రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్ అనాథల సంక్షేమం పట్ల దృష్టిసారించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనాథ సంరక్షణ
కోసం సమగ్రమైన విధాన రూపకల్పనకు ప్రభుత్వాన్ని సమాయత్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే తల్లి, తండ్రిగా వుండి రక్షణ, సంరక్షణ చేపట్టి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావటం ముదావహం. దీనికోసం 11 మంది క్యాబినెట్ మంత్రులతో అనాథలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలు అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించడం సంతోషదాయకం.
ఈ మధ్యకాలంలో కొవిడ్ మహమ్మారితో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలారు. అయితే వారి సంక్షేమం, పునరావాసం కోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రాల బాలల హక్కుల కమిషన్లను ఆదేశించింది. దీనిలో భాగంగా వారిని ఆదుకోవడానికి రాష్ర్టాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాయి.
తల్లి, తండ్రి లేక ఊరు, ప్రాంతం తెలియక సమాజంలో ఎంతో మంది అనాథలు నిరాశ్రయులుగా ఉన్నా రు. వీరిని ఆదుకోవాలని రాజ్యాంగ అధికరణలు 15 (4),16(4) సైతం పేర్కొంటున్నాయి. అసలు అనాథ లు అంటే ఎవరు? వారిని ఎలా గుర్తించాలి? వారికి సర్టిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? ఏ వయస్సు వారు దీని పరిధిలోకి వస్తారు? 18ఏండ్ల లోపు ఉన్న బాలలకే ఇది వర్తిస్తుందా? అనే ఎలాంటి సాంకేతిక సమస్యలకు తావు ఇవ్వకుండా స్పష్టత ఇవ్వవలసి ఉంది. మన రాష్ట్రంలో 465 గుర్తింపు పొందిన బాలల సంరక్షణ కేంద్రాలలో దాదాపు 17 వేల మంది బాలలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ బిడ్డలు 18ఏండ్లు నిండిన తర్వాత ఏమైపోతున్నారో ఎవరిదగ్గ్గరా సరియైన ఆధారాలు, లెక్కలు లేవు. అనాథ బాలికలు, మహిళలు సరియైన రక్షణ లేక అనేక అకృత్యాలకు గురౌతున్న పరిస్థితి ఉన్నది.
10వ తరగతి తర్వాత పై చదువులు చదవాలంటే అనాథలకు వివిధ సంక్షేమ పథకాలు వర్తించాలి. స్కాలర్షిప్లు, విద్యాలయాలలో సీట్లు పొందుటకు వారి కులం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎన్నికల గుర్తింపు కార్డ్, నివాస, ఆదాయం సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. దీంతో వారు ఏవిధమైన ప్రభుత్వ పథకాలనూ పొందలేక చదువులను మధ్యలోనే ఆపివేస్తున్నారు.
తమను అనాథలుగా పిలువవద్దని, ‘స్టేట్ చిల్డ్రన్’అని పిలువమని, సమాజంలో గుర్తింపు కావాలని రక్షణ, సంరక్షణ, తమ హక్కులకు చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటున్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, వివిధ పథకాలను పొందుటకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని అడుగుతున్నారు. వీరి సాధికారత కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశం కల్పించాలని కోరుతున్నారు. విద్యహక్కు చట్టం- 2009 ప్రకారం 25 శాతం కోటాతో ప్రైవేటు విద్యాలయాలలో ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉన్నది.
ఆదరణ కరువై నిరాశ్రయులైన వారికి ప్రభుత్వమే తల్లి, తండ్రిగా వుండి, కుటుంబాలతో నిలదొక్కుకునే వరకు అనేక తోడ్పాట్లు అందించాల్సిన అవసరమున్నది. ఎలాంటి వివక్ష లేకుండా వారి హక్కులకు చట్టబద్ధత కల్పించి వారి జీవితాలకు మరింత భరోసా ఇవ్వాలి. ఈ నేపథ్యంలో అనాథల సాధికారతకోసం ఒక సమగ్రమైన పాలసీ తీసుకువస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది.
(వ్యాసకర్త: పూర్వ బాలల సంక్షేమ కమిటి సభ్యులు, రంగారెడ్డి జిల్లా. బాలల హక్కుల సామాజిక కార్యకర్త)
నారా నాగేశ్వర్ రావు