తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కథానాయిక అమలాపాల్. ఈ మధ్య సినిమాల్లో కాస్త సందడి తగ్గించిన ఈ తార వెబ్సీరిస్ల్లోనూ నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ని వివాహం చేసుకుని కొన్నాళ్లకే విడిపోయిన ఆమె ఆ తరువాత కెరీర్పై దృష్టిపెట్టింది. అయితే అప్పుడప్పుడు కొన్ని కామెంట్లతో సినీపరిశ్రమలో హాట్టాపిక్గా కూడా నిలుస్తున్నారు అమలాపాల్. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమను సినీకుటుంబాలు, అభిమానులే శాసిస్తున్నారనే ఆమె చేసిన కామెంట్స్ తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల్లో మీరు ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించగా అమలా స్పందిస్తూ ‘నేను తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నా. ఇక్కడ ఎక్కువగా వారసత్వ పోకడ నడుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో వారి వారసులు, అభిమానులదే పైచేయి. ఇక సినిమాలు, అందులో పాత్రలు కూడా విభిన్నంగా వుంటాయి. కొన్ని సినిమాల్లో ఇద్దరు కథానాయికలు వుంటారు. ఇద్దరితోనూ ప్రేమ సన్నివేశాలు, పాటలు వుంటాయి. కమర్షియల్ అంశాల్లో గ్లామర్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే తెలుగు సినిమాలకు నేను దగ్గరకాలేదు. నేను ఇక్కడ తక్కువ సినిమాలు చేయడానికి బహుశా ఇదీ ఒక కారణం కావచ్చు’ అని చెప్పింది.