న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) లిమిటెడ్కు చెందిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా ఓ భారీ కంపెనీని ఏర్పాటు చేయాలని చూస్తున్న ఎల్అండ్టీ.. ఈ రెండింటినీ ఏకం చేయాలని యోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలియవస్తున్నది. షేర్ల మార్పిడి ద్వారా ఇరు సంస్థలను ఒక్కటి చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం ఆయా కంపెనీల బోర్డు సమావేశాల్లో చర్చించే వీలున్నట్టు తెలుస్తున్నది. 2019లో మైండ్ట్రీని లార్సెన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో ఎల్అండ్టీకి దాదాపు 61 శాతం వాటా ఉన్నది. బ్లూంబర్గ్ లెక్కల ప్రకారం దీని మార్కెట్ విలువ 8.3 బిలియన్ డాలర్లు. ఇకపోతే ఇన్ఫోటెక్లో ఎల్అండ్టీకి సుమారు 74 శాతం వాటా ఉన్నది.
దీని మార్కెట్ విలువ 13.6 బిలియన్ డాలర్లు. దీంతో రెండు సంస్థలు కలిస్తే 22 బిలియన్ డాలర్ల సంస్థ ఆవిర్భవించనున్నది. కాగా, ఈ విలీనం.. వ్యాపారం, క్లెయింట్లపరంగా ఇరు సంస్థలకు లాభించగలదన్న అభిప్రాయాన్ని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఈ సందర్భంగా వెలిబుచ్చారు. నిర్వహణపరమైన ఖర్చులు తగ్గుతాయంటున్నారు. అయితే ఈ విలీనానికి సంబంధించి ఎల్అండ్టీ నుంచి స్పందన రాలేదు. సోమవారం మైండ్ట్రీ ఆర్థిక ఫలితాలు రాగా, మంగళవారం ఇన్ఫోటెక్ ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో మైండ్ట్రీ షేర్ విలువ 4.1 శాతం, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్ విలువ 3.2 శాతం నష్టపోవడం గమనార్హం.
ఊహాగానాలే: మైండ్ట్రీ
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్తో విలీన వార్తలు ఊహాగానాలేనని మైండ్ట్రీ ప్రకటించింది. ‘విలీనంపై మాకై తే ఎలాంటి సమాచారం లేదు’ అంటూ రెగ్యులేటరీ ఫైలింగ్లో స్పందించింది. సోమవారం ట్రేడింగ్లో తమ సంస్థ షేర్ ధరల కదలికలు.. పరిశ్రమ, మార్కెట్ పరిణామాలకు లోబడే జరిగాయన్నది.
మైండ్ట్రీ లాభం రూ. 473 కోట్లు
మైండ్ట్రీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.473.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.317.30 కోట్ల లాభంతో పోలిస్తే 49.10 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 37.4 శాతం అధికమై రూ.2,897.40 కోట్లకు చేరుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.10,525.30 కోట్ల ఆదాయంపై రూ.1,652.90 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఐటీ రంగం ర్యాపిడ్గా దూసుకుపోతున్నదని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటికి అనుగుణంగా డిజిటల్పై ప్రత్యేక దృష్టి సారించడంతో గతేడాది రికార్డు స్థాయి లాభాలను ఆర్జించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేబాషిస్ చటర్జీ తెలిపారు. గడిచిన త్రైమాసికానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.27 లేదా 270 శాతం తుది డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది.