కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గృహ నిర్బంధానికి గురయ్యారు. అన్నిరకాల జీవన, వ్యాపార లావాదేవీలు, ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ప్రత్యక్ష కార్యాలయ పని, ప్రత్యక్ష బోధన లేకుండా పోయింది. ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’తో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం మూడవ దశ కరోనా వ్యాప్తి మొదలైందన్న సంకేతాలతో భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలో, అమెరికా, యూరప్ దేశాల్లో డెల్టా వైరస్ విజృంభిస్తున్నది.
దేశవ్యాప్తంగా ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటినుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగస్థుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఐటీ కంపెనీలు కూడా ‘వర్క్ ఫ్రం హోం’కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విధానం అనేకవిధాలుగా అటు ఉద్యోగులు, ఇటు యజమానులకు ఉపయుక్తంగా ఉంటున్నది. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు వెచ్చించే సమయం ఆదా అవుతున్నది. ట్రాఫిక్లో ఇరుక్కొని గంటలకు గంటలు వృథా కావటం నగరాల్లో పరిపాటి. ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉన్నది. ఇదిలా ఉంటే కంపెనీ యాజమాన్యాలు కూడా ఉద్యోగులను తమ ఇండ్లనుంచే పనిచేయటానికి ప్రోత్సహిస్తూ.. ఆ మేరకు రవాణా ఖర్చులు, ఇతర అలవెన్సులను ఉద్యోగులకు ఇవ్వకుండా మిగుల్చుకుంటున్నాయి. ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారా అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీ యజమానులకు కూడా ఉపయోగకరంగా ఉంటున్నదనే అభిప్రాయం నెలకొన్నది. మరో మాటలో చెప్పాలంటే.. ఉద్యోగులకూ, కంపెనీ యాజమాన్యాలకు లాభదాయకమైన, ఉపయుక్తమైన పని సంస్కృతిని కరోనా నేర్పింది.
మహా నగరాల్లో ఉండే ట్రాఫిక్, కాలుష్యం సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు మెజారిటీ ఐటీ కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి 40 శాతం మేర కంపెనీలు తమ కార్యాలయాలను రెండవ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ‘టాలెంట్- 500’ నివేదిక పేర్కొన్నది. రెండవ శ్రేణి నగరాల్లో నవీన సాంకేతిక నైపుణ్యాలున్న ప్రతిభావంతులకు, పారిశ్రామికవేత్తలకు కొదవ లేదు. నిపుణులైన ఉద్యోగస్థుల లభ్యత మౌలిక వసతుల కల్పనకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో కంపెనీలు ఎక్కువ శాతం ద్వితీయ శ్రేణి నగరాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
డేటా శాస్త్రజ్ఞులు, క్లౌడ్ కంప్యూటింగ్ సమాచార భద్రత నిపుణులు, నెట్వర్కింగ్, హార్డ్వేర్, మేనేజ్మెంట్ మొదలైన ఉద్యోగాలకు రెండవ శ్రేణి నగరాల్లో డిమాండ్ ఉన్నదని ఓ అధ్యయనం తెలిపింది. కేరళలోని త్రివేండ్రంలో ఒక అమెరికన్ సంస్థ ‘కాగ్నిటివ్ డిజైన్ ఇనిస్టిట్యూట్’ నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నది. కృత్రిమ మేధతో అంకుర సంస్థలు ఏర్పాటుచేయడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది. జైపూర్ అత్యంత వేగంగా సమాచార సాంకేతిక కేంద్రంగా పరివర్తన చెందుతున్నది. జైపూర్లో 576 అంకుర సంస్థలున్నాయి. ఆకర్షణీయమైన మౌలికవసతులు, నిర్వహణ పర్యవేక్షణలో దక్షిణాసియాలో జైపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటెక్ అంకుర సంస్థలకు నిలయమైన నగరంగా అహ్మదాబాద్ పేరు తెచ్చుకున్నది.
దేశంలోని ఐటీ, బహుళజాతి కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారింది. ఈ క్రమంలోనే వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి రెండవ శ్రేణి నగరాలకు ఐటీ రంగం విస్తరించిన సంగతి తెలిసిందే. మహా నగరాల కన్నా చిన్న నగరాలే సురక్షితమనే అభిప్రాయం బలపడుతున్నది. గతంలో ఐటీ కంపెనీలు పెద్దపెద్ద నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోనే ఐటీ కంపెనీలుండేవి. ఉద్యోగులు కూడా మహా నగరాల్లో నివసించటానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. మారిన పరిస్థితులు, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల కారణంగా ద్వితీయ శ్రేణి నగరాలవైపు చూసే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు చేయూతనివ్వాలి. జీవన పరిస్థితులు మెరుగ్గా ఉండేవిధంగా సకల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలి. ఈ విధమైన కార్యాచరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అన్నివర్గాల, ప్రాం తాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. మహానగరాలకే పరిమితమై ఉన్న ఐటీరంగాన్ని ఇప్పటిదాకా జిల్లా కేంద్రాలుగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాలకు తరలించి అక్కడ అభివృద్ధి చేయటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందనటంలో అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయం)
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి