ఒక గృహిణి.. ఒక డాక్టర్.. ఒక వైద్య విద్యార్థిని.. ఒక ఇంజినీరింగ్ విద్యార్థి.. రకరకాల నేపథ్యాలున్న వీరందరి జీవితాలు ఇటీవల ఒకే విధంగా ముగిశాయి. ఆత్మహత్య. ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ స్వయంగా తమ చేతులతో తామే తమ జీవితాల్ని ముగించుకునే నిరాశాపూరిత ధోరణి సమాజంలో ఒక రుగ్మతలాగా పెరిగిపోతున్నది. దీనికి ఈ దేశం ఆ దేశం అని, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు. ఇదొక అంతర్జాతీయ సమస్య. ప్రపంచంలో ప్రతి గంటకు సగటున 91 మంది సొంతంగా ప్రాణాలు తీసుకుంటుండగా, మన దేశంలో ఈ సంఖ్య 30గా ఉంది. భారత్లో గంటకొక విద్యార్థి సూసైడ్కు పాల్పడటం మరింత ఆందోళనకరం. కరోనా, రోడ్డు ప్రమాదాల కన్నా కూడా ఎక్కువ నష్టం కలిగిస్తున్న విషాదమిది.
ఒక్కో ఆత్మహత్య వెనుక ఒక్కో కారణం. ఇష్టం లేని కోర్సులో చేర్పించారని ఓ టీనేజర్, ప్రేమలో విఫలమయ్యానని ఒక యువకుడు, కెరీర్లో ఎదురైన ఒత్తిళ్లతో ఓ ఉద్యోగి, ఇంట్లో గొడవలతో ఓ భార్య లేదా భర్త.. ఈ జాబితాకు అంతం లేదు. ప్రపంచంలో బాధ ఉంది.. బాధకు కారణం ఉంది.. ఆ కారణాన్ని జయించటమే మానవాళి విముక్తి మార్గం అంటూ బుద్ధుడు బోధించాడు. కానీ, ఆ అంతశ్శక్తి నేటి సమాజంలో క్రమేణా క్షీణిస్తున్నది. జీవితంలో పెద్ద పెద్ద సవాళ్లను, నిజమైన సమస్యల్ని ఎదుర్కోవటం అటుంచి అల్పమైన వాటిని పెద్దగా ఊహించుకొని క్షణికావేశంలో ఎంతోమంది బంగారం వంటి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. ఇది వ్యక్తిగతంగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఇదొక సామాజిక సమస్య. దీనిపై సామాజిక కార్యాచరణ అవసరం. కేంద్ర ఆరోగ్యశాఖ గత ఏడాది నవంబరులో ‘జాతీయ ఆత్మహత్య నిరోధక వ్యూహం’ పేరిట ఒక నివేదికను వెలువరించింది. 2030 నాటికి ఆత్మహత్యలను పది శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పేర్కొంది. ఇది కాగితాలకే పరిమితం కాకుండా, తగిన కార్యాచరణ అవసరం.
ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, పౌరసమాజం కలిసికట్టుగా ఆత్మహత్యలనే మహమ్మారిని సమాజం నుంచి పారదోలాలి. మానసికంగా బలహీనులే ఆత్మహత్యకు పాల్పడుతారనే ధోరణి మన దేశంలో ప్రబలంగా ఉంది. తమ కుంగుబాటును తోటివారికి చెప్పుకుని సాంత్వన పొందే పరిస్థితులు బాధితులకు ఉండటం లేదన్నది ఒక ముఖ్యాంశం. బాధితులకే కాదు, సాధారణ ప్రజలకూ ఆత్మహత్యల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలి. ముఖ్యంగా.. తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధికారులు మొదలైన సంరక్షక స్థానాల్లో ఉన్న వారికి ఇది అవసరం. సామాజికంగా వివక్షను, అవకాశాల లేమిని, వెనుకబాటుతనాన్ని ఎదుర్కొనే వర్గాలలో కూడా ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయి. బహుముఖ వ్యూహంతో ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇటీవల సీజేఐ చంద్రచూడ్ కూడా ఉద్బోధించారు. బాధితులను తక్షణమే ఆదుకొని వారికి ధైర్యం చెప్పే యంత్రాంగమూ అవసరం. ఉన్న ఒక్క జీవితాన్ని అందంగా, అర్థవంతంగా మలుచుకునే స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలు ఒక ఉద్యమంలా కొనసాగాలి. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించుకోవటం అప్పుడే సాధ్యం.