దుర్గాష్టమి) రోజున సద్దుల పెద్ద బతుకమ్మతో ముగుస్తుంది.
తెలంగాణ ప్రాంత జానపదులు తమసంతతి దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పు ట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటా రు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి, భిక్షమ్మ’ లని పేరు పెట్టుకుంటారు. ఈ విధంగానే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమని వేడుకునే దేవతల్లో బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు.
నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతా నం బతికినందుకు ప్రతీకగా నీటి దగ్గర పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసి ఉంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుంది.
ఇది తెలంగాణ ప్రాంతానికే చెందడం మన గొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికైనా ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవా ళ్ళు. మానవజాతి తల్లి వల్లే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను పూజించింది. అమ్మదేవతల పూజ ల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.
బతుకమ్మపండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్దిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబురంగా జరుపుకోబడుతుంది. జానపదంతో కలగలిపి 9 రోజులు మానవ జీవన విధానం, ఆడవారి బాధలు, అత్తవారింట్లో అనుమతులు, జీవితంలో వచ్చే కష్టాల మీద పాటలు, సంతోషం మీద పాటలు, పాడిపంటల మీద పాటలు పాడే వారు. నీతి కథలు కూడా పాటల రూపంలో పాడేవారు.
అప్పటి సంప్రదాయాలకు తగ్గట్టు ఇంటి గుట్టు బయటకి చెప్పుకోలేక పాటల రూపం లో వ్యక్తపరిచేవారు. ఆ పాటలను అర్ధం చేసుకుని ఆడవారు తమ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించుకొని కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ, కష్టాలని అధిగమించేవారు లేదా వ్యవహారాల్ని చక్కదిద్దుకునేవారు. అత్త గారింటి నుంచి తల్లి గారింటికి అన్నయ్య వచ్చి పండగకి తీసుకు పోయేటప్పుడు అనుమతి కోసం ఇంట్లో అందరికీ మర్యాదగా ఎలాంటి పద్ధతులు పాటించే వారో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..మా అన్నలొచ్చిరి ఉయ్యా లో’… అనే పాటలో తెలుస్తుంది. ఇవే కాక రా మాయణం, భారతం కూడా పాటల రూపం లో పాడేవారు.
పెండ్లయిన ఆడపిల్లలు ఏడాదికి ఒకసారి తల్లిగారింటికి వచ్చి చిన్న నాటి స్నేహితులను కలుస్తారు. కొత్త కొత్త నగలు, చీరలు కట్టుకొని అందంగా ముస్తాబై అందరికీ చూపిస్తుంటా రు. దీనివల్ల ఆడవారి మెట్టింటి సౌభాగ్యం, ఆనందం తమ అలంకరణలోనూ, ముఖంలో ని శోభలోనూ తెలుస్తుంది. 9 రోజుల తర్వాత గౌరమ్మని సాగనంపి పుస్తెలకు పసు పు ఇస్తూ ఎదుటివారి సౌభాగ్యం పదికాలాలపాటు ఉండాలని కోరుకుంటారు. అందరూ కలిసి పాడు తూ, చేతులు కలుపుతూ సమానంగా ఆడటం, పసుపు బొట్టు, వాయినాలు ఇచ్చి పు చ్చుకోవటం వల్ల సమాజంలో అందరి పట్ల స్నేహభావం పెంపొంది, పంచుకోవటం, ఇతరుల మంచి కోరుకోవటం అనే సానుకూల వైఖరి అందరిలో పెంపొందుతుంది.
డాక్టర్ కల్పన గజ్జల