గుంటూరు జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ ఆలయంలో జరిపిన తవ్వకాల్లో లోహపు రాళ్లు బయటపడటంతో కలకలం రేగింది. తవ్వకాల్లో బయటపడిన కుండలను, వాటిలో లభించిన లోహపు రాళ్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు వచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనపర్చుకున్నారు. దొరికిన కుండ, లోహం ముద్దలు మధ్యయుగం నాటివిగా పురావస్తు శాఖ అధికారులు తేల్చారు. మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించి లోహపు ముద్దలు అని తేల్చడంతో వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది.
వినుకొండ సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం కూలీలు గుంతలు తవ్వుతుండగా మట్టి కుండ బయటపడింది. ఈ కుండలో కొన్ని లోహపు రాళ్ళు ఉన్నాయి. ఈ వార్త దావానలంలా జిల్లా అంతటా వ్యాపించింది. గుప్త నిధులు బయడ పడ్డాయని స్థానికంగా ప్రచారం జరిగింది. విషయం తెల్సుకున్న పురావస్తు శాఖ డీడీ సురేష్ వినుకొండలోని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి తవ్వకాల్లో బయట పడిన మట్టి కుండ, కుండలో దొరికిన లోహాన్ని పరిశీలించారు.
ఈ కుండ మధ్యయుగ కాలం నాటిదని డీడీ సురేష్ తెలిపారు. కుండలో ఉన్న లోహం సీసం, కాపర్ కలిపి తయారు చేసిన ముద్దగా భావిస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ శాఖకు వాటిని అప్పగించి ఏఏ లోహ పదార్థాలున్నాయో కనుక్కుంటామన్నారు. ఆదికాలం నాటి మానవులు ఈ పరిసరాల్లో సంచరించారన్న ఆనవాళ్ళు ఉన్పాయని స్పష్టం చేశారు. మొత్తం మీద కుండలో ఉన్నం లోహం విలువైనది కాదని, వాడగా మిగిలిన లోహాన్ని కుండలో భద్రపరిచి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.