బంగారు భవితకు చదువు కావాలి. ఆ చదువు కోసం బడికెళ్లాలి. బడికెళ్లాలంటే పుస్తకాలు కావాలి. కాబట్టే పేదింటి పిల్లల్ని బడిబాట పట్టించి, పుస్తకాలు పంచుతున్నది ‘ప్యూర్’అనే స్వచ్ఛంద సంస్థ. సర్కారీ బడులలో ‘చదువు – సంక్షేమం’కోసం సోషల్ మీడియా వేదికగా వేలమందిని ఒక్కటి చేసిన వేదిక ఇది. ఆ స్వచ్ఛమైన ఆలోచనకు, స్వచ్ఛమైన ఆచరణకు.. కర్త, కర్మ, క్రియ శైలా తాళ్లూరి. ‘మా ఆసరా కోసం ఎవరూ ఎదురు చూడని రోజొకటి రావాలి’ అంటున్నారు శైల. ఆ సుదినం కోసం అనగనగా ఓ రోజున మొదలైన తన సేవా ప్రయాణం గురించి..
మా నాన్న బ్యాంక్ ఆఫీసర్. అమ్మ టీచర్, రచయిత్రి. హైదరాబాద్లో పెరిగాను. చిన్నప్పటి నుంచీ పుస్తకాలు బాగా చదివేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా మంచి స్కూల్స్లో చదివించారు. దీంతో పేదల జీవితాల్లోని కష్టాల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. డిగ్రీ తర్వాత పెండ్లయింది. అమెరికా వెళ్లాను. పాతికేండ్లుగా అక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం, క్యాలిఫోర్నియా కేంద్రంగా ఓ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.
అలా మొదలైంది యూఎస్ గ్రీన్ కార్డ్ వస్తే రెండు లక్షలు హుండీలో వేస్తానని తిరుపతి వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. కోరుకున్నట్టే జరిగింది. అదే సమయంలో కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. కట్టుబట్టలతో వీధిపాలైన పేదల్ని చూసి కడుపు తరుక్కుపోయిది. అయినా, డబ్బులు దేవుడి హుండీలోనే ఎందుకు వేయాలి? మనుషుల్లోనే దేవుడుఉన్నాడని అంటారే. కష్టాల్లో ఉన్న మనుషులకు సాయం చేస్తే దేవుడికి ఇచ్చినట్టే కదా అనుకున్నాను. అప్పట్లో అమెరికా నుంచి డబ్బు పంపడానికి చాలా తతంగం ఉండేది. అమ్మకు ఫోన్ చేసి లాకర్లో ఉన్న నా వడ్డాణం కుదువపెట్టి బట్టలు, వంటపాత్రలు, సరుకులు కొనివ్వమని చెప్పాను. మా కాలనీ వాళ్ల సహకారంతో అమ్మ ఆ పని పూర్తిచేసింది. అలా దేవుడి రుణం తీర్చుకున్నాను. సాయాన్ని అందుకుంటున్న సమయంలో ఆ బాధితుల కండ్లలో కనిపించిన సంతృప్తి.. నిస్వార్థంగా జీవించాలనే ఆలోచనకు పునాది.
అమ్మ మాట
చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తనవంతు సాయం చేసేది అమ్మ. నాపై ఆమె ప్రభావం ఉంది. అమ్మ రచయిత్రుల వాట్సాప్ గ్రూపుల్లో ఉండేది. ఒక టీచర్ తమ బడిలో పిల్లలు నోట్బుక్స్, పళ్లాలు లేక ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ పెట్టింది. అది చూసి మా అమ్మ నాకు ఫోన్ చేసింది. ‘నీవేమైనా సాయం చేయగలవా?’ అని అడిగింది. తప్పకుండా చేస్తానన్నాను. మా స్కూల్మేట్స్ వాట్సాప్ గ్రూప్లో విద్యార్థుల సమస్యను ఫార్వర్డ్ చేశాను. నలుగురు స్పందించారు.
ఆ స్కూల్ వాళ్లకు సమాచారం ఇచ్చాను. దీంతో ఆ క్లాస్ టీచర్ సంతోషంగా ‘మీకు నోట్బుక్స్ కావాలా? ప్లేట్స్ కావాలా?’ అని విద్యార్థులను అడిగిందట. పిల్లలంతా ‘మాకు నోట్బుక్సే కావాలి’ అని చెప్పారు. ఒకే పళ్లెంలో ఒకరి తర్వాత మరొకరు తినడానికి సిద్ధపడ్డారు కానీ, పుస్తకాల విషయంలో మాత్రం రాజీపడలేకపోయారు. ఆ సంఘటన తర్వాత, ‘వాళ్లకు కావాల్సిన ప్లేట్స్ కూడా ఇప్పిస్తావా?’ అని అమ్మ అడిగింది. సరే అన్నాను. స్నేహితుల సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాసిత్నగర్ పాఠశాల పిల్లలకు మా వంతు సాయం చేశాం. ఇదంతా ఎనిమిదేండ్ల నాటి మాట. అప్పటినుంచీ ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను.
స్వచ్ఛమైన సేవ..
అదే ఏడాదిలో ఓ అయిదు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం. స్కూళ్లకు రంగులు వేయించి, విద్యుత్ దీపాలు పెట్టించాం. ఆ ఫొటోల్లో పిల్లల ఆనందం చూసి ముచ్చటేసింది. ఇంకొన్ని పనులు చేస్తే బాగుంటుందని ఫ్రెండ్స్ ప్రోత్సహించారు. అప్పుడే ఒక ఎన్జీవో స్థాపించాలనే ఆలోచన వచ్చింది. మా స్వచ్ఛంద సంస్థకు ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) అని పేరు పెట్టుకున్నాం. పిల్లలకు నోట్బుక్స్, పళ్లాలు అందజేయడానికి వెళ్లినప్పుడు చాలా సమస్యలు తెలిశాయి.
ఎన్నో పాఠ శాలలు ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. కానీ, సిబ్బందిని నియమించే శక్తి మాకు లేదు. అందుకే, టెక్నాలజీ ద్వారా పాఠాలను బోధించేందుకు డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయించాం. అప్పటికే సిద్ధంగా ఉన్న వీడియో పాఠాలను సేకరించాం. బాసిత్నగర్ పాఠశాలలో మొదలైన ఆ ప్రయోగం 75 విద్యాసంస్థలకు విస్తరించింది. అక్కడ గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేశాం. అంతలోనే, చాలామంది అమ్మాయిలు హఠాత్తుగా బడి మానేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. పీరియడ్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక కొందరు, చుట్టుపక్కల భద్రతలేని వాతావరణం వల్ల మరికొందరు, బాల్య వివాహాలతో ఇంకొందరు చదువులకు దూరం అవుతున్నారని తెలిసింది. వాళ్లను బడికి రప్పించడం మా బాధ్యతగా భావించాం.
అవగాహనా సదస్సులు నిర్వహించి.. చదువు ప్రాధాన్యం, ఆరోగ్య జాగ్రత్తలు, ఆత్మరక్షణ మార్గాలను సూచించాం. దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే అమ్మాయిలు చీకటి పడకముందే ఇంటికి చేరేలా సైకిళ్లు కొనిచ్చాం. అమ్మానాన్న లేని పిల్లల సమస్యలూ మా దృష్టికి వచ్చాయి. వాళ్లకు ఎలాంటి సాయం కావాలో కనుక్కుని కావాల్సినవన్నీ సమకూర్చాం. ఈ ప్రయాణంలో సోషల్ మీడియా మాకు వెన్నెముకగా నిలిచింది. pureonline అనే ఫేస్బుక్ పేజీ ద్వారా ఎంతోమంది వలంటీర్లకు చేరువయ్యాం. ప్యూర్ సంస్థలో వెయ్యి మంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారిప్పుడు. ప్రవాస భారతీయులూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. మా లక్ష్యం ఒక్కటే. పేద పిల్లల కనీస అవసరాలు తీరాలి. ఎవరూ మామీద ఆధారపడకుండా ఉండే రోజొకటి రావాలి. అంతకు మించి ఎలాంటి ఆశలూ లేవు.
…? నాగవర్ధన్ రాయల