చెన్నై: స్కూల్ విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి తల్లిదండ్రులను కోర్టు ఆదేశించింది. అనంతరం కోర్టుకు వచ్చి తమ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని పేర్కొంది. తంజావూరుకు చెందిన 17 ఏండ్ల బాలిక ఇటీవల విషం సేవించి ఆత్మహత్యకుపాల్పడింది. క్రైస్తవ మతానికి మారాలంటూ స్కూల్ వార్డెన్ అసభ్యంగా తనను తిట్టినట్లు 12వ తరగతి విద్యార్థిని ఆరోపించింది. పది రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది.
కాగా, తమ కుమార్తె మరణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని, మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ను ఆశ్రయించారు. అయితే వారి విన్నపాన్ని కోర్టు శనివారం తిరస్కరించింది. బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని తల్లిదండ్రులకు సూచించింది. అలాగే, సోమవారం తంజావూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఆదేశించింది. బాలిక మరణానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించాలని పోలీసులకు కోర్టు సూచించింది.
అయితే, ఆ విద్యార్థిని విషం సేవించిన తర్వాత ఆసుపత్రిలో చేరినప్పుడు వార్డెన్పై మరో విధంగా ఆరోపణలు చేసింది. గదిని శుభ్రం చేయాలని తనను ఒత్తిడి చేసినట్లు తొలుత ఆమె తెలిపింది. ఆ తర్వాత మతం మారానందుకు ఆ వార్డెన్ తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది.
మరోవైపు, ఆ విద్యార్థిని మరణించిన తర్వాత ఒక వీడియో వైరల్ అయ్యింది. “రెండేళ్ళ క్రితం, ఒకసారి నా ముందు, వారు (వార్డెన్) నన్ను క్రైస్తవ మతంలోకి మారుతారా అని మా నాన్న, అమ్మను అడిగారు. అప్పటి నుండి, ఆమె నన్ను తిడుతోంది. నేను ఇక్కడ ఉండలేను” అని ఆ వీడియోలో ఆమె పేర్కొంది. మతమార్పిడి చేయనందుకు లక్ష్యంగా చేసుకున్నారా అని ఆమెను అడిగినప్పుడు, అందుకే కావచ్చు అంటూ ఆ బాలిక ఆ వీడియోలో సమాధానమిచ్చింది.
కాగా, జువైనల్ జస్టిస్ చట్టాన్ని ఉల్లంఘించి వీడియో చిత్రీకరించి లీక్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. స్కూల్ వార్డెన్ను జువైనల్ చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తోటి విద్యార్థులతోపాటు బాలిక తెలిసిన ఇతరులతో కూడా మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.
బాలిక ఫిర్యాదును, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని, మరణించేటప్పుడు చేసిన ప్రకటనను వీడియో రికార్డ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి రవళి ప్రియా తెలిపారు. అయితే మతమార్పిడి గురించి ఆ బాలిక ఏమీ చెప్పలేదని, ఆమె తల్లిదండ్రులు కూడా దీనిపై ఆరోపించలేదన్నారు. అయినప్పటికీ తాము ఈ అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.