(Murder) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటు చేసుకున్నది. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణకు ఇద్దరు దారుణహత్యకు గురైనారు. మద్యం మత్తులో వాగ్వాదానికి దిగిన వారు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరు యువకులు కలిసి మరో ఇద్దరిపై దాడి చేసి చంపేశారు. తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డున ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న శ్రీనివాస మడత మంచముల లాడ్జ్ వద్ద ఈ సంఘటన జరిగింది.
పూటుగా మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఘర్షణకు దిగారు. ఇద్దరు మరో ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడిలో జువ్వలపాలెంకు చెందిన దొరబాబు అక్కడికక్కడే మరణించాడు. దొరబాబు రౌడీషీటర్గా నమోదై ఉన్నాడని, పలు నేరాలతోసంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మరో వ్యక్తి తాడేపల్లిగూడెం కొబ్బరి తోటకు చెందిన ఎడ్లపల్లి సత్యనారాయణ అలియాస్ మీసాల రాజుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రాజును ఆంబులెన్స్లో తణుకులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, రాజు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. రాజు మృతదేహాన్నీ పోస్ట్మార్టం నిమిత్తం తణుకు ఏరియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఘర్షణ తలెత్తి హత్యకు దారితీసి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.