నిన్న మొన్నటి వరకూ తొండలు గుడ్లు పెట్టిన పొలం. ఇప్పుడు హరితవనంగా మారింది. మామిడి, అరటి, కొబ్బరి వంటి 40 వేల చెట్లు అక్కడ పచ్చగా దర్శనం ఇస్తాయి. అంతేకాదు, వందలాది పక్షులకు ఆవాసంగా మారింది. పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు వాకింగ్ ట్రాక్, ఔట్డోర్ జిమ్ కూడా ఉన్నాయి. మనిషిని ప్రకృతికి అతి దగ్గరగా తీసుకెళ్తున్న ఆ సామాజిక అడవి పేరు.. ‘వనాంతర’.
తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని శూలార్జీ ప్రాంతం. కొన్నేండ్ల క్రితం ఇక్కడ వందల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. మితిమీరిన రసాయనాల వాడకం వల్ల నేలలో సారం తగ్గిపోయింది. విత్తు మొలకెత్తని పరిస్థితి ఏర్పడింది. ముక్కారు పంటలు పండిన పొలం పడావు పడిపోయింది. బంజరు నేలగా బిక్కుబిక్కుమన్నది. అలాంటి భూముల్లో ఇప్పుడు కనుచూపు మేరా పచ్చదనమే కనిపిస్తున్నది. దాదాపు 100 ఎకరాల బంజరు భూమిలో 250 విభిన్న జాతులకు చెందిన నలభైవేల చెట్లు కనిపిస్తున్నాయి. ఈ వృక్షాలను ఆశ్రయించి వందలాది పక్షులు, జంతువులు జీవిస్తున్నాయి. మొత్తంగా జీవ వైవిధ్యానికి నిలయంగా మారిందీ ప్రాంతం. ఇప్పుడిది రసాయనాల జాడలేని సారవంతమైన భూమి. ఈ హరితవనం పర్యావరణ సమతౌల్యానికి, సకాల వర్షాలకు కారణం అవుతున్నది.
40 మంది సహకారంతో
ఈ అడవేం సహజ సిద్ధంగా ఏర్పడలేదు. దీన్ని ఒక పర్యావరణ ప్రేమికుడు సృష్టించాడు. అతని పేరు వరుణ్ రవీంద్ర. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యం ఎలా విధ్వంసానికి గురవుతున్నదో గ్రహించాడు. ఈ సమస్యపై పోరాటం చేయాలని అనుకున్నాడు. తనవంతు కృషిగా 100 ఎకరాల బంజరు భూమిని పచ్చని వనంగా తీర్చిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టాడు. దానికి ‘వనాంతర’ అని పేరు పెట్టాడు. ఈ సామాజిక అడవిని జీవం ఇవ్వడం కోసం వరుణ్ నలభై మంది పర్యావరణ ప్రేమికులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు. పర్యావరణాన్ని ప్రేమిస్తే, ఇష్టంగా పనిచేస్తే ఐదేండ్లలో ఒక అందమైన అడవిని సృష్టించవచ్చని నిరూపించాడు.
సేంద్రియ పద్ధతిలో
2009లో వరుణ్ రవీంద్ర చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. ఖాళీ సమయంలో పేద విద్యార్థులకు గణితం చెప్పేవాడు. ఒక ఎన్జీవోతో కలిసి సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించేవాడు. అయినా, అసంతృప్తిగా అనిపించేది. ఉద్యోగం వదిలేసి పూర్తి సమయం పర్యావరణం కోసమే కేటాయించాలని నిర్ణయించుకొన్నాడు. సేంద్రియ వ్యవసాయంలో మెలకువలు తెలుసుకొనేందుకు వర్క్షాప్లకు వెళ్లాడు. రైతుల సాయంతో సేంద్రియ సాగు విధానాలను నేర్చుకున్నాడు. పర్యావరణ సంక్షోభానికి అడవులను సృష్టించడం ఒక్కటే పరిష్కారమని భావించాడు. కానీ, అతనికి అంత భూమి లేదు. కౌలుకు తీసుకున్నా నిరాశే ఎదురైంది. దాంతో ఒక ఎన్జీవో సహకారంతో 2016లో శూలార్జీలోని 100 ఎకరాల బంజరు భూమిని తీసుకున్నాడు. అదే నేటి ‘వనాంతర’.
చిన్నప్పుడే..
అది 1994వ సంవత్సరం. వ్యవసాయం కోసం వరుణ్ తండ్రి కొంత భూమిని కొన్నారు. ఆవులు, గుర్రాలను దత్తత తీసుకున్నారు. వరుణ్ ప్రకృతికి దగ్గరయ్యేందుకు అదో ప్రధాన కారణం. పెరిగేకొద్దీ జంతువులు, పక్షులు, పర్యావరణం పట్ల ప్రేమ పెంచుకున్నాడు ఆ యువకుడు. అప్పటికి తన వయసు పదేండ్లు. ఇంట్లో చికెన్ వండితే పెద్ద గొడవ చేసేవాడు. ‘జంతువులను, పక్షులను చంపడం నేరం’ అంటూ వాదించేవాడు. మొదట్లో అదంతా అమాయకత్వమని అనుకున్నారు. క్రమంగా ఆ తపనను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు, వరుణ్ రవీంద్ర వయసు 38 ఏండ్లు. అదే చిత్తశుద్ధి. అంతే పోరాట పటిమ. పర్యావరణ పరిరక్షణ కోసం స్నానపు సబ్బులను కూడా నిషేధించాడు. సహజమైన పద్ధతిలో స్నానం చేస్తున్నాడు. సబ్బుల్లోని రసాయనాలు పర్యావరణానికి హాని చేస్తాయని అతని అభిప్రాయం.