Basmati Rice | మన దేశంలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ దేశంలో లేని వ్య్వసాయ వనరులు మన దేశంలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో వరితో పాటు అనేక వాణిజ్య పంటలు పండిస్తున్నారు. వరి పంటను ఎక్కువ మోతాదులో సన్న రకాలను, తక్కువ మోతాదులో దొడ్డు రకాలను సాగు చేస్తారు. అయితే, బాస్మతి వరి మాత్రం రెండు తెలుగు రాష్టాలలో చాల తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. దీనికి ప్రధాన కారణం- పంట కాలం ఎక్కువ రోజులుగా ఉండటమే. సంపన్నులు మాత్రమే సువాసనలు వెదజల్లే ఈ బాస్మతి బియ్యాన్ని విందు భోజనాలకు వాడే వారు. ఇప్పుడు మధ్యతరగతి వారు సైతం ఏ చిన్న శుభకార్యం జరిగినా ఇదే రకం బియ్యం వాడేందుకు ముందుకొస్తున్నారు.
వ్యవసాయాన్నినవీన పరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశోధన, విద్యా సంస్థల ద్వారా కొత్త విత్తనాలు, కొత్త వంగడాలు అభివృద్ధి చేస్తున్నారు . దీనిలో భాగంగా పూస రకం బాస్మతి వరిని అభివృద్ధి చేశారు. బాస్మతి కొత్త రకం పీబీ 1886 ప్రత్యేకతలు ఏమిటో, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం.
పూస బాస్మతి సాగు
ఖరీఫ్లోనే కాదు, రబీలోనూ బాసుమతిని సాగుచేసి 35 బస్తాలకు మించి దిగుబడి సాధించవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటితే ఏప్రిల్ నెల్లో కోతకు వస్తుంది. మండు వేసవిలో కోతకోసి, నూర్పిళ్లు చేసినా ఎకరానికి 35 బస్తాల దిగుబడి వస్తున్నది. సాధారణ వరి పంట మాదిరిగా 120 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. జూన్ తొలి వారం నుంచి 15 వరకు ఈ రకం విత్తనాన్ని నాటేందుకు అనువైన రోజులు. అక్టోబర్ 20 – నవంబర్ 15 మధ్య కోతకు వస్తుంది. ఎకరానికి 10 నుంచి 15 కేజీల విత్తనం సరిపోతుంది. ఈ రకం వరి పంటలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం విశేషం.
విత్తుకునే విధానం
20 రోజుల నారు నాటుకోవాలి. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గుతుంది. చదరపు మీటరుకు 20 మొక్కలు నాటడం శ్రేయస్కరం. దగ్గరగా నాటితే పిలకల సంఖ్య తగ్గటంతోపాటు, సూర్యరశ్మి, గాలి, వెలుతురు మొక్కలన్నింటికీ సోకక కొన్ని పిలకలు చనిపోతాయి.
1 కేజీ విత్తనం ఖరీదు రూ.200/-నుంచి ప్రారంభమవుతుంది. 10 కిలోల విత్తనానికి 120 గజాల వెడలు నారుమడి తయారు చేసుకోవాలి. రెండు, మూడు సార్లు కలియ దున్నుకోవాలి. 10 కేజీల విత్తనానికి 2 కిలోల డీఏపీ, 1 కేజీ పోటాష్, 1 కిలో యూరియా, 1 కిలో జింక్ నారుమడిలో చల్లుకొని గొర్రు తోలుకోవాలి. నారు ఎదుగుదలను గమనించి ప్రధాన పొలం తయారు చేసుకోవాలి. పొలంలో మదులను సమాంతరంగా గొర్రు తోలుకొని ఎకరానికి 60 కిలోల డీఏపీ, 50 కిలోల పోటాష్, 30 కిలోల యూరియా, 20 కిలోల జింక్, 100 కేజీల , వేపపిండి చల్లుకొని పొలం నాటుకోవాలి. పొలం నాటిన 20 నుంచి 30 రోజుల తర్వాత ఎకరానికి 20-20-0-13, 50కిలోలు, 25 కిలోల పోటాష్, 25 కిలోల యూరియా చల్లుకోవాలి.
చీడ పురుగుల నియంత్రణ
బాస్మతి వరి పంట లాభదాయకమైనదే. అయితే ఈ పంటలో వచ్చే వ్యాధుల కారణంగా రైతులు తరచూ నష్టాలకు గురవుతున్నారు. ముఖ్యంగా బీ. బ్లాస్ట్ , బాక్టీరియల్ లీఫ్ వ్యాధులు వ్యాధులకు ఎక్కువగా హాని కలిగిస్తాయి. వరి ఆకులపై చిన్న నీలిరంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి తర్వాతత పడవ ఆకారంలో మారతాయి. ఇది క్రమంగా పంట దిగుబడిని తగ్గిస్తుంది.
పురుగు ఆశించినట్లు కనిపిస్తే క్లోరంత్ర నిలిప్రోల్ అనే మందును ఎకరానికి 60 ఎంఎల్ చొప్పున పిచికారి చేసుకోవాలి. లేదా హిమమేక్టోబెంజోమైట్ పురుగు మందును ఎకారని 100 గ్రాముల చొప్పున పిచికారి చేసుకోవాలి. జింక్ లోపం కనిపించిన వెంటనే 100 గ్రాముల చిలేటేడ్ జింక్ను 250 గ్రాముల ప్రేపినిబ్-75% తో కలిపి పిచికారి చేసుకోవాలి. పగటి ఉస్నోగ్రత 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీలుగా ఉండి.. రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది.
నీటి పారుదల
బాస్మతి వరికి సాధ్యమైనంత వరకు తక్కువ నీరందించాలి. పొలంలో 2 అంగుళాల లోతుకు మించి నీరు పెట్ట కూడదు. బయటకు వచ్చిన పిలక సజావుగా ఎదగాలంటే, నీటిలో మునగ కూడదు. వారం, పది రోజుల వ్యవధిలో పొలాన్ని ఆరబెట్టాలి.
బాస్మతి వరి ధాన్యాన్ని మంచు, చలి ఎక్కువగా ఉన్న రోజుల్లోనే, ఉత్తరాదిలోనే సాగు చేయాలని అపోహపడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్టాల్లో కూడా సాగులోకి రావటమే కాకుండా మంచి దిగుబడినిస్తుండటం విశేషం.