ప్రభుత్వ సంస్థల్ని బతకనీయట్లేదు.. పెన్షన్ స్కీములనూ వదలట్లేదు.. చివరకు పన్ను రాయితీలనూ మిగల్చట్లేదు.ఇదీ.. మోదీ సర్కారు పాలన తీరు. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా వెళ్తున్న కేంద్రం.. సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోతున్నది. ఇప్పుడు వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాల్లో మార్పులకు దిగుతూ.. వేతన జీవుల పొట్టకొడుతున్నది బీజేపీ అధినాయకత్వం.
కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్న కేంద్ర సర్కారు.. సామాన్యుడి కష్టార్జితాన్ని కాజేస్తున్నది. మొదట మీ ఇష్టం అంటూ విధానాలను పరిచయం చేయడం.. ఆపై మా ఇష్టం అంటూ ఆ విధానాలను బలవంతంగా ప్రజలపై రుద్దడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందు నుంచీ అలవాటైన పనే. ఇప్పుడు ఆదాయం పన్ను (ఐటీ) విధానాల్లోనూ సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రెండున్నరేండ్ల క్రితం 2020 ఫిబ్రవరి 1న పన్ను రాయితీలకు మంగళం పాడుతూ పార్లమెంట్ సాక్షిగా 2020-21 బడ్జెట్లో కొత్త ఐటీ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నాడు కొత్త ఐటీ విధానంలోకి రావడం, రాకపోవడం పన్ను చెల్లింపుదారుల ఇష్టమేనన్న సంగతీ విదితమే. అయితే ఇప్పుడు పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులోభాగంగానే ఎటువంటి మినహాయింపులు, కోతలు లేని కొత్త ఐటీ విధానాన్ని పరిశీలించే యోచనలో మోదీ సర్కారు ఉన్నట్టు సమాచారం. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులను మరింతగా ఆకట్టుకునేలా ఇందులో వీలైనంత త్వరగా మార్పులు తీసుకురానున్నారని తెలుస్తున్నది. అలా పాత ఐటీ విధానానికి ఆదరణ లేదని చూపుతూ పన్ను రాయితీలకు మంగళం పాడేయవచ్చన్నదే మోదీ సర్కారు ఎత్తుగడ.
దూరపు కొండలు నునుపు అన్న చందంగా.. పాత విధానం కంటే కొత్త విధానంతోనే పన్ను చెల్లింపుదారులకు లాభం ఎక్కువ అని కేంద్రం చెప్తున్నది. అయితే నిశితంగా గమనిస్తేగానీ కొత్త విధానంలో ఉన్న నష్టం ఏమిటన్నది తెలియదు. నిజానికి కొత్త విధానంతో లాభాలున్నాయి. కానీ గృహ, విద్య తదితర రుణాలు లేనివారికే అది. భారతదేశం అంటేనే మధ్యతరగతి ప్రజానీకం. ఆర్థిక సాయంతోనే అత్యధికులు జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతారు. కాబట్టి నూటికి 99 శాతం మందికి ఏదో ఓ రుణం తప్పనిసరే. అలాంటప్పుడు కొత్త పన్ను విధానం ఎవరి బాగు కొరకు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇప్పటివరకైతే కొత్త విధానం కంటే పాత విధానంలోనే సగటు పన్ను చెల్లింపుదారులకు మిగులుతున్నది ఎక్కువ. ఈ క్రమంలోనే కొత్త విధానంలో పన్నుల రేట్లు మరింత తగ్గించి.. తొలుత పాత విధానాన్ని కనుమరుగుజేసి ఆపై రేట్లను తిరిగి పెంచాలన్న తలంపు కేంద్రంలో ఉందని అంటున్నారు.
ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర్నుంచే నరేంద్ర మోదీది మొండి పట్టు. దేశానికి ప్రధాన మంత్రిగా వచ్చినా ఆ వైఖరిలో మార్పు రాలేదు. ప్రభుత్వం అంటేనే సంక్షేమానికి దూరం.. కార్పొరేట్లకు వరం అన్నట్టుగా ఇప్పుడు కేంద్రం పాలన సాగుతున్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. చట్టాలకు తూట్లు పొడుస్తూ తీసుకుంటున్న ఆయా విధానాలే ఇందుకు నిదర్శనం. నిజానికి పన్ను మినహాయింపు అన్నది సాధారణ నియమానికి ఓ చట్టబద్ధ రూపం. ప్రతి ఒక్కరికీ ఆ హక్కు ఉండాల్సిందే. పైగా పన్ను మినహాయింపులు, ఆయా సెక్షన్ల కింద లభించే కోతల వల్ల నిస్తేజం ఆవరించిన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం కూడా రాగలదు. అందుకే అటు ట్యాక్స్పేయర్లకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు లాభించేలా పన్ను మినహాయింపులకు వ్యవస్థలో ప్రాధాన్యతనిచ్చారు. పన్నుల చెల్లింపుల్లో సంపన్నులు పక్కకు తప్పుకోకుండా ఉండేందుకూ ఒక రకంగా ఈ మినహాయింపులు ఉపయోగపడుతున్నాయి. కానీ ప్రస్తుత కేంద్ర విధానాలు ఈ స్ఫూర్తిని పాతరేసేలా ఉంటున్నాయన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి
-బిజినెస్ డెస్క్
సాధారణ ప్రజానీకం కంటే కార్పొరేట్ వర్గాలంటేనే కేంద్రానికి మక్కువ ఎక్కువ. అందుకే సగటు వేతనజీవి నడ్డివిరిచేలా ఆదాయం పన్ను రేట్లను వడ్డిస్తున్న మోదీ సర్కారు.. బడా బాబుల కోసం మాత్రం కార్పొరేట్ పన్నును తగ్గిస్తూపోతున్నది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సాయం చేయడానికి, వారిపై భారం తగ్గించడానికే కొత్త పన్ను విధానం అంటూ మాటలు చెప్తున్నా.. మధ్యతరగతి వర్గాల జేబుల నుంచి మరింత దండుకునే ఉపాయాలు వేస్తున్నది. ఇప్పటికే ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన కొత్త సంస్థలకు, అలాగే 2024 మార్చి 31కి ముందు వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను ప్రారంభించే సంస్థలకు కార్పొరేట్ పన్నును 25 శాతం నుంచి 15 శాతం వరకు దించింది. మొత్తానికి వార్షిక బడ్జెట్ను పన్నుల బాదుడు, వాటాల విక్రయానికి, సంస్థల ప్రైవేటీకరణకే అన్నట్టుగా మోదీ సర్కారు
భావిస్తున్నది మరి.