గుంటూరు: పల్నాడు ప్రాంతం ఇప్పుడు కొత్త జిల్లాగా అవతరించనున్నది. కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పల్నాడుకు కూడా స్థానం దక్కింది. ఎన్నో ఏండ్లుగా జిల్లాగా ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్.. ఇవాల్టికి నెరవేరుతుండటంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటుకానున్న ఈ జిల్లా.. 26 జిల్లాల్లో అత్యంత వెనకబడిన జిల్లాగా చెప్పుకోవచ్చు.
వెనుకబాటుతనం. పైగా ఫ్యాక్షనిజం.. అన్నీ కలసి ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి పోయింది. హత్యలు, కక్షలు, కార్పణ్యాలతో రగలిపోయే పల్నాటి ప్రాంతంలో అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించడం లేదని స్థానిక మేధావులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విభజన అనంతరం కొత్త ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం పల్నాడు ప్రాంతం అభివృద్ధిపై కొంత వరకు దృష్టిపెట్టినా పూర్తిస్థాయి అభివృద్ధి చేయలేకపోయింది. అటువంటి పల్నాడు ప్రాంతం ఇప్పుడు కొత్త జిల్లాగా అవతరించనుండటంతో అభివృద్ధిపై స్థానికులు గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇప్పటివరకు ఉన్న గుంటూరు జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా మార్చారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకూరిపేట, వినుకొండ, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో ఉండనున్నాయి. పల్నాడులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాతైనా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం.
పల్నాడు ప్రాంత వాసుల దశాబ్దాల కోరికగా ఉన్నా జిల్లా ఏర్పాటు చేయడం పట్ల పల్నాడు మేధావుల వేదిక అధ్యక్షులు కోడూరు సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పల్నాడు ప్రాంతంలో పుల్లరి ఉద్యమం పేరుతో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరుతో ఈ జిల్లాను “కన్నెగంటి హనుమంతు పల్నాడు” జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని సాంబశివరావు పేర్కొన్నారు.