హైదరాబాద్ : తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్తో పాటు ఈ స్కాలర్షిప్ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్షిప్కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు ఎంపికవగా అందులో శ్వేతారెడ్డి ఒకరు. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం తెలిపింది.
ఈ స్కాలర్షిప్ సాధించడం పట్ల శ్వేత హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. తనకు ఇటువంటి అద్భుత అవకాశం రావడం వెనుకు డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. డెక్స్టెరిటీ టూ కాలేజ్ అనే కేరీర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో చేరిన శ్వేత నాలుగేళ్ల పాటు శిక్షణ పొందారు. ఈ క్రమంలో నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగానని ఆమె పేర్కొన్నారు. కేరీర్లో తనకు మార్గదర్శిగా నిలిచిన డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. శ్వేతకు స్కాలర్షిప్ రావడం పట్ల డెక్స్టెరిటీ సీఈఓ శరద్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు.