ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పాశ్చాత్య దేశాల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. క్రీ.శ.1096లో స్థాపించబడిన ఈ విద్యాలయం మొదటినుంచీ అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు గడించింది. ఇతర దేశాల వలె, భారత్ కూడా శతాబ్దాల నుంచి ఆక్స్ఫర్డ్తో సంబంధాలు కలిగి ఉన్నది.
విదేశీ విద్యాభ్యాసం చేయాలని అభిలషించే ప్రతి ఒక్కరూ ఆక్స్ఫర్డ్లో చేరాలని కలలు కనడం పరిపాటి. నిష్ణాతులైన అధ్యాపకులు, ఉన్నత ప్రమాణాలు గల బోధనా పద్ధతులు, విశిష్ట శ్రేణికి చెందిన వసతి సౌకర్యాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ, లేబొరేటరీ సౌకర్యాల వంటివి ఇందుకు కారణం. ఆక్స్ఫర్డ్ పట్టా పుచ్చుకున్న ప్రతి ఒక్కరూ స్వదేశంలో గౌరవప్రదమైన ఉన్నత ఉద్యోగావకాశాలు పొందుతున్నారు.
విద్యార్థులకు అందుబాటులో అనేక స్కాలర్షిప్లు, ఫ్రీ షిప్లు కూడా ఆక్స్ఫర్డ్లో ఉండటం గమనార్హం. వాటిలో ముఖ్యమైనది రోహిడ్ స్కాలర్షిప్. ఇప్పటిదాకా 100 మంది భారత విద్యార్థులు మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మకమైన ఫెలోషిప్ను పొందారు. విద్యార్థులకే కాకుండా అనేక భారతీయ అధ్యాపకులకు కూడా ఆక్స్ఫర్డ్ మిక్కిలి అభిలషణీయమైనది. ప్రస్తుతం నలభైకి పైచిలుకు ప్రొఫెసర్లు భారత్కు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేస్తున్నారన్న తీరు, భారత అధ్యయనాలపై ఆక్స్ఫర్డ్లో ఎంత ప్రాముఖ్యం ఉన్నదో తెలుస్తున్నది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) పుస్తక ప్రచురణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. 1478లో స్థాపించబడిన ఈ ప్రచురణాలయం ప్రపంచంలో గల అన్ని విశ్వవిద్యాలయ ముద్రణాలయాల కన్నా పెద్దది, పురాతనమైంది. 1912లో తొలిసారి ఓయూపీ బ్రాంచ్ మన దేశంలో స్థాపించబడింది. ప్రస్తుతం కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాల్లో దీని బ్రాంచిలున్నాయి.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పేరు ప్రఖ్యాతులు అక్కడి బోడ్లియన్ లైబ్రరీపై ఆధారపడి ఉందన్నది అతిశయోక్తి కాదు. యూనివర్సిటీతో పాటే స్థాపించబడిన ఈ లైబ్రరీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. లండన్లోని బ్రిటిష్ లైబ్రరీ తర్వాత చెప్పుకోతగినది బోడ్లియన్ లైబ్రరీ. ఇందులో లక్షల గ్రంథాలు, పత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. బోడ్లియన్ లైబ్రరీ ప్రత్యేకమైనది. ఇది సంప్రదించడానికే పరిమితమైన పుస్తక భాండాగారం. అంటే రెఫరెన్స్ లైబ్రరీ మాత్రమే. ఇక్కడ పుస్తకాలను బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదు. బోడ్లియన్ లైబ్రరీ శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ వచ్చిన కారణంగా నేడు అనేక అనుబంధ లైబ్రరీలను స్థాపించారు. వీటిలో ప్రధానమైనది ఇండియన్ ఇన్స్టిట్యూట్ సెక్షన్ లైబ్రరీ. దీనిలో కేవలం భారత్కు సంబంధించిన గ్రంథాలు, పత్రికలు, రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు సేకరించబడి ఉన్నాయి. 1883లో స్థాపించిన ఈ విభాగంలో లక్షకు పైగా గ్రంథాలున్నాయి. ముఖ్యంగా సంస్కృత భాషకు సంబంధించిన అనేక విలువైన ప్రచురణలు ఇందులో ఉన్నవి. భారత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించిన ఒక ప్రత్యేక భవనంలో ఈ గ్రంథాలన్నీ అధునాతన పద్ధతిలో భద్ర పరుస్తారు.
ప్రస్తుతం అనేకమంది భారతీయ విద్యార్థులు ఆక్స్ఫర్డ్లోని దాదాపు ముప్ఫై కళాశాలల్లో చదువుతున్నారు. ప్రధానంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం వంటి కోర్సులు మన విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. చరిత్ర, రాజనీతి శాస్త్రం, సామాజికశాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఆంగ్ల వాఙ్మయం వంటివాటిల్లో కూడా అధిక సంఖ్యలో అధ్యయనం కొనసాగిస్తున్నారు. డాక్టరేట్ పట్టా కోసం దాదాపు అన్ని విభాగాల్లో మన విద్యార్థులు ఉండటం విశేషం.
ఇంతటి చరిత్ర కలిగిన బోడ్లియన్లోని అతి ప్రాచీన భవనానికి ప్రస్తుతం పెద్ద ఎత్తున పునరుద్ధరణ మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల ఆక్స్ఫర్డ్ అభిమానులు, పూర్వ విద్యార్థులు దీనికి అవసరమైన నిధులు సేకరించి సాయపడుతున్నారు. ఆక్స్ఫర్డ్లోని ఇతర చిన్న లైబ్రరీలైన ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ లైబ్రరీ, హిస్టరీ ఫాకల్టీ లైబ్రరీ, ఎలిజబెత్ లైబ్రరీ మొదలగు వాటిలో కూడా భారతీయ శాస్ర్తాలకు సంబంధించిన పలు గ్రంథాలు, పత్రాలున్నాయి.
ఆక్స్ఫర్డ్లోని అష్ మోలియన్ మ్యూజియంలో భారతదేశ చరిత్రకు సంబం ధించిన అనేక కళాఖండాలు, చిత్రపటాలు ప్రదర్శింపబడి ఉన్నాయి. పిట్స్ రివర్స్ అనే మరొక మ్యూజియంలో మన దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన సామాన్య జన బాహుళ్యపు విభిన్న వేషధారణలు, వారి ఆచార వ్యవహారాలను ప్రతిబింబింపజేసే చిత్రకళలను ప్రదర్శించారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న సీనియర్ ప్రొఫెసర్ల ప్రమేయంతో ‘కాన్టెంపరరీ ఇండియా’ అన్న ఒక కొత్త కోర్సును ఇటీవల ఆక్స్ఫర్డ్లో ప్రారంభించారు. ఒక ఏడాదికి పరిమితమైన ఈ ఎమ్మెస్సీ కోర్సుతో సమకాలీన భారతదేశానికి సంబంధించిన అన్నిరంగాల్లో పాశ్చాత్య విద్యార్థులకు అవగాహన కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం పట్ల ఆక్స్ఫర్డ్ ఎంత మక్కువ చూపుతున్నదో దీన్నిబట్టి తెలుస్తున్నది.
ఆక్స్ఫర్డ్తో మన సంబంధాలు శతాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. థామస్ స్టీవెన్స్ అనే వ్యక్తి ఆక్స్ఫర్డ్ నుంచి మన దేశానికి వచ్చిన మొట్టమొదటి ఆంగ్లేయుడు. 1579లో వచ్చిన స్టీవెన్స్ గోవా మొదలైన నగరాలను సందర్శించి ఇక్కడి పరిస్థితులను తెలుపుతూ అనేక ఉత్తరాలను రాసి, వాటిని పోర్చుగీసు నౌకల ద్వారా తన దేశానికి పంపాడు. అతని లేఖల మూలంగా భారతదేశ సిరిసంపదలు, ఇక్కడ లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలు, సుసంపన్న ఆర్థిక పరిస్థితులను గురించి తెలుసుకున్న ఆంగ్లేయులు 1600లో తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని స్థాపించారు. ఈ వర్తక కంపెనీ క్రమంగా మన దేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకొని పరిపాలించిందో మనకు తెలిసిందే. ఆక్స్ఫర్డ్లోని ప్రసిద్ధ కళాశాలల్లో ఒకటైన సెయింట్ ఆంథోని కళాశాలలో ఆసియా అధ్యయన కేంద్రం స్థాపించబడి విదేశీ విద్యార్థులను ఆకర్షించింది. ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ ఈ కాలేజీలో ఏండ్ల తరబడి భారతదేశ చరిత్రను బోధించారు.
ఈ మధ్యనే బోడ్లియన్ లైబ్రరీలో ‘ఆక్స్ఫర్డ్లో భారత ప్రతిబింబాలు’ అన్న అంశంపై ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. 19వ శతాబ్దం నుంచి భారత విద్యార్థులు ఆక్స్ఫర్డ్ ప్రగతికి ఎలా దోహదం చేశారో తెలియచేయడం ఈ ఎగ్జిబిషన్ లక్ష్యం. అనేక శతాబ్దాల భారత్-బ్రిటన్ సంబంధాలు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మూలంగా కూడా గాఢంగా పెంపొందాయనటంలో అతిశయోక్తి లేదు.