Monalisa | మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన “కుంభమేళా బ్యూటీ” మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునరేషన్తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాధారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది. ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా సమయంలో మోనాలిసా దండలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు అనూహ్యంగా సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి వరుస చిత్రాలతో బిజీగా మారింది.
ఇటీవల ఆమె తొలి హిందీ చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచంలోకి వచ్చినా తన పాత జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోనని, ఆ అనుభవాలే తనకు బలం ఇచ్చాయని తెలిపింది. ఇటీవల మోనాలిసా మళ్లీ ప్రయాగ్రాజ్కు వెళ్లి గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. తన జీవితాన్ని మార్చిన ఆ స్థలానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజానికి తిరిగి ఏదో చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం పాఠశాల స్థాపించాలన్నదే తన కల అని చెప్పింది. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువు లేక వెనుకబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం వినియోగించాలనుకుంటున్నానని మోనాలిసా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలతో బిజీగా ఉంది. అందులో రెండు తెలుగు చిత్రాలు కాగా, మరోటి హిందీ చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’. సినీ రంగంలో ఎదుగుతూ సమాజానికి సేవ చేయాలన్న ఆమె సంకల్పం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.