China Mobiles Tax Evation | ఒప్పో మొబైల్తోపాటు వివో ఇండియా, షియోమీ టెక్నాలజీ వంటి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు రూ.9000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి. వాటిల్లో ఒప్పో మొబైల్ ఇండియా రూ.5,086 కోట్లు.. (రూ.4,403 కోట్లు కస్టమ్స్ డ్యూటీ, రూ.683 కోట్లు జీఎస్టీ) ఎగవేసింది. 2018-19 నుంచి 2022-23 మధ్య ఈ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆయా కంపెనీల నుంచి ప్రభుత్వం రూ.1,629.87 కోట్లు రికవరీ చేసిందని శుక్రవారం రాజ్యసభకు చెప్పారు.
వివో ఇండియా రూ.2875 కోట్ల కస్టమ్స్ డ్యూటీ, రూ.48.25 కోట్ల జీఎస్టీతో కలిపి మొత్తం రూ.2,923.25 కోట్ల పన్ను ఎగవేసిందని సభ్యుడు అడిగిన ఓ రాత పూర్వక ప్రశ్నకు సమాధానంగా రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షియోమీ టెక్నాలజీ ఇండియా రూ.682.51 కోట్లు కస్టమ్స్ డ్యూటీ, రూ.168.63 కోట్ల జీఎస్టీతో కలిపి మొత్తం రూ.851.14 కోట్ల పన్ను ఎగవేసిందని వివరించారు.
ఒప్పో మొబైల్ ఇండియా 2019-20లో ఎగవేతకు పాల్పడిన రూ.4,389 కోట్ల నుంచి రూ 450 కోట్లు రికవరీ చేశామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. వివో ఇండియా (2021-22) నుంచి రూ.2217 కోట్లకు గాను రూ.72 కోట్లు, షియోమీ నుంచి రూ.46 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. మరో చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనెవో రూ.42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు.
ఒప్పో నుంచి రూ.1214.83 కోట్లు, వివో నుంచి రూ.168.25 కోట్లు, షియోమీ నుంచి రూ. 92.8 కోట్ల పన్ను రికవరీ చేశామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 2021-22లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీల టర్నోవర్ రూ.1.5 లక్షల కోట్లని చెప్పారు. భారత్లో స్మార్ట్ ఫోన్ల తయారీతో చైనా కంపెనీలు 75 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, ఆపరేషనల్ సిబ్బంది రూపంలో దాదాపు 80 వేల మందికి ఉపాధి కల్పించాయని వివరించారు.