కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయిన రాష్ట్రాలు, రాజకీయ స్వాతంత్య్రాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలు అన్నిరంగాల్లో కేంద్రంపై ఆధారపడేలా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి నాలుగు ప్రధాన బాధ్యతలున్నాయి. 1.కరెన్సీ ప్రింటింగ్, 2.ఎగుమతి-దిగుమతుల అనుమతులు, 3.విదేశాంగ విధానం, 4.దేశ రక్షణ. వీటితోపాటు విశ్వవిద్యాలయాల నిర్వహణ ఉన్నప్పటికీ ప్రాథమిక, ఉన్నత విద్య రాష్ర్టాల జాబితాలోనే ఉన్నది. కానీ కేంద్రం రాష్ట్రాల హక్కులైన 1.వ్యవసాయం, 2.విద్యుత్, 3.పన్నులు, 4.నీటి వనరులు, 5.విద్య మొదలైన వాటిని పార్లమెంటులో చట్టాలు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. కేంద్ర విధానాలను వ్యతిరేకించిన రాష్ర్టాలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా, రాజకీయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధానాన్ని అమలుజేయ చూస్తున్నది.
ప్రణాళికాబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి 1951 నుంచి ప్రతి ఐదేండ్లకు ఒక ప్రణాళికను రూపొందించి, ఆ ప్రణాళికలో రూపొందించిన కార్యక్రమాలను అమలుచేస్తూ దేశాన్ని అభివృద్ధిలోకి నడిపించుకున్నాం. ఆయా ప్రణాళికల్లో పరిశ్రమలు, వ్యవసాయం, గరీభీ హఠావో, మాంద్యం తగ్గింపు, ఎగుమతులు, విద్యుత్, అక్షరాస్యత, ఉపాధి తదితర రంగాలకు నిధులు కేటాయించి వాటిని వృద్ధి చేసుకున్నాం. అయితే 2015లో ప్రణాళిక బోర్డును రద్దుచేసి బీజేపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్’ను ప్రవేశపెట్టింది. ‘నీతి ఆయోగ్’ ఏర్పడిన తర్వాత రాష్ర్టాల ఆర్థిక హక్కులను కాలరాయడం మొదలైంది. ప్రణాళికా బోర్డు రద్దుతో క్రమానుగత దేశాభివృద్ధి కుంటుబడింది. ప్రస్తుతం లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న 120 ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మివేశారు. ఆ సంస్థలను కొన్న అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులయ్యారు. ఆ అమ్మకపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో జీఎస్టీ ప్రతిపాదన తీసుకువచ్చారు. ‘ఒకే దేశం-ఒకేపన్ను’ విధానాన్ని రూపొందించి బహుళ పన్నుల విధానాన్ని రద్దుచేయాలని సెలవిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. 2010 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ విధానం ప్రారంభమైంది. మొదట అసోం తమ శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆమోదించింది. 2015 నుంచి జీఎస్టీని పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నారు. గతంలో వచ్చే ఆదాయం తగ్గినా, రాష్ర్టాలకు ఐదేండ్ల వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని అమలుచేయటానికి నిధుల కొరతను కారణంగా చూపుతున్నారు. ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ర్టాలకు నిధుల విడుదలలో జాప్యం చేయడం వల్ల ఆ రాష్ర్టాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. కేంద్రంతో పాటు సమానంగా రాష్ర్టాల పన్నును వసూలు చేస్తున్నప్పటికీ కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఆదాయం తగ్గింది.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కమిషన్లు వేసి తమకు వచ్చే పన్నులో కొంతభాగాన్ని రాష్ర్టాలకు ఇవ్వ టం సాధారణం. ప్రస్తుతం 15వ ఆర్థ్ధిక కమిషన్ (2021-2026) అమలు జరుగుతున్నది. రాష్ర్టాల వాటా తగ్గించి 41 శాతంగా నిర్ణయించారు. ఏపీకి 4.047 శాతం, తెలంగాణకు 2.102 శాతానికి తగ్గించారు. దీంతో రాష్ర్టాల ఆదాయం బాగా తగ్గిపోయింది. రెవెన్యూ లోటున్న రాష్ర్టాలకు 15వ ఫైనాన్స్ కమిషన్ కాలానికి రూ.2,94,514 కోట్లు కేటాయించాలని కమిషన్ సూచించింది. అలాగే స్థానిక సంస్థలకు, ఆరోగ్యానికి, ప్రకృతి వైపరీత్యాలకు, పాఠశాల, ఉన్నత విద్యకు, వ్యవసాయ సంస్కరణలకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కలిపి రెవెన్యూ లోటుతో సహా రూ.10,33,062 కోట్లు కేటాయించింది. అంటే ఏడాదికి రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. ప్రస్తుతం కేంద్రానికి రూ.27,57,820 కోట్లు పన్నుల రూపంలో వస్తున్నాయి. ఇందులో 10 శాతం కూడా రాష్ర్టాలకు కేటాయించలేదు.
ఉపాధి హామీ పథకాన్ని రూ.1,11,171 కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించింది కేంద్రం. ఆర్భాటంగా ప్రకటించిన సబ్సిడీలన్నింటిలో క్రమంగా కోత పెట్టడంతో బలహీనవర్గాల కొనుగోలు శక్తి తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కృషిచేయకపోగా, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నది.అందులో భాగంగానే 27 ప్రభుత్వ బ్యాంకులను 12కు కుదించింది.
గతంలో బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగవేసినవారికి తిరిగి రుణాలు ఇచ్చేం దుకు సిద్ధపడుతున్నది. కార్పొరేట్లకు ఇప్పటికే 12 లక్షల కోట్ల రుణాలను కేంద్రం రద్దు చేసింది. రాష్ర్టాల ఆర్థిక హక్కులను కాలరాసి దేశాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నది. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి దేశ ప్రజలు సమాయత్తం కావాలి.
(వ్యాసకర్త: ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు)
సారంపల్లి మల్లారెడ్డి