సామవేద సంబంధమైన ‘సన్యాసోపనిషత్తు’ నిజమైన సన్యాసి ఎలా ఉండాలో వివరించింది. అశాశ్వతమైన ఈ జగత్తును పరిత్యజించి, లౌకిక విషయాల పట్ల విరక్తుడైనవాడు ‘సన్యాసి’ అవుతాడు. కేవలం ఆత్మ ప్రగతి కోసమే అతను నిరంతరం తపిస్తుంటాడు. తల్లి, తండ్రి, పుత్రుడు, భార్య, బంధువుల అనుమతితోనే ‘సన్యాసం’ స్వీకరించాలి. శిఖ (పిలక) మాత్రం ఉంచుకొని, తలవెంట్రుకలన్నీ తీయించి, బోడగుండుతో ఉండాలి. కుల, మతాలకతీతంగా అన్నివర్గాల ప్రజలు ఇచ్చే భిక్షను స్వీకరించాలి. ఆహారాన్ని కేవలం తన ‘ప్రాణం నిలిపే ఔషధం’ వలె మాత్రమే భావించాలి.
తమ క్షీణిస్తున్న శరీరాన్ని, చిరిగిన దుస్తులను సన్యాసులు పట్టించుకోరు. భిక్ష కోసం పల్లెలు, పట్టణాల్లోనూ తిరుగవచ్చు. 15 రోజులను ‘ఒక మాసం’గా భావించాలి. వారికి ఆత్మధ్యానమే యజ్ఞోపవీతం. విద్యయే పిలక. ఉదరమే పాత్ర. సన్యాసులకు రాత్రి-పగలు తేడా ఉండదు. సర్వకాల సర్వావస్థల సమయమంతా సన్యాసికి దినం (పగలు) కిందే లెక్క. పతితులు, భ్రష్టులు, ఇంద్రియ లోలురు, ధనాపేక్షపరులు, నాస్తికులు వంటివారు సన్యాస దీక్షకు యోగ్యులు కారు.
ఇలాంటి కఠిన నియమనిష్ఠలతో సన్యాసదీక్ష స్వీకరించిన వారిని చూసి సూర్యుడు సైతం ఆశ్చర్యపోతాడట. కారణం, వారు ఆత్మజ్ఞానంతో భూమండలంతో పాటు తననూ ఛేదించుకొని వెళ్లి బ్రహ్మంలో లీనమవుతారని! అటువంటి జ్ఞాన సంపన్నుడైన సన్యాసి తన జన్మకు పూర్వం 60 తరాల వరకు, పిదప రానున్న 60 తరాల వరకు శ్రేష్ఠజీవులను ముక్తులను చేయగలడు. సన్యాసికి పితృదోషాలు, శారీరక దోషాలు ఉంటే వాటన్నింటినీ ‘అగ్ని బంగారాన్ని శుద్ధి చేసినట్లు’ తుడిచేయడంతో పరమ పవిత్రుడవుతాడు. ఒక చక్కని శుద్ధిగల దండాన్ని ధరించాలి. అది వారి నాసిక, భృకుటి, పిలక వరకు పొడవును కలిగి ఉండాలి.
ప్రధానంగా సన్యాస దీక్షలు నాలుగు రకాలు: వైరాగ్య సన్యాసి, జ్ఞాన సన్యాసి, జ్ఞాన-వైరాగ్య సన్యాసి, కర్మ సన్యాసి. ఏ రకపు సన్యాసి అయినా సరే, శాస్త్ర జ్ఞానాన్ని పొందాక పాప పుణ్యాలు, లౌకిక- సాంసారిక వాసనలను ‘భళ్లుమని వాంతి చేసుకున్నట్లు’ పరిత్యజించాలి. ఎవరి అంతఃకరణ అత్యంత శీతలంగా, నిర్మలంగా ఉంటుందో, ఎవరి బుద్ధి రాగద్వేషాదులతో ముక్తిని పొందుతుందో అలాంటి సన్యాసి జీవితం అత్యధిక శోభాయమానమైంది. ఎవరికైతే పూర్ణరూప జ్ఞానం సంప్రాప్తించిందో, ఎవరైతే మంచి- చెడులను పరిత్యజించారో, ఎవరి చిత్తం చిత్తంలోనే లీనమైందో వారి జీవితం అతిసుందరమైంది. అటువంటి పతిత పావనుడు, పరమ ఉదారుడు మాత్రమే శుద్ధమైన సత్యాన్ని తెలుసుకొని, దానిని ఆత్మలో లీనం చేసుకొని, ‘ఆత్మధ్యాన సంపన్నుడు’గా తన నిత్యరూపంలో ప్రతిష్ఠితుడై ఉంటాడు.
సన్యాసి తన పొట్టను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. రెండు భాగాలు ఆహారం, మరొక భాగం జలం కోసమైతే, చివరి భాగాన్ని వాయుసంచారం కోసం ఖాళీగా వదిలిపెట్టాలి. అతడు ఎల్లకాలం ‘భిక్ష’పైనే ఆశ్రితుడు కావాలి. ఎల్లప్పుడూ ఒకే ఇంటి నుంచి భిక్షను స్వీకరించకూడదు. శాంతభావంతో నిరీక్షించే వారివద్దకే భోజనానికి వెళ్లాలి. వేదజ్ఞులైనప్పటికీ శ్రద్ధాభక్తి లోపించేవారి ఇండ్లకు వెళ్లరాదు. వేదజ్ఞానం లేనివారైనా శ్రద్ధాభక్తులుంటే భిక్ష స్వీకరించవచ్చు. గాలి అందరినీ తాకుతుంది. అగ్ని అందరినీ దహించివేస్తుంది. నీటిలో మలమూత్రాదులు విసర్జింపబడతాయి. అంతమాత్రాన అవేవీ దూషితాలు కావు. ఇదేరకంగా సన్యాసికి ఎలాంటి దోషాలూ అంటుకోవు. తన వాక్కునే తాను దండించవలసి వచ్చినప్పుడు మౌనాన్ని మాత్రమే ఆశ్రయించాలి. శరీరాన్ని దండించవలసి వస్తే భోజనం మానేయాలి. మనసును దండించవలసి వస్తే ప్రాణాయామం చేయాలి.
యం.వి.నరసింహారెడ్డి
98491 10922