హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్టు అరుణ్సాగర్ పేరిట ఇచ్చే పురస్కారాలను ఈ సంవత్సరం ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందించనున్నట్టు అరుణ్సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10.30గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా అవార్డుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల సాంపాదకులు కే శ్రీనివాస్, వర్దెల్లి మురళి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.