పెద్దపల్లి, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవసరమని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన పెద్దపల్లిలో 80, 90వ దశకం నాటి రోజుల్లో మావోయిస్టు పార్టీలో తనతో కలిసి పని చేసిన మిత్రులను కలిసి వారితో మాట్లాడారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పేరొన్నారు. నిరుద్యోగుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.