హీరోల దృష్టిని ఆకర్షించేందుకు ఈ మధ్య అభిమానులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య ఈశ్వర్ అనే అభిమాని సుమారు 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి సరిగ్గా చిరంజీవి పుట్టినరోజున కొండగట్టు కు చేరుకున్నాడు. స్వామివారిని దర్శించుకుని చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబసభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.అనంతరం చిరు, పవన్ని కూడా కలిసాడు.
ఇక తాజగా ఓ దివ్యాంగ అభిమాని 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని(Chiranjeevi) కలిశాడు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్కి చిరంజీవి అంటే ఎనలేని ప్రేమ. మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. గంగాధర్ని తన ఇంటికి పిలిపించుకొని అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీసారు. ఇలాంటి సాహసాలు మరోసారి చేయోద్దని సున్నితంగా హెచ్చరించారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.కాగా, ఇటీవల చిరు అభిమాని అనారోగ్యంతో బాధపడుతుండగా, అతని ఫ్యామిలీకి ఫ్లైట్ టిక్కెట్స్ పంపి వారిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన విషయం తెలిసిందే.