‘క్రిప్టో’.. ప్రస్తుతం ఇది ప్రపంచ కరెన్సీ. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కాగా, కొన్ని దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీతో చట్టపరంగా లావాదేవీలు జరపడానికి టెక్నాలజీ సాయం అందించాలని ఎల్సాల్వెడార్ ప్రపంచ బ్యాంక్ కు విజ్ఞప్తి చేయగా, దానికి వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది. అనేక దక్షిణ అమెరికా, ఆఫ్రికాదేశాలు బిట్కాయిన్కు చట్టపరమైన హోదా పై ఆలోచిస్తున్నాయి. బిట్ కాయిన్ను లీగల్ నగదుగా గుర్తించే దేశాలు, సంస్థలు క్రమంగా పెరుగుతుండటం విశేషం.
క్రిప్టో కరెన్సీలో అనేక రకాల కాయిన్లు, టోకెన్లు ఉన్నా 70 శాతం మార్కెట్ ‘బిట్ కాయిన్’దే. ఆ తర్వాత ‘ఎథేరియం’ ఉంటుంది. అయితే వీటిని మైనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఒక బిట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్లాక్లు ఏర్పడతాయి. ఈ బ్లాక్లను కొన్ని ‘మ్యాథమెటికల్ హాష్’ల ద్వారా మైనర్లు సాల్వ్ చేస్తారు. తద్వారా కొత్త బిట్ కాయిన్ జనరేట్ అవుతుంది. దీనికోసం శక్తిమంతమైన కంప్యూటర్లు, అత్యధిక సామర్థ్యం గల ప్రాసెసర్లతో కూడిన సర్వర్లు అవసరమవుతాయి. బిట్కాయిన్ మైనిం గ్ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం సుమా రు 1.3 ఏండ్లు. మైనింగ్కి ఉపయోగించిన తర్వాత కంప్యూటర్లు పనికి రాకుండా పోవడంతో, ఈ ప్రక్రియ లో చాలా ‘ఈ-వ్యర్థాలు’ ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా క్రిప్టోల సృష్టికి అపారంగా విద్యుత్ అవసరమై, పర్యావరణానికి నష్టం వాటిల్లుతున్నది.
క్రిప్టో కాయిన్లతో జరిగే వ్యవహారాలు ప్రత్యేక సర్వర్లలో ఉన్నప్పటికీ వాటి భద్రతకు హామీ ఉండదు. ఇది పూర్తిగా డిజిటల్ కావడంతో సమస్యలు వస్తే వినియోగదారులు నష్టపోయే ప్రమాదమున్నది. బిట్ కాయిన్ల ద్వారా మోసపోయినా, ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా దీని ధర ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. టెస్లా కార్లకు చెల్లింపులు బిట్కాయిన్ కరెన్సీతో స్వీకరించలేమని ఆ కంపెనీ యజమాని ఎలాన్మస్క్ ప్రకటించడంతో బిట్కాయిన్ విలు వ రూ.45 లక్షల నుంచి రూ.25 లక్షలకు పడిపోయింది. గతంలో కొంతమంది హ్యాకర్లు పోలీ నెట్వర్క్కు చెంది న బ్లాక్ చైన్ సైటులోని లోపాలను కనిపెట్టి ఎథర్ లాంటి కొన్ని వేల డిజిటల్ టోకెన్లను దొంగిలించారు. దీని విలువ సుమారు రూ.4,445 కోట్లు. కాయిన్ చెక్, ఎమ్టీ గోక్స్ లాంటి ఎక్స్చేంజీల్లోనూ మోసాలు జరిగాయి.
క్రిప్టో కరెన్సీని మనీ ల్యాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ఆర్థిక లావాదేవీలను సాగనిస్తే నల్లధనాన్ని తెలుపు కింద మార్చే ప్రమాదమూ ఉంది. మూల ధనాన్ని సరిహద్దులు దాటించవచ్చు.
దేశంలో క్రిప్టో కరెన్సీల వినియోగంపై పూర్తిగా నిషేధంగానీ, స్పష్టమైన విధివిధానాలు, నియంత్రణలు గానీ లేవు. 2018లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆర్బీఐ నిషేధించింది. కానీ 2020లో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని కొట్టేసి బిట్ కాయిన్ల కొనుగోలు, అమ్మకాలకు అనుమతినిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల మార్కెట్ మూలధన విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరడంతో వాటిని తేలిగ్గా తీసివేయలేం. క్రిప్టోలకు ప్రాతిపదిక అయిన భవిష్యత్ టెక్నాలజీ బ్లాక్ చెయిన్ సాంకేతికత ద్వారా దేశ ఆర్థికానికి కలిగే ప్రయోజనాలను విస్మరించలేం. అందుకే భారత్లో క్రిప్టోలను నిషేధించే బదులు నియంత్రణలోకి తెస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తే, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.
మహమ్మద్ ఆరిఫ్, 96184 00190
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)