‘బాహుబలి’ ద బిగినింగ్ ఓ ప్రశ్నతో ముగిసింది! కన్క్లూజన్గా వచ్చిన సీక్వెల్ చిత్రం సూపర్ సమాధానం ఇచ్చింది. ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన అయితే.. రెండోపార్టు సునామీ సృష్టించింది.‘డిజె టిల్లు’ సౌండ్ మరవకముందే.. ‘టిల్లు స్కేర్’ రీసౌండ్ అదిరింది. ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరుగుతుండటంతో.. సీక్వెల్ ఫార్ములాకు సినీ ఇండస్ట్రీ జై కొడుతున్నది. ఇంపైన కొనసాగింపుతో సీక్వెన్స్ ఫ్రీక్వెన్స్కు ఓటేస్తున్నది. ముఖ్యంగా ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమాలెన్నో రెండోభాగంతో ప్రేక్షకుల్ని మరింత అలరించడానికి ముస్తాబవుతున్నాయి.
Movie Sequels | మంచి కథను ఏకబిగిన చదివేయాలనుకుంటాడు పాఠకుడు. అంతలోనే రచయిత ‘సశేషం’ అంటూ కథకు విరామాన్ని ప్రకటించి తర్వాతి భాగంపై మరింత ఆసక్తిని పెంచుతాడు. సీక్వెల్ సినిమాలు కూడా అదే తరహాలో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా విజయవంతమైన సినిమాల సీక్వెల్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినీ రంగంలో సీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల కొనసాగింపు చిత్రాల హవా బాగా పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమాలెన్నో రెండో భాగంతో ప్రేక్షకుల్ని మరింత అలరించడానికి ముస్తాబవుతున్నాయి.
1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు) చిత్రం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే సేనాపతి పాత్రలో కమల్హాసన్ తనదైన నటనతో కట్టిపడేశారు. దర్శకుడు శంకర్ అద్భుతమైన టేకింగ్, జనరంజకమైన గీతాలు, కమల్హాసన్ ద్విపాత్రాభినయం, సినిమాలోని సామాజిక సందేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ‘ఇండియన్-2’ రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేండ్ల క్రితం పట్టాలెక్కిన ఈ సినిమా అనేక అవాంతరాలను దాటుకొని చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ఒకానొక దశలో సినిమా నిర్మాణాన్ని ఆపివేశారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ కలల ప్రాజెక్ట్ కోసం కమల్హాసన్-శంకర్ ద్వయం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా జూన్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ‘విక్రమ్’ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ తర్వాత కమల్హాసన్ నుంచి వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
‘పుష్ప-ది రైజ్’ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టాడో కానీ.. విడుదలై మూడేండ్లయినా ఆ సినిమా తాలూకు మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. ఈ చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంతో బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర మాస్లో ఓ కల్ట్ స్టేటస్ను సంపాదించుకుంది. దాంతో సీక్వెల్ ‘పుష్ప-ది రూల్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. టీజర్లో చూపించిన గంగమ్మ జాతర ఎపిసోడ్, అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ గెటప్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది.
కన్నడ చిత్రం ‘కాంతార’ దేశమంతటా సంచలన విజయం సాధించింది. డివోషనల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం భాషా భేదాలకు అతీతంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. దాదాపు 400 కోట్ల వసూళ్లను సాధించింది. రిషబ్శెట్టికి నటుడిగా, దర్శకుడిగా తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది. దక్షిణ కన్నడ సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంలో భూతకోల దైవారాధన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రీక్వెల్గా ‘కాంతార చాప్టర్-1’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది. ‘ఈ వెలుగులో భూతభవిష్యత్తు కాలాలన్నీ కనిపిస్తాయి.
ఇది కేవలం వెలుగు మాత్రమే కాదు.. ఓ దైవ దర్శనం. అది నీకు కనిపిస్తుందా?’.. అనే వాయిస్ ఓవర్తో విడుదలైన టీజర్ థ్రిల్ని పంచింది. హీరో రిషబ్శెట్టి లుక్స్, ఆహార్యం విభిన్నంగా ఉంటూ ఆకట్టుకున్నాయి. హోంబలే ఫిల్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్నది. దక్షిణాది నాలుగు భాషలు, హిందీతోపాటు బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘కాంతార’ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీక్వెల్ ఫస్ట్లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిభాగం ముందు జరిగిన కథతో ‘కాంతార చాప్టర్-1’ను తెరకెక్కిస్తున్నారు.
చాలా కాలం తర్వాత ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’తో మంచి విజయాన్ని అందుకున్నారు అగ్ర హీరో ప్రభాస్. మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో ఆయన్ని కొత్తగా ప్రజెంట్ చేశారు దర్శకుడు ప్రశాంత్నీల్. తొలిభాగం ముగింపులోనే రెండో భాగానికి సంబంధించిన హింట్ ఇచ్చారు దర్శకుడు. ‘శౌర్యాంగపర్వం’ పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. ఎన్నో ప్రశ్నలతో మొదటి భాగాన్ని ముగించిన ప్రశాంత్ నీల్.. రెండో భాగంలో వాటికి ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘శౌర్యాంగపర్వం’ సెట్స్ మీదకు
వెళ్లనుంది.
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నారు హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా
‘డబుల్ ఇస్మార్ట్’ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. హీరో రామ్కు జోడీగా కావ్య థాపర్ నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా తుది దశ చిత్రీకరణలో ఉంది. జూన్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ హిట్ కావడంతో ‘డబుల్ ఇస్మార్ట్’పై అంచనాలు రెట్టింపయ్యాయి.
‘అర్జున్రెడ్డి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ఈ సినిమా హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’ కూడా తెలుగు మాతృక స్థాయిలోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ‘కబీర్సింగ్’ హ్యాంగోవర్ నుంచి బయటకు రాకముందే ‘యానిమల్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు సందీప్రెడ్డి. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ‘యానిమల్’ దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘యానిమల్ పార్క్’ తెరకెక్కనుంది. సీక్వెల్లో తొలిభాగానికి మించిన
వైల్డ్ పాత్రలు ఉంటాయని, వయొలెన్స్ మోతాదు రెట్టింపు అవుతుందని దర్శకుడు చేసిన ప్రకటనతో సీక్వెల్పై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ సెట్స్పైకి వెళ్లనుంది.
అడవి శేష్ కెరీర్ని మలుపు తిప్పిన యాక్షన్ స్ర్పై థ్రిల్లర్ ‘గూఢచారి’. తెలుగు స్ర్పై థ్రిల్లర్స్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా ‘గూఢచారి-2’ రాబోతున్నది. బాలీవుడ్ ముద్దుగుమ్మ బనితా సంధు కథానాయిక. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్నది. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ హిట్ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద వందకోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. అఘోరా పాత్రలో బాలకృష్ణ అభినయానికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ‘అఖండ-2’ రానుంది. కొద్దిరోజుల క్రితమే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ‘అఖండ’ను మించిన యాక్షన్, డివోషనల్ ఎలిమెంట్స్తో దర్శకుడు బోయపాటి సీక్వెల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని అంటున్నారు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొనసాగింపు సినిమాల్లో ‘జై హనుమాన్’ ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన ‘హను-మాన్’ పెద్ద విజయాన్ని అందుకుంది. అద్భుతమైన వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను రూపొందించనున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హను-మాన్’ సంచలన విజయం సాధించడంతో ‘జై హనుమాన్’పై సహజంగానే మంచి అంచనాలు నెలకొన్నాయి. వీటితోపాటు ‘విరూపాక్ష -2’, ‘కార్తికేయ- 3’ వంటి భారీ చిత్రాలు కొనసాగింపు కథలతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
…? సినిమా డెస్క్