మునగాల పరగణా నడిగూడెం గ్రామం వొడ్లోళ్ల బజారు నుంచి.. (హైదరాబా ద్) నగరందాకా నడిసొచ్చిన దీర్ఘకవితా ప్రవాహమతడు. కవితై, పాటై, సమకా లీన సామాజిక ఆందోళనల వచనరచనా చిత్రాలై విస్తరించిన కలం శ్రామికుడు అతడు. ఎక్కడ ఉన్నా పదిమందిలో సందడిగా గలగలా మాట్లాడే జలపాతమ తడు. అతడే.. జూలూరు గౌరీశంకర్. చిన్ననాడే పోతులూరి వీరబ్రహ్మం తాత్వికగానాలు ఒంటబట్టించుకొని, రాజా నాయని వెంకట రంగారావు గ్రంథాలయోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ‘సాహిత్య అకాడమీ’ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జూలూరు గౌరీశంకర్ పల్లెజీవన ప్రస్థానం.., తెలంగాణ సంస్కృతి, సాహిత్యాల వికాస అభివృద్ధీ, భవిష్యత్తు ఆయన మాటల్లోనే..
మీ ఊరి గురించి చెప్పండి..?
తెలంగాణ పల్లె జీవితానికి ప్రతీక మా ఊరు నడిగూడెం. మునగాల పరగణా జమీందారు స్వగ్రామంగా, మాది ఒక సమస్త వృత్తి నివాస వికాసాల సమిష్టి జీవన సమాహారం. ఒక్కో వృత్తి కులానికి ఓ బజారు. వ్యవసాయ నాగరికతా దర్పణం మా ఊరు.
మీ ఆలోచనా ధోరణికి పునాది ఎక్కడ ?
మా తాత పెదబుచ్చయ్య బ్రహ్మంగారి విగ్రహం తయారు చేసి ఓ గుడికూడా కట్టించాడు. ఏడాదికో సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. రాత్రివేళల్లో తెల్లవారుజామున మా బజారంతా బ్రహ్మంగారి తత్వగానాలతో మారుమోగేది. మా నాయ న చిన బసవయ్య మంచి గాయకుడు, నటుడు. ‘చెప్పలేదంటనక పోయేరూ.. జనులా ర మీరు..’ అంటూ.. బ్రహ్మంగారి తత్వగీతాలు రాగయుక్తంగా పాడేవాడు. నేను బుద్ధి ఎరిగినప్పటి నుంచీ.. మా నాయన తత్వగీతాలూ, మా బజార్లోని పెద్ద బాడిశ మూలుగులు, కొలిమి దగ్గర ఏస్తున్న సమ్మెట దెబ్బల చప్పుళ్లతోనే నిద్రలేచేటోన్ని. మా ఇండ్లమధ్యనే ఓ ముస్లిం కుటుంబం (సిద్దప్ప వలె) ఉండేది. కుల,మత వివక్షలు లేని పల్లె పని పాటల శ్రమజీవనం ఉన్నతమైన మానవ సంబంధాల పరిమళంగా భాసిల్లేది. ఊహ తెలిసినప్పటినుంచి నా సావాసమంతా మా బజారుకొచ్చే అన్ని కులాల వ్యవసాయ దారులతోనే. వంకర టింకరగా ఏ ఆకారంలేని తుమ్మమొద్దును.. దాలికి మోపు చేసి చూస్తుండగానే ఇంపైన నాగలిగా చెక్కే పెద్ద బాడిశ పనితనం అబ్బురపరిచేది. చిన్న బాడిశ రెండు వైపులా ఉపయోగించే తీరూ, ఉలితో నాగలిమేడికి చేసే రంధ్రాలు నన్ను అబ్బుర పర్చేవి. వడ్రంగి నైపుణ్యంతోనే వ్యవసాయ నాగరికత జవజీవం పోసుకున్న తీరు కాలక్రమంలో తెలిసివచ్చింది.
సాహిత్యాభిలాష ఎలా ఏర్పడింది?
మా ఊరు జమీందారు రాజా నాయిని వెంకటరంగారావు మా ఊర్లో తెలుగు భాషో ద్యమానికి పూనికగా గ్రంథాలయాన్నే స్థాపించాడు. ‘విజ్ఞానచంద్రిక గ్రంథ మండలి’ పేరుతో 60 దాకా పుస్తకాలను అచ్చువేశాడు. వరంగల్లో చారిత్రక ‘రాజ రాజనరేంద్ర గ్రంథాలయా’న్ని స్థాపించటంలో వెంకట రంగారావు పాత్ర ప్రధానమైనది. ఇలాంటి సామాజిక పరిస్థితుల మట్టి పొత్తిళ్లలోంచి ఎదిగి, కోదాడలో కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరిన. అప్పటిదాకా మా ఊరే ప్రపంచంగా ఉన్న నేను.., ఓ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయ్యింది. కంజెరమీద ‘మారాలీ.. మన సమాజమూ-మారాలి మారాలి మన సమాజమూ’ పాట మొదలు.. ఎర్రజెం డా పాటలు, విప్లవోద్యమాలు, త్యాగాలు విస్తృత ప్రపంచంలోకి నన్ను నడిపించాయి.
మలి తెలంగాణ ఉద్యమ ప్రభావం?
జర్నలిస్టు వృత్తిని ఎంచుకొని సామాజిక గమనాన్నీ, వైరుధ్యాలను అర్థం చేసుకుంటున్న క్రమంలోంచే చిన్నప్పుడు కోటగోడ బండరాళ్లపై రాసిన జై తెలంగాణ నినాదం తిరిగి ముందుకొచ్చింది. 1997 ఏప్రిల్లో భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభకు హాజరైన. అక్కడనే నా ‘నా తెలంగాణ’ అనే 34 పేజీల దీర్ఘకవిత ఆవిష్కరణ జరిగి రెండువేల కాపీలు అమ్ముడయ్యాయి. నాటి నుంచి వివిధ అంశాలపై 350 పుస్తకాలు తెచ్చిన. ‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పేరుతో 2001లో నా సంపాదకత్వంలో తొలి బీసీ కవితా సంకలనం తెచ్చిన. 1992లో ‘పాదముద్ర’ దళిత బహజన జీవిత చిత్రణ దీర్ఘకవిత, 2002లో ‘పొక్కిలి’ మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి కవితా సంకలనం తెచ్చిన. 400 పేజీల ఈ సంకలనాన్ని తేవటం కోసం నా సహచరి చేతి గాజులు అమ్మి అచ్చు వేసినందుకు ప్రతిఫలంగా.. ఐదు నెలల్లోనే రెండు వేల కాపీలు అమ్ముడు పోయాయి. సురవరం వెలువరించిన ‘గోలకొండ’ సంకలనం తర్వాత, మలిదశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన తొలి కవితా సంకలనంగా ‘పొక్కిలి’. ఇందులో కేసీఆర్ రాసిన కవిత కూడా ఉండాలని ప్రయత్నించిన. కానీ అప్పుడున్న ఉద్యమ పరిస్థితుల్లో సార్ నుంచి కవితను తీసుకోవటం సాధ్యం కాలేదు. ఎప్పటికైనా సాహిత్య పిపాసకుడైన కేసీఆర్గారి రచనల సంకలనం తేవాలనేది నా కల.
సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఏం చేయాలనుకుంటున్నారు?
అందుబాటులో లేని వైతాళికుల గ్రంథాలను పునర్ముద్రించాలనుకుంటున్నా. పాఠశాల స్థాయినుంచే వారి జయంతులు, వర్ధంతుల సందర్భంలో కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నా. పెద్దల , సలహా, సూచనలతో భాషా సాంస్కృతిక వికాసం కోసం చాలా చేయాల్సి ఉన్నది. ఆ దిశ గా అందరితో కలిసి ఓ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకుపోవాలని భావిస్తున్నా. తెలంగా ణ భాషా, సాంస్కృతిక వికాసాలు, చరిత్రపై ప్రామాణిక గ్రంథాలు తెచ్చేందుకు కృషి చేస్తా.
తెలంగాణ భావన ఎప్పుడు కలిగింది?
మా ఊర్లోనే ప్రాథమిక విద్య చదువుకుంటున్నప్పుడు.. ఆగస్టు 15, జనవరి 26 వచ్చినప్పుడు స్కూలంతా పండుగ వాతావరణం ఉండేది. పొద్దున్నే లేచి.. ‘ప్రభాత భేరీ’లో ‘బోలో స్వతంత్ర భారత్కీ జై..’, ‘జై జై తెలంగాణ, జై వీర తెలంగాణ’ నినాదాలతో ఊరంతా తిరగేటోళ్లం. బహుశా 69 తెలంగాణ ఉద్యమ ప్రభావంతో కావచ్చు.. ఆ నినాదాలు మా ఊర్లో సజీవంగా కొనసాగా యి. నినాదాల్లో ‘వీర తెలంగాణ’ నినాదం నన్ను అమితంగా ప్రభావితం చేసింది. ‘జై తెలంగాణ నినాదా’న్ని కోట గోడ రాళ్లపై ‘చాక్పీస్’తో రాసి మురిసి పోయేటోన్ని.
2007 నుంచి 14 దాకా తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శిగా, అధ్యక్షునిగా పల్లె పల్లెనా తిరిగిన. 2007లో కేసీఆర్ రాజీనామాతో వచ్చిన కరీంనగర్ ఉప ఎన్నికల సందర్భంగా.. ‘ఇది తెలంగాణ సంగ్రామం- తెగిస్తేనే తెలంగాణ సాధ్యం’ అన్న ఉద్యమనినాదంతో రాసిన ‘చెకుము కిరాయి’ దీర్ఘకవితను ఓ బీడీ కార్మికురాలితో ఆవిష్కరింపజేసి 15వేల కాపీలను ప్రజల్లో పంచిన. ఆ ఎన్నికల సందర్భంగా ఓ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మేం క్రికెట్ కిట్లూ, డబ్బు సంచులు పంచటం లేదు. మా కవులు, కళాకారులు రాసి పాడిన పుస్తకాలు, క్యాసెట్లను పంచుతున్నామ’ని ప్రకటించి, రచయితలు, కళాకారుల పాత్రను కొనియాడారు.
‘ఆంధ్ర కవులారా మీరెటు వైపు’ అని ప్రశ్నించారన్నది నిజమేనా?
తెనాలిలో జరిగిన సాహిత్య సభలో తెలంగాణ ఏర్పాటు, రాష్ట్ర విభజన ఆవశ్యకతను చర్చకు పెట్టడం సంచలనమైంది. 2009లో గాజువాకలో సాహిత్య సదస్సులో ‘ఆంధ్రకవులారా మీరెటు వైపు’ అని నేనేసిన ప్రశ్నకు కారా లేచి.. ‘మేం తెలంగాణ వైపే’నని ప్రకటించారు.