అనుకున్న చోటుకు వెళ్లాలంటే అందుకు తగిన మార్గాన్ని ఎంచువాలి. మార్గం అనుకూలంగా లేకపోతే ఆయాసం తప్పదు. మార్గం దారి చూపదు. మన బుద్ధిని అనుసరించి మార్గం ఏర్పడుతుంది. బుద్ధి సారథిలా పనిచేసినప్పుడల్లా మార్గాయాసం లేకుండా గమ్యాన్ని చేరుకోగలం. మార్గాలు అనేకం ఉంటాయి. కాని ఏ మార్గంలో వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరగలమో ఆ మార్గాన్నే ఎంచుకోవాలి. అందుకే విజ్ఞులు మార్గం కన్నా మార్గదర్శకుడు గొప్ప అని చెబుతుంటారు. ఈ మార్గంలో ప్రయాణిస్తే బాగుంటుంది అని చెప్పిన వాడే గురువు. అలాంటి గురువులు ప్రాచీనకాలంలో చాలామంది ఉన్నారు. వారంతా సుప్రసిద్ధులే.
నిత్యజీవితంలో ధన సంపాదన కోసం అనేక మార్గాలను అన్వేషిస్తాం. ఒకమార్గం కాకపోతే మరొకదాన్ని ఎంచుకొని ఫలితం పొందుతాం. అయితే, మానవ జీవితంలో ప్రధానంగా నడుచుకునే మార్గాలు రెండు ఉన్నాయని కఠోపనిషత్ తెలియజేస్తున్నది. ఈ ఉపనిషత్తులో యమాచార్యుడు తన శిష్యుడైన నచికేతుడికి రెండు మార్గాలను ఉపదేశించాడు. వాటిలో ఒకటి శ్రేయోమార్గం. మోక్షాన్ని కలిగించే మార్గం ఇది. భూలోక సుఖాన్ని ఇచ్చేది ప్రేయోమార్గం. ఈ రెండూ ఒకదాని కన్నా మరొకటి భిన్నమైనవి. శ్రేయోమార్గం ఆరంభంలో కఠినంగా ఉంటుంది. చివరగా అది ఆనందానికి కారణభూతం అవుతుంది. ప్రేయోమార్గం మొదట సుఖాన్ని కలిగిస్తుంది. కానీ, చివరికి దుఃఖానికి దారితీస్తుంది.
శ్రేయో, ప్రేయో మార్గాల ప్రయోజనాలు కూడా భిన్నమైనవే. శ్రేయోమార్గం ముక్తికి కారణం అవుతుంది. ప్రేయోమార్గం పునర్జన్మకు హేతువు అవుతుంది. శ్రేయోమార్గంలో నడిచేవాడు సంసార సాగరం నుంచి బయటపడతాడు. ప్రేయోమార్గంలో ప్రయాణించేవాడు సంసారదుఃఖ సాగరంలో మునిగితేలుతుంటాడు. సామాన్యుడు ఈ రెండు మార్గాల తారతమ్యం తెలుసుకోలేక, నిరంతరం ప్రేయోమార్గంలో నడుస్తుంటాడు. నిజానికి ఈ రెండు మార్గాల్లోని మంచి-చెడులను బుద్ధిమంతులైన విద్వాంసులు మాత్రమే గుర్తించగలుగుతారు.
మందబుద్ధులకు ధనాదుల మీద కోరిక ఎక్కువ. వాటిని సంపాదించుకోవడంలో, సంపాదించిన దాన్ని రక్షించుకోవడంలో, యథాప్రకారం వాటిని అనుభవించడంలో వారికి సమయమే తెలియదు. అందుకే లౌకిక సుఖాలకు ఇచ్చే ప్రేయోమార్గం వారికి మంచిదిగా కనిపిస్తుంది. జీవితమంతా ఈ మార్గానికే అంకితం చేసే మానవులు లోకంలో చాలామంది ఉంటారు. సాంసారిక సుఖాలే వారికి పరమావధి, పరమార్థం అవుతాయి. ఇక విద్వాంసులు శ్రేయోమార్గాన్ని వెలుగుతోనూ, ప్రేయోమార్గాన్ని చీకటితోనూ పోలుస్తారు. భిన్నమైన ఫలాలను ఇచ్చేవి కనుక రెండిటినీ వెలుగు-చీకటితో పోల్చారు. శ్రేయోమార్గాన్ని విద్య అని, ప్రేయోమార్గాన్ని అవిద్య అని పిలుస్తారు. కేవలం కర్మనిష్ఠులై, లౌకిక సుఖాలను ఆకాంక్షించే వారు అవిద్యను ఆశ్రయిస్తారు. కానీ, బ్రహ్మనిష్ఠులై నిష్కామ కర్మలను కొనసాగించేవారు విద్యను ఆశ్రయిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే కర్మే అవిద్య, జ్ఞానమే విద్య. వివేక జ్ఞానం కలిగినవారే ప్రేయోమార్గాన్ని కాదని, శ్రేయోమార్గంలో నడుస్తారు. ప్రేయోమార్గాన్ని స్వీకరించినవారు అవివేకంతో ముక్తికి దూరం అవుతారు. శ్రేయోమార్గాన్ని ఆచరించినవారు వివేకంతో ముక్తికి దగ్గరవుతారు.
ప్రేయోమార్గంలో నడిచేవారు ధనం, ధాన్యం, అధికారం, కీర్తి, సంతానం మొదలైన సంపదలను సుఖ కారకాలుగా భావించి, అవి నశించగానే దుఃఖంలో కూరుకుపోతారు. అటువంటివారిని అర్భకులని, మూఢులని పిలుస్తారు. శ్రేయోమార్గంలో నడిచేవారు నిరంతరం అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం తదితర సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ప్రేయోమార్గంలో వెళ్లేవారికి కేవలం ఇహం హద్దు. కానీ, శ్రేయోమార్గంలో వెళ్లేవారు ఇహసుఖాలను, ఐహిక బంధాలను వదులుకుంటారు. ముఖ్యంగా ప్రకృతి, పురుష వివేకాన్ని సంపాదించుకుంటారు. ఆత్మజ్ఞానంతో వ్యవహరిస్తారు. అటువంటి వారినే యోగులు అని పిలుస్తారు. భోగులు ప్రేయోమార్గంలో నడుస్తారు. యోగులు శ్రేయోమార్గం అనుసరిస్తారు.
– ఆచార్య మసన చెన్నప్ప