నల్లగొండ : గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలలో ఓ ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, ఒక కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయి మొత్తం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా రూటు మార్చి ప్రైవేట్ వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలతో కలిసి ప్రయాణికుల ముసుగులో గంజాయిని తరలిస్తున్నారని ఆయన వివరించారు.
తాజాగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం డిపోకు చెందిన రాజధాని డీలక్స్ బస్సును కట్టంగూర్ – నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించగా ఒడిషాకు చెందిన మహిళ సుమిత్ర సర్కార్, ఇద్దరు పురుషులు సుజిత్ బిస్వాస్, అమల్ పొద్దార్ భద్రాచలం మీదుగా 20 కిలోల గంజాయితో హైదరాబాద్ కు తరలిస్తూ పట్టుపడినట్లు తెలిపారు.
ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా విచారణలో తేలిందని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.
అదే విధంగా మరో కేసులో 100 కిలోల గంజాయిని ఆంధ్రా – ఒడిషా సరిహద్దు నుంచి మహారాష్ట్ర లాతూర్ కు తరలిస్తుండగా జాతీయ రహదారి – 65 పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కట్టంగూర్ సమీపంలో పట్టుకున్నట్లు డిఐజి తెలిపారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభు భజన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హ్యుందయి ఐ-20 కారు (MH 05 CM 2371) వాహనంలో భద్రాచలం నుంచి నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్, అక్కడి నుండి మహారాష్ట్రలోని లాతూర్ కు గంజాయి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.
కారులో సులేమాన్ ఇలియాస్ సయ్యద్, మహబూబ్ దంగ్డే లు 100 కిలోల గంజాయితో పట్టుబడ్డారని, గంజాయితో పాటు ఐ-20 కారు సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన ఇద్దరు మహిళలు అనసూయ వినాయక దూబే, పార్వతి నివర్తి జాదవ్, మరో ముగ్గురు పురుషులు దేవరాజ్ కామ్డే, సయ్యద్ హుస్సేన్ నాజర్, సోంనాధ్ దత్ జాదవ్ లకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు.
సీపీ కెమెరాల పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టామన్నారు. కాగా, సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియాలలో జగ్గయ్యపేట శాసనసభ్యుడు కుమారుడిని కట్టంగూర్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీ, గంజాయి కేసులో అదుపులోకి తీసుకొని విడిచిపెట్టినట్లుగా అసత్య ప్రచారాలు వస్తున్నాయని అవన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా ప్రజలు సామాజిక బాద్యతతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసుల్లో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సమర్ధవంతంగా పనిచేసిన శాలి గౌరారం సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, నకిరేకల్ సీఐ నాగరాజు, కట్టంగూర్ ఎస్.ఐ. శివ ప్రసాద్, పోలీస్ సిబ్బందిని డిఐజి రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.