ఎండిన మోళ్లు చిగురుతొడగడం, లేత పిందెలతో, ఎర్రెర్రని చివుళ్లతో కోయిలలకి ఆహ్వానం పలుకుతూ మావిళ్లు, సుగంధ మరంద మాధురీ వీవెనలతో నెత్తావులు…నేల సమర్తాడినట్లు ఉగాది అంటేనే ఆకాశానికి రెక్కలొచ్చినంత సంబురం. పురుడోసుకున్నంత తన్మయత్వం జగతికి! కొత్తఆశలతో, మరిన్ని ఊహాంకురాలతో బతుకు సాగించాలనే ఉబలాటం ఈ మనిషికి.
ఉగాది అంటేనే ప్రకృతితో సమాగమం. గుప్పెడు గింజలు చల్లి గంపెడు ఫలసిద్ధిని పొందే రైతుకు సేద్యమంటేనే ప్రకృతి జీవనాదరువు. పూలు పూయని కాయలు కాయని గొడ్డుబారిన చెట్టంటూ ఏ తరువునూ కొట్టిపారెయ్యలేం. ప్రకృతి ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మనిషి జీవనావస్థల్లాగానే ఏటా వసంతం కుసుమించదు. చీకటి తరువాత వెలుతురులాగా, మండు వేసంగి వెనుకే చల్లని మబ్బులాగా, అమవసనిశి వెంటనే కదిలొచ్చే పున్నమి కాంతిలాగా రాలే ఆకులే చివురులవుతాయి మోడుకు. మధుర దరహాస మధుకర పల్లవములవుతాయి మోముకు. ఆరు రుతువుల కాలచక్రం విరామమెరుగక తిరుగుతుంటే… ప్రభవ, విభవాది వత్సరాలు పరుగులెడుతూ పునరావృతమవుతూ అనంత జీవన చైతన్యంలోకి అంతుచిక్కని జీవన పరిమళంలోకి, ఒకానొక అస్పష్ట వాంఛాంకురంలోకి మనిషిని తీసుకుపోయి నిలబెడుతుంది ఉగాది.
ఉగాది అంటే వనాలకు ఎడంగా కాదు గాఢంగా పెనవేసుకుని బతకాలి. రాలే ఆకుల నిట్టూర్పులే వాసంతరాణికి కైమోడ్పులుగా మనసులో నిత్యోత్సవం తొలకరించినా చాలు ప్రకృతితో రససిద్ధిని పొందినట్టే. కుసుమలతా పతాక! కోకిలబాకా!! వహవ్వా! ఎన్నాళ్లకు రాక!! అంటూ… వనసీమల్లో సంచరించే ప్రకృతిమాతకు ప్రణమిల్లడమే జీవన్ముక్తి. వత్సరాలు వస్తుంటాయి… పోతుంటాయి. రాలు పూల గంధాలు, హరిత పత్ర నయనాలు, పుప్పొడి గంధ లేపనాలు, తేటుల, తూనీగల సయ్యాటలు… ఒక్కో రుతువు ఒక్కో శోభను మోసుకొచ్చి ఒకానొక చైతన్యపు అంచున నిలబెడతాయి మనిషిని. ఎప్పుడూ ఆనందాలే కాదు… కలతలూ, కష్టాలూ, కన్నీళ్లూ.. అన్నీ క్షణికాలే.
ఏదీ ఎక్కువ కాలం అదిమిపట్టుకుని ఉండదు. పడిలేచే కెరటంలాగా, ఎండిన చెరువుకు తొలకరి జలకళలాగా, నిజానికి వసంతం ఎండిన ఎడదకొక నిగారింపు. ఇదే ప్రకృతి స్పర్శతో మనిషి జీవన కొనసాగింపు. ఎన్నెన్ని ఉగాదులొస్తున్నాయి.. పోతున్నాయి! ఏం చెబుతున్నాయవి!! నిలకడగా, నిబ్బరంగా కష్టిస్తూ… పదుగురికీ ఉపాధులు సమకూర్చే చెట్టులా ఎదగడమొక్కటే కాదు ఒదిగి ఉండాలంటున్నాయి. తరువులతి రస ఫలభారగురుతగాంచు/ నింగివ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత/ జగతినుపకర్తలకు నిది సహజగుణము.
అమృత జలధారలతో మేఘాలు నేలకు దిగొస్తాయి. ఫల సమృద్ధితో తరువులు ఒదిగి ఉంటాయి. ప్రకృతి పరులసేవే పరమార్థం అంటున్నది. ఉదారత, దాతృత్వం, జగతిలో పదుగురి ఉన్నతికోసం పరితపించే వారి సహజగుణాలు. వనమున్న చోట కిలకిలరావాలు ఉంటాయి. పంటసిరులు ఉన్నచోట పురోగతి ఉంటుంది. చేతికష్టం, శ్రమించే తత్వం, పదిమందికీ చేయూతను ఇవ్వాలనే గుణం… ఇవన్నీ విశ్వమానవ చైతన్య రథచక్రాలు. ఉగాది యశోగీతికలు ఉదయతంతువులై తొలకరించాలంటే గొప్ప సిద్ధాంతాలు, గొప్ప పూజలు చేయడం కన్నా ఒక చెట్టును పెంచడం మేలు. ఉగాది విభవం అనంతరూపమై అవగతమవ్వాలంటే ఒక వనమాలిగా బతుకు సాగించడం మేలు. అప్పుడు కదా.. తరువే కోకిలమై మనసంతా నిండేది! బతుకంతా పాటలాగ వాసంత సమీరమై సాగేది.
– సాహితీసుధ 94940 44429