మతాల మధ్య చిచ్చు రేపైనా సరే.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పగటికలలు కంటున్నది, కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ ఇటీవల హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించింది. దేశంలోనే ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనిచేయని మోదీ ప్రభుత్వం తెలంగాణలో తిష్ఠవేసి ఇక్కడి ప్రజలకు ఒరగబెట్టేదేమిటో అంతుచిక్కని విషయం.
కేసీఆర్… సుదీర్ఘకాలం ఉద్యమం చేసి ఉద్యమ నాయకుడయ్యారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన రాష్ర్టాన్ని సాధించి, ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశంలోనే ముందు నిలబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం, నీళ్ల తగాదాలు సృష్టించడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నది. పిచ్చోడి చేతిలో రాయి వలె.. ఎలాగూ చేతిలో అధికారం ఉంది కదా అని తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. బీజేపీ తీరు ఒక్క తెలంగాణపైనే కాదు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే తీరు. దక్షిణాది నుంచి కేంద్రాన్ని శాసించే నాయకులెవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను వేధింపులకు గురిచేస్తున్నది. దక్షిణాది నుంచే కాదు, మొత్తం దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతున్న రాజకీయ దురంధరుడు కేసీఆర్.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ఆ ధనాన్నంతా ప్రైవేటు వ్యక్తులపరం చేసి ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నది. ప్రభుత్వం ఐశ్వర్యవంతంగా ఉంటేనే దేశం, ప్రజలు సమస్యల్లేకుండా, సంపన్నులుగా ఉన్నట్టు లెక్క. లక్షల కోట్ల అప్పుల్లో దేశం మునిగితే దేశాన్ని అమ్మకానికి పెట్టినట్టే కదా? దేశ సార్వభౌమ ఆధిపత్యానికి భంగం వాటిల్లినట్టే కదా! అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతి పరిశ్రమను, కమ్యూనికేషన్ వ్యవస్థనూ, రైల్వేలను, వైమానికరంగాలను కూడా అమ్మకానికి పెట్టి ప్రైవేటుపరం చేస్తున్నది. తద్వారా కోట్లాదిమంది యువత నిరుద్యోగులుగా మారి రోడ్లపై నిలబడుతున్నారు.
అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశ ఆత్మగౌరవంపై దృష్టిపెట్టారు. అప్పులపాలై, ప్రభుత్వరంగం నిర్వీర్యమవుతూ, దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తుల పరం చేస్తున్న బీజేపీకి సవాల్గా నిలిచారు. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటాలను ఇవ్వకుండా వేధిస్తున్న బీజేపీని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరాన్ని గుర్తించి ముందుకుతెచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చి మైనారిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ వైఖరిని ఖండించారు. వందల ఏండ్లుగా ఈ దేశంలో ఉంటూ ఈ మట్టిని ముద్దాడుతూ బతికే ముస్లిం సోదరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలతో దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయం తానేనని నిరూపిస్తూ జాతీయ పార్టీని స్థాపిస్తున్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా అనుసరిస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ పారిశ్రామిక విధానాలు, గ్రామీణాభివృద్ధి, ప్రకృతి సంరక్షణ, రైతుబంధు, దళితబంధు లాంటి బృహత్తర పథకాలను దేశవ్యాప్త మ్యానిఫెస్టోగా తీసుకుంటే భారతదేశ ఆత్మగౌరవమూ పెరిగి దేశాభివృద్ధి సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు. దక్షిణాదికే కాదు, భారతదేశ ఆత్మగౌరవ రాజకీయాలకు నిలువెత్తు దర్పణం కేసీఆర్.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567