అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, జిల్లాల సరిహద్దులను ఎలా నోటిఫై చేయాలనే అంశంపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. కొత్త జిల్లా ఏర్పాటుపై ఏడాదిన్నరగా కసరత్తు జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజన ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా సర్వే చేపట్టినట్లు విజయ్కుమార్ తెలిపారు. జిల్లా స్వరూపం ఎలా ఉండాలనే దానిపై లోతైన అధ్యయనం చేసినట్లు చెప్పారు. ప్రజల మనోభావాలు, చారిత్రక నేపథ్యాన్ని అధ్యయనం చేసి ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వనరుల సమతుల్యతను కూడా సాధించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రం అందరికీ చేరువలో ఉండేలా చూసుకున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి రెండు జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ఆలోచన చేశారని, శ్రీకాకుళం పేరుతో ఉన్న విద్యాసంస్థలన్నీ ఎచ్చెర్లలోనే ఉన్నాయని, అందుకే శ్రీకాకుళంలో ఎచ్చెర్లని చేర్చామని, రాజాంను విజయనగరంలో కలిపినట్లు విజయ్ కుమార్ చెప్పారు. అల్లూరి జిల్లా ఏర్పాటుతో రంపచోడవరం అభివృద్ధి చెందుతుందన్నారు.