Cryptocurrency | క్రిప్టోకరెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్చువల్ డిజిటల్ అసెట్ అని కూడా దాన్ని పిలవొచ్చు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో క్రిప్టోకరెన్సీని లీగల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా పేమెంట్స్ ప్లాట్ఫామ్లలో.. పేమెంట్ ఆప్షన్గానూ క్రిప్టోను తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా క్రిప్టో పేమెంట్స్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. బిట్కాయిన్, ఇథీరియం, డోజీకాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు భారత్లో చట్టబద్ధం కానప్పటికీ.. చాలామంది వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ప్రపంచం అంతా క్రిప్టోకరెన్సీ వైపు చూస్తున్న నేపథ్యంలో భారత్ కూడా త్వరలోనే క్రిప్టోకరెన్సీని లీగల్ చేస్తుందని చాలామంది భావించారు. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. వర్చువల్ డిజిటల్ అసెట్స్పై 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని… వాటి పేమెంట్స్పై కూడా ఒక శాతం టీడీఎస్ విధిస్తామని మంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో కేంద్రం క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత కల్పిస్తుందేమో అని క్రిప్టో ఇన్వెస్టర్లు కాస్త ఉపశమనం చెందారు. కానీ.. ఇంతలోనే ఆర్బీఐ నుంచి డిజిటల్ రూపీ వస్తుందని.. అది కూడా క్రిప్టోకరెన్సీ వాడుతున్న బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారానే వస్తుందని బడ్జెట్లో మంత్రి చెప్పడంతో క్రిప్టోపై ఉన్న అనుమానాలు ఇంకాస్త పెరిగాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం క్రిప్టోకరెన్సీ బిల్లు పెడుతుందని.. దీనిపై సభలో చర్చించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ.. శీతాకాల సమావేశాల్లో అసలు క్రిప్టోకరెన్సీ బిల్లు ఊసే లేదు. కాకపోతే ఆ బిల్లులో ఆర్బీఐ తీసుకొచ్చే డిజిటల్ రూపీపై వివరాలు ఉన్నాయి. అందులో ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై బ్యాన్ విధించేలా సభ నిర్ణయం తీసుకునే విధంగా ఉన్నప్పటికీ.. క్రిప్టోకరెన్సీ కోసం ఉపయోగించే టెక్నాలజీని ప్రమోట్ చేసే విధంగా ముందుకు వెళ్లాలని ఆ బిల్లులో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ.. క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయడమే సరైనదని.. అది ఫ్రాడ్ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉండే స్కీమ్స్ లాంటివి అని స్పష్టం చేశారు. భారత్ ఫాలో అయ్యే అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్ను అలాగే ఉంచాలంటే.. ఇటువంటి క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయాల్సిందే అని ఆయన నొక్కి చెప్పారు.
క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై వచ్చే లాభాలపై ట్యాక్స్ వేయడం అనేది ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమ అధికారం అని ఇటీవల నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో బ్యాన్ అవుతుందా? అవదా? అనేది కన్సల్టెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నిర్ణయించబడుతుంది.
క్రిప్టోకరెన్సీలు.. స్థూల ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పుకొచ్చారు. క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరించడం నా బాధ్యత. రిస్క్ తీసుకొని.. క్రిప్టోలలో పెట్టుబడులు పెడుతున్నారనే విషయాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు అని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ చట్టబద్ధం కాదు అని ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ కూడా అన్నారు. చట్టబద్ధ లావాదేవీల కోసం వాటిని ఎప్పటికీ పరిగణించలేము. క్రిప్టో అసెట్స్కు ఏనాటికీ భారత్ చట్టబద్ధత కల్పించదు. ఆర్బీఐ తీసుకొచ్చే డిజిటల్ రూపీ మాత్రమే భారత్లో లీగల్ టెండర్గా ఉంటుంది.. అని సోమనాథన్ వెల్లడించారు.
ఈనేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై ఉన్న అనుమానాలు ఇంకా పెరిగాయి తప్పితే తగ్గడం లేదు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బిట్కాయిన్, ఇథీరియం, డోజీకాయిన్, సొలానా లాంటి క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది.