తేనియలొలికే త్రివిక్రమ- వామన చరిత్రను తనియక వింటున్న అవనీపతి- ఉత్తరా తనయునితో శుకముని ఇలాగని తెలిపాడు… పరీక్షిన్మహారాజా!
“రాక్షస రాజా! మీ కులంలో రణ భీరువులు- యుద్ధానికి వెరచి వెన్ను చూపేవారు, వితరణ భీరువులు- దానానికి భయపడి వెనక్కి తగ్గేవారు లేరు. మీ తాత ప్రహ్లాదుడు చుక్కల్లో చంద్రుని వలె ఎంచక్కా ప్రకాశిస్తాడు. మీ ముత్తాత హిరణ్యకశిపుని సత్తా సామర్థ్యాల గుత్తాధిపత్యం గురించి ఎంత చెప్పినా దానికి ఇయత్త- హద్దూపద్దూ లేదు. అతనిని యుద్ధంలో ఎదిరించి జయించే ధైర్యం చాలక విష్ణువు కూడా ‘వీడు బహిర్ముఖుడు- బయటి వస్తువులే చూడగలవాడు. అంతర్ముఖుడు- లోన దాగి ఉన్న నన్ను కనగల మొనగాడు కాదు’ అని సూక్ష్మరూపంలో ముక్కురంధ్రం గుండా అతని గుండెలో ప్రవేశించాడు. మురవైరి హరి మరణించి ఉంటాడు.
మరి జీవించి ఉంటే నా కంట పడేవాడేగా! చచ్చిన పగవారి- శత్రువులపై కచ్చె పూనడం తగని పని అని అనుకొని వెదకడం విరమించాడు హిరణ్యకశిపుడు. ఇక మీ తండ్రి విరోచనుడు మాత్రం తక్కువ వాడా? ఆఖండలా (ఇంద్రా)ది దేవతలు అవనీసురుల (బ్రాహ్మణుల) వలె ఆర్తి (దుఃఖం) నటిస్తూ, అయ్యా! మేము మీ ఆయుర్దాయం కోరుతున్నాం- అని అర్థించగా, కందక- తపించక, కుందక- శోకించక, మారు ఆలోచించక తన ఆయువును దానమిచ్చిన వాడు ఆ అసురశ్రేష్ఠుడు! ఇక, ఈవి-దానంలో నీ విషయం గూర్చి వివరించేదేముంది? మూడు లోకాల్లో మొదటగా వదాన్యులలో ప్రధానంగా నిన్నే కదా సదా ఎన్నిక చేస్తారు! ఇంతవాడవైనా నీ చెంతకు వచ్చి ఇమ్మని ఏనాడూ రవ్వంత కూడా అడగలేదు. దానవ రాజా! నీవు మాత్రం నాకు ఏవేవో ఇవ్వాలని చాలా ఉవ్విళ్లూరుతున్నావు. నేనా మాణవకుడను- బాల బ్రహ్మచారిని. ఒంటివాడను…
మ॥ ‘గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్’
దాన వినోదా! వడుగునైన నాకు గొడుగు, జందెము కావాలి. కమండలం, ముంజె దర్భల మొలత్రాడు, యోగదండం కావాలి. కాని, భూములతో, భామలతో, తురంగ (గుర్రాలు), మాతంగా (ఏనుగు)లతో నాకేమి పని? నా దైనందిన అనుష్ఠానానికి వాటితో ఏమీ అనుబంధం లేదు. నాదు కోరిక మేరకు కాదనకుండా మూడడుగుల మేదిని (నేల) ఇస్తే, బలీ! అదే నా పాలిటికి బ్రహ్మాండం! దానితో తృప్తిపడి నేను ‘బ్రహ్మకూకటి ముట్టెద’- బ్రహ్మానందం పొందుతా”
బలి ఇస్తానన్న పెద్ద పెద్దవేమీ కోరక వామనుడు- మూడడుగులు ఇవ్వటం మాకు ‘ముజ్జగంబు లిచ్చుట’- ముల్లోకాలూ ఇచ్చినట్టే అని నర్మగర్భం (సాభిప్రాయం)గా ముచ్చటించాడు. ‘నీవు మనీషి- బుద్ధిగల వాడవైతే నా మర్మమేమిటో తెలుసుకో’ అన్న సున్నితమైన విన్నపంతో కూడిన హెచ్చరిక. ఈ సందర్భంలో మూల భాగవతంలో ఒక విశేషముంది. ‘సంమితాని పదామమ’- త్రివిక్రముని పాదాలతో- అన్న అభిప్రాయంతో, తనకు అసత్యదోషం అంటకుండా, నా అడుగులతో (ఇప్పటికి ఇవి బడుగులే, కానీ కొలుచుకొనే సమయంలో ‘బృహత్’- బ్రహ్మాండమైన అడుగులు) నేను కొల్చుకుంటానని వామనుడు మెలికపెట్టాడు.
బలి ఇలా పలికాడు.. ‘వడుగా! అడగక అడగక ఇంత అల్పమైనది అడిగావే! అర్థించేటప్పుడు దాత మహిమను, మోదాన్ని ఆలోచించవద్దా? ఇంతటి దానవీరుడు మరీ ఇంత కొంచమైన దానిని సంకోచించక ఎలా ఇవ్వగలడు?’ అంత స్వల్పమైనది ఇవ్వడం తన మహత్తానికే మాయని మచ్చ- అని బలి అభిమానం! ఎంతో ధార్మికులలో, సత్పురుషుల్లో కూడా అంత సూక్ష్మరూపంలో- నేను నిరహంకారిని అన్న అహంకారం దాగి ఉంటుంది. తనను యాచించినవాడు జీవితాంతం మరొకడి వద్ద చేయి చాచరాదని బలి అభీష్టం! అయితే, అది అహంకారం దోషజుష్టం! ‘ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియ త్వాచ్చ’- భగవంతుడు వాసుదేవుడు తన భక్తులలో వీసమంత అభిమానం- అహంకారం కూడా సహించడు. ఆ దీనదయాళువుకు ఎంతసేపటికి దైన్యం- దీనత్వం అంటే మహా ఇష్టం! ఈ అహంకార నిర్మూలనకే త్రివిక్రమ దేవుని ‘త్రిపాద ధరణీ (భూమి) దాన’ లీల!
పరమాత్మ ప్రతిగా, లోకహితకరంగా, నీతిపరంగా, పరమాద్భుతంగా బలితో ఇలా పలికాడు…
శా॥ ఆశాపాశము దాఁగడున్నిడుపు, లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు సేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు, న్నర్థ కా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే?’
‘అసుర రాజా! ఆశ మిక్కిలి పొడవైన పాశం- తాడు వంటిది. దానికి అంతులేదు. ప్రాచీన కాలంలో వేనుని కుమారుడు పృథువు, గయుడు మొదలైన సమ్రాట్టులు సాగరపర్యంతాలైన సామ్రాజ్యాలు సంపాదించి పాలించారు. అట్టివారు సైతం వృథాగా వ్యథ చెందారే- కష్టపడ్డారే కాని, అర్థ కామాలపై ఆశలు వదలలేకపోయారు. ఆశకు అంతాన్ని సొంతం చేసుకొని జీవితాంతం చక్కగా ప్రశాంతంగా సుఖించిన ఉదంతం కాదు వారిది! బలీ! తృప్తి (సంతుష్టి) లేనివానికి మూడు లోకాల సంపద ధారపోసినా ఆనందం ఉండదు. సుఖానికి మూలం తృప్తి- సంతోషమే కాని సప్తద్వీపాల సంపద కాదు. దురాశ సంపన్నులను కూడా ఆపన్నులుగా- దుఃఖ భాజనులుగా చేస్తుంది. తేరగా వస్తోంది కదా అని ప్రతిగ్రహం- పుచ్చుకోవడం కూడా హెచ్చుగా చెయ్యరాదు. దానాలన్నీ రుణానుబంధ రూపంగా పుచ్చుకునే వారి మెడకు ఉచ్చులాగా చుట్టుకునేవే! కాన, అవసరం మేరకే ప్రతిగ్రహం చెయ్యాలి.’
‘ఆశ’ అనేది మనుషులకున్న బంధనాలలో అత్యాశ్చర్యకరమైనది. దీని (ఆశ)చేత పటిష్ఠంగా బంధింపబడినవారు విశృంఖలంగా పరుగులు పెడ్తూ ఉంటే, ఈ శృంఖలం- సంకెల నుంచి విముక్తులైన వారు మాత్రం ఇంటికి పరిమితమై, ఒంటి మీది భ్రాంతి వదలి కంటినిండా నిద్రపోతారు గదా!
శుక ఉవాచ.. రాజా! ‘సరే! నీ ఇష్ట ప్రకారమే కానీ’- అని వామనునికి పాదత్రయ భూదానం చేయడానికి బలి అంజలి ఘటించి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006