శుకుడు పరీక్షిత్తుతో.. భూవరా! కారాగృహంలో ప్రకటమైన ఆ పిల్లవాడు ధారాధర దేహుడు- నల్లని మబ్బుల నిగారింపుల దేహంతో పురిటిల్లు ఉల్లసిల్ల (ఆనందింప) చేస్తున్నాడు. ఆజాను చతుర్బాహుడు- మోకాళ్ల వరకు పొడవైన అతని నాలుగు చేతులలో శంఖ, చక్ర, గద, అరవిందాలు కనువిందుగా వెలుగొందుతున్నాయి. అతడు సరసీరుహాక్షుడు- శతపత్రా (పద్మా)ల వంటి అందాల నేత్రాలు కలవాడు. అతని వక్షఃస్థలం విశాలం. కంఠంలో కౌస్తుభరత్నం వింత కాంతులను వెలువరిస్తున్నది. కమనీయమైన కటిసూత్రం- మొలతాడు, కంకణాలు, భుజకీర్తులతో గాత్రం రమణీయంగా ఉంది. ఇమ్ముగ శ్రీవత్సమనే మచ్చ రూపంగా ఇల్లాలు లచ్చి (ఇందిర)కి నెలవైన రొమ్ము కలవాడు. కుండలాల కాంతులతో నుదుటి (లలాటం) మీది ఉంగరాల వంటి ముంగురులు రంగులీనుతున్నాయి. మకుటం (కిరీటం)లోని వైడూర్యమణుల నిగనిగలు వగలు పోతున్నాయి.
తే॥ ‘బాలుఁబూర్ణేందు రుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది
యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె!’
రాజా! ఆ కన్నవాడు చిన్నవాడుగా ఉన్నా ఈ అన్ని దివ్య లక్షణాలతో పున్నమి చంద్రుని కన్నా మిన్నగా కమ్మని కాంతులను విరజిమ్ముతున్నాడు. అతడు భక్త లోకపాలుడు- భక్తులను కాచి కడతేర్చువాడు. సుగుణాలవాలుడు- సమస్త కల్యాణ గుణాలకు కాణాచి (నిధి). కృపావిశాలుడు- అపారమైన కరుణ కలవాడు. అదృశ్యుడు దృశ్యుడయ్యాడు- సత్ పాత్రులకు నేత్ర గోచరుడయ్యాడు. నిర్గుణ నిరాకారుడు భక్తుల ప్రేమకు వశపడి నరాకారుడయ్యాడు. శిశురూపంలో సగుణ సాకారమయ్యాడు! మిన్ను, మన్ను- అంతటా ఉన్న సంపన్నుడైనా, కన్నవారికి చిన్నారి చిలిపి కన్నయ్య అయ్యాడు! ‘పితాహ మస్య జగతః మాతాధాతా పితామహః’ (గీత)- ఈ జగత్తుకే తండ్రి, తల్లి, మాత, ధాత (రక్షకుడు) అయినవాడు ఇప్పుడు ఒక తల్లికి, తండ్రికి తనయుడు అయ్యాడు. ‘తాను అగుణు (గుణరహితు)డైనా తన భక్త గణాలను గుణాతీతులుగా చేయడానికి.. తాను అజాయమానుడు (జన్మలేనివాడు) అయినా, ఇలా త్రిగుణ ప్రకృతితో కూడిన మాయా సహాయంతో పురుషుడుగా పుట్టాడు. ఇంకా విచిత్రం, విరుద్ధమేమంటే- లోకంలో జీవులందరూ ముందుగా శుభాశుభ (పుణ్యపాప) కర్మలు చేసి వాటి ఫలాలను (సుఖదుఃఖాలను) తరువాత అనుభవిస్తారు. ఇందుకు విలక్షణంగా లోకసాక్షి అయిన సరసీరుహాక్షుడు కృష్ణుడు కారాగార శిక్షను మున్నుగానే- జన్మించిన తక్షణమే అనుభవించి తర్వాత ఎప్పటికో దొంగతనం చేసి వెన్నను భక్షించాడు!’- అని దత్తగురుని ‘శ్రీకృష్ణ భాగవతం’.
శుకుడు- రాజా! ఈ తీరున ఉన్న ఆ అద్భుత బాలకుని ముందు తేరిపార తిలకించి, తరువాత పరిపరి విధాల పరికించి వసుదేవుడు పులకించిపోయాడు. అబ్బురపాటుతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఉల్లాసంతో ఉప్పొంగాడు. ఆ పారవశ్యం నుంచి ఎప్పటికో తేరుకొని కారాగృహంలో ఎంతో ఉత్సహించాడు. ‘తమద్భుతం బాలకం… వసుదేవ ఐక్షత’ (అద్భుతమైన ఆ పసిబాలుని వసుదేవుడు చూచాడు) అని మాత్రమే మూలం. కాని, ‘పోత పోసిన భక్తి కైత (కవిత)’ మన పోతన తానే ఆనక దుందుభై- వసుదేవుడై, తన మానసంలో భ్రాజమానుడై (వెలుగుతూ) ఉండే ఆ ‘ఆజాను చతుర్బాహు’ని కని తాను అనుభవించిన ఆనందానుభూతిని అంత్యప్రాసల చిరుగజ్జెల సవ్వడుల జాను తెనుగులో ఉత్సాహం పూని ఇలా… ‘చూచి, తిలకించి, పులకించి, చోద్యమంది, ఉబ్బి చెలరేగి’ అని అభివర్ణించాడు.
బాలక జన్మవార్త వినగానే జనకుడు కాలయాపన చేయక సచేల స్నానం చెయ్యాలి. కాని, జలస్నానం వీలుపడక వసుదేవుడు ఆనందరసం కల జలనిధిలో మునిగితేలాడు. ధరామరులకు- వైదిక బ్రాహ్మణులకు పదివేల ఆవులను దానమిస్తానని కారాగృహంలో ధారపోశాడు. పురిటింటికి ప్రదీపమై పాపని రూపంలో వెలుగొందు కంజలోచనుని పదకంజాలకు భక్తితో అంజలి ఘటించాడు. ఇలా ప్రస్తుతించాడు…
కం॥ ‘ఏ నిన్ను నఖిలదర్శను
జ్ఞానానంద స్వరూపు సంతతు నపరా
ధీనుని మాయా దూరుని
సూనునిగాఁ గంటి, నిట్టి చోద్యము గలదే?’
స్వామీ! నీవు సమస్త సృష్టినీ నీ యందే చూపిస్తావు. లోకులందరికీ నీ సృష్టి మీదే దృష్టి. కానీ, స్రష్టవైన నీయందు దృష్టి పెట్టే అదృష్టవంతులు చాలా అరుదు. మట్టికుండలోను, బంగారు దండలోను… మట్టి, బంగారం కానరావడం లేదన్న వానికి, వాటి వాస్తవ స్వరూపం తెలియనట్లే గదా! జ్ఞానం, ఆనందం ఒక్కటై నీ రూపుదిద్దుకున్నాయి. నీవు నిత్యుడవు, ప్రకృతికి పరు (అతీతు)డవైన దేవదేవుడవు. మాయ నిన్నుముట్టక దూరంగా తొలగిపోతుంది. అట్టి ‘మాయాదూరు’ని నిన్ను నేను సూనునిగా (కుమారునిగా) కన్నానట! ఇట్టి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా? కన్నతండ్రీ! నృశంసుడు (క్రూరుడు) కంసుడు, నీవే వారి రూపంలో పుట్టావనే కంపం (వణుకు)తో నీ అన్నలందరినీ చంపివేశాడు. పుట్టావని తెలియగానే నిన్ను కూడా మట్టుబెట్టాలనే పట్టుదలతో వాడున్నాడు’. యాదవులలో దేవకీ వసుదేవులకు మాత్రమే మాధవుని చతుర్భుజ రూపం దర్శించే మహద్భాగ్యం’ కలిగింది! దేవకి కూడా ఇలా ప్రార్థించింది… ఆదిదేవా! అసాధ్యమైన నీ చతుర్భుజ రూపాన్ని నా ఈ చర్మచక్షువులతో చూడగలిగాను. ఈ అసాధారణ రూపాన్ని ఉపసంహరించుకొని లౌకికమైన పసిరూపాన్ని నాకు ప్రసాదించు. నీకు ప్రణమిల్లుతా.
ఆ॥ ‘విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
కడుపులో దాఁచు కడిమి మేటి
నటుఁడ వీవు, నేడు నా గర్భజుఁడ వౌట
పరమ పురుష! వేడబంబు గాదె!’
పురుషోత్తమా! ప్రళయంలో ఈ ప్రపంచాన్నంతా నీ పెద్ద పొట్టలో దాచుకోగల సమర్థుడవైన మేటి నటుడవు. అట్టి నీవు నా కడుపున పుట్టడం ఒడుపైన (పట్టుతో కూడిన దట్టమైన) నీ మాయగాక మరేమిటి పట్టీ (బిడ్డా)! దుష్టుడైన ఈ కంసుని శిక్షించి నీకు ఇష్టులమూ, శిష్టులమూ అయిన మా కష్టాలను పోగొట్టి మమ్ము రక్షించు’ అనగా.. అప్పుడు పరమాత్మ వారి పూర్వజన్మల వృత్తాంతం, తన అవతార విశేషం వివరించాడు.
ఈ దేవకీ వసుదేవులే గత జన్మలో వృష్ణి, సుతపులు. వారి తపస్సుకు ప్రసన్నుడై పరమాత్మ వారికి ‘వృష్ణిగర్భుడు’గా ప్రాదుర్భవించాడు. మరుసటి జన్మలో వారే అదితి కశ్యపులు. విష్ణువు వారియందు ‘వామన’ నామంతో ఆవిర్భవించాడు. జగన్నాథుడు దేవకీ వసుదేవులతో… జననీ జనకులారా! ఇక మీకు గానీ, మీ వలన నాకు గానీ మరి జన్మలేదని పలికి, మీరు నన్ను పుత్రభావంతోను, పరబ్రహ్మ భావంతోను భావిస్తూ నా పరమపదం పొందుతారని తెలిపాడు. కాన, దేవకీ వసుదేవుల భక్తి మిశ్రమ భక్తి. నందయశోదల భక్తి శుద్ధ వాత్సల్యమయం.
శుకయోగి- రాజా! అలా పలికి ఉపేంద్రుడు తన చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించాడు. మార జనకుడు- హరి సుకుమారమైన పసిబాలుని రూపంలోకి మారిపోయాడు. అప్పుడు వసుదేవుడు విసుమానం (ఆశ్చర్యం) వహించి వాసుదేవుని వలన తన తక్షణ కర్తవ్యం గ్రహించాడు. పసిబిడ్డను అడ్డంగా రొమ్ముకు హత్తుకొని, చప్పుడు కాకుండా తప్పటడుగులతో పురిటింటి నుంచి నెమ్మదిగా బయటపడ్డాడు. కాళ్లు చేతుల సంకెళ్లు విడిపోగా తాళాల కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు తమంత తామే తెరుచుకున్నాయి. పాపని మాయకు లోనై కాపలావాళ్లు కూడా గమ్మత్తుగా మత్తులోకి జారుకున్నారు. వసుదేవుడు శిశువున్న గంపను శిరస్సు పైకి ఎత్తుకోగానే సకల బంధాలు చిత్తయిపోయాయి. ముకుందుని నెత్తిన- బుద్ధిలో ధరించువారికి కారాగార ద్వారాలేమిటి? ముక్తిద్వారాలు కూడా తెరుచుకొంటాయి గదా! ఆదిశేషుడు పడగలు విప్పి ఆ పిల్లవానికి గొడుగులాగా పట్టి రక్షిస్తూ కదిలాడు. అడ్డమొచ్చిన యమునా నది ఉధృత ప్రవాహం కూడా ఉపశమించింది- శాంతించింది. పూర్వం త్రేతాయుగంలో సీతాపతి రామచంద్రునికి సముద్రం సేతురూపంగా మార్గమిచ్చినట్టు, కాళింది (యమున) కూడా వసుదేవునికి (కాగల భర్త అయిన కృష్ణచంద్రునికి) దారి ఇచ్చింది. ఆయన మైకంలో జోగుతున్న వ్రేపల్లె చేరి, మైమరచి నిద్రిస్తున్న యశోద పానుపుపై కన్నయ్యను ఉంచి, కన్నెపిల్ల (యోగమాయ)ను ఎత్తుకొని వచ్చి తన కాంత పక్కలో శాంతంగా, చక్కగా పడుకోబెట్టాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006