కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు మంచిదే కానీ, జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందుపురం ఊసేలేదని, ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్పు చేస్తూ చేసిన ప్రక్రియ సరైనదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ప్రక్రియలో హిందుపురంను మరిచిపోవడం శోచనీయమని అన్నారు. హిందుపురం కేంద్రంగా పుట్టపర్తి జిల్లాను ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందన్నారు. పుట్టపర్తి జిల్లాగా కాకుండా శ్రీసత్యసాయి జిల్లాగా పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని సూచించారు. జిల్లాల ఏర్పాటులో ఎలాంటి రాజకీయాలు చేయకూడదని సలహా ఇచ్చారు. ఇదే సమయంలో హిందుపురం ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని బాలకృష్ణ చెప్పారు. వ్యాపార, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా హిందుపురం ఎంతో అభివృద్ధి సాధించినది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భూమి హిందుపురంలో పుష్కలంగా ఉన్నదని, అందుకని హిందుపురం ప్రజల చిరకాల కోరిక అయిన హిందుపురం జిల్లాను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.
గత కొంత కాలంగా హిందుపురం జిల్లాగా మారనున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే, ప్రభుత్వం మాత్రం పుట్టపర్తి కేంద్రంగా జిల్లాను ఏర్పాటుచేసింది. అయితే, హిందుపురం ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.