Vallabhi Ramalayam | ఆ ఊరి దళితుల్ని గుళ్లోకి రానివ్వలేదు. దేవుణ్ని చూడనివ్వలేదు. అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. వెలివాడలోనే గుడికట్టుకున్నారు. వేలకువేలు పెట్టి విగ్రహం తీసుకురాలేక పటం పెట్టి పూజలు చేశారు. ఆ భక్తికి మెచ్చి లక్ష్మీ నారాయణుల రూపంలో మట్టిపొరల్లో ప్రత్యక్షమయ్యారు సీతారామచంద్రులు. ఇంకేముంది, కండ్లకద్దుకుని ప్రతిష్ఠించారు. దళితులు కట్టుకున్న ఆ గుడిలో దళితులే పూజారులు. కాలక్రమంలో శిథిలమైపోయిన ఆ ఆలయం.. జీర్ణోద్ధరణ పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ‘వల్లభి’ రామకథ..
అన్ని ఊళ్లలో ఉన్నట్టే ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని వల్లభిలోనూ కుల వివక్ష ఉండేది అప్పట్లో. దళితులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఓసారి ఊళ్లోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఏదో వేడుక జరుగుతున్నది. ఆలయ ప్రహరీ పైనుంచి చూసేందుకు కొందరు దళితులు ప్రయత్నించారు. ఆ ప్రయతాన్ని అగ్రవర్ణాలవారు అడ్డుకున్నారు. ఆ అవమాన భారం దళితులను కుంగదీసింది. తామే ఓ ఆలయం కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ దళితుడు కొంత స్థలాన్ని విరాళంగా ప్రకటించాడు. రూపాయి రూపాయి పోగేసి రామాలయం కట్టారు. విమాన గోపురాలు, ధ్వజస్తంభాలు, సింహద్వారాలు నిర్మించేంత శక్తి ఎక్కడిది పాపం! చిన్నపాటి గుడిలో సీతారాముల పటం పెట్టుకుని పూజలు మొదలుపెట్టారు. దళితుడైన వంగూరి రామస్వామి అర్చకత్వం స్వీకరించారు. అప్పటికే ఆయన, నేటి ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేటలోని సద్గురు బోధానంద దగ్గర ఆయన పూజదికాలు నేర్చుకున్నారు.
అలా పదేండ్లు గడిచిపోయాయి. ఊళ్లో బంగారు మైసమ్మ కొలువైన చింతచెట్టు కింద లక్ష్మీనారాయణుల విగ్రహాలు బయటపడ్డాయి. దేవుడే కోరి వచ్చాడని దళితులు సంతోషించారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరిపారు. వల్లభి రాముడి ఖ్యాతి నలుదిక్కులకూ విస్తరించింది. ఇతర కులాలవారు కూడా రావడం మొదలైంది. రామస్వామి తర్వాత ఆయన కొడుకు వంగూరి ముత్తయ్య బాధ్యతలు తీసుకున్నారు. రెండేళ్ల నుంచీ మూడోతరానికి చెందిన అనంతరాములు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించి సుమారు తొంభై ఏండ్లు అయిపోవడంతో.. నిర్మాణం శిథిల స్థితికి చేరింది. దీంతో ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకున్నారు వల్లభి దళితులు. ప్రతి కుటుంబం మూడు వేల రూపాయల చొప్పున విరాళం ఇచ్చింది. స్తోమత ఉన్నవారు అంతకంటే ఎక్కువే ఇచ్చారు. అలా పది లక్షల రూపాయలు ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేశారు. దేవాదాయ శాఖ నలభై లక్షలు మంజూరు చేసింది. గ్రామస్థులు, చుట్టు గ్రామాల భక్తులు.. తలోచేయి వేశారు. సుమారు కోటి రూపాయలతో పనులు మొదలు పెట్టారు. మహాబలిపురం (తమిళనాడు)లో రామ పరివార విగ్రహాలు తయారు చేయించారు. అక్కడి శిల్పులనే రప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే పనులు ఓ కొలిక్కి వచ్చాయి. మార్చి 17న ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుక నిర్వహిస్తారు.
ఆరో దశకంలో వల్లభిలో భూ తగాదాలు, రాజకీయ కక్షలు రాజుకున్నాయి. దళితులంతా ఊరు వదిలిపోయారు. వారికి అదే గ్రామస్థుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయితరాజు రామ్రావు ఖమ్మంలో ఆశ్రయం కల్పించారు. ఆర్థిక పరిమితుల కారణంగా హరిజనోద్ధారకుడైన ఊటుకూరు నర్సింహారావును సంప్రదించారు. ఇద్దరూ మహారాష్ట్రలోని వార్ధా ఆశ్రమానికి వెళ్లి, గాంధేయవాది ఆచార్య బన్సాలీని కలిశారు. ఆయనను వల్లభికి రప్పించారు. శాంతిభద్రతల సాధన కోసం దళిత రామాలయంలోనే బన్సాలీ దీక్షకు కూర్చున్నారు. ఈ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ వీక్ లాంటి జాతీయ పత్రికలకూ ఎక్కింది. దీంతో ప్రభుత్వానికి చురుకు పుట్టింది. నాటి గవర్నర్, ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగింది. స్థానిక నేతలు దిగివచ్చి, దళితులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేశారు. దళితులు వల్లభి చేరుకున్నారు. చివరి కుటుంబం వచ్చేదాకా బన్సాలీ దీక్ష విరమించలేదు. ఇకనుంచీ కలిసిమెలిసి ఉంటామంటూ.. అగ్రకులాల వారు, దళితులు ఆయన ఎదుటే ప్రమాణం చేశారు. అలా, ఒక గొప్ప రాజకీయ పోరాటానికి వేదికగా వల్లభి దళిత రామాలయం చరిత్రలో నిలిచిపోయింది. ఇకనుంచీ కలిసిమెలిసి ఉంటామంటూ.. వల్లభి గ్రామానికి చెందిన అగ్రకులాల వారు, దళితులు ఆ గాంధేయవాది ఎదుట ప్రమాణం చేశారు. అలా, ఒక గొప్ప రాజకీయ పోరాటానికి వేదికగా వల్లభి దళిత రామాలయం చరిత్రలో నిలిచిపోయింది.
…? నాగవర్ధన్ రాయల
ఫొటోలు: బండారి మహేశ్