జరిగిన కథ : మధిర సుబ్బన్న దీక్షితులు కాశీమజిలీ కథలను..
మణిసిద్ధుడనే యతి, తన సహాయకుడైన గోపాలకుడికి చెప్పినట్లుగా రచించారు. ఒకచోట బంగారు ఎలుకను పూజించే వైశ్యుణ్ని చూశాడు గోపాలకుడు. ‘ఎలుకను పూజిస్తున్నావెందుకు?’ అని అడిగితే.. ‘ఇది మా వంశాచారం. ఎందుకు ఏర్పడిందో నాక్కూడా తెలియదు’ అని సమాధానం ఇచ్చాడా వర్తకుడు. మణిసిద్ధుడు తన వద్దనున్న మణి సహాయంతో ఆ కథను గోపాలకుడికి చెప్పాడు.
ఉజ్జయినిలో కుమారదత్తుడనే వైశ్యుడు న్యాయబద్ధమైన వాణిజ్యం చేస్తుండేవాడు. వివాహమైన చాలాకాలానికి అతని భార్య రమాదత్త గర్భవతి అయింది. కానీ, ఆమెకు ప్రసవం కాకముందే కుమారదత్తుడు కన్నుమూశాడు. జ్ఞాతులు అతని సంపదనంతా అపహరించారు. దారిద్య్రపీడను అనుభవిస్తున్నా.. తన కుమారుడికి ఏ లోపమూ రాకుండా పెంచుతున్నది రమాదత్త.
పిల్లవానికి మదనాంకుడని పేరుపెట్టి, వాణిజ్యానికి అవసరమైన చదువు చెప్పించ సాగింది. కాలగతిలో వానికి ఈడు వచ్చింది.
‘ఇంకా ఎన్నాళ్లు తల్లిని ఇబ్బంది పెడతావు? ఏదైనా వృత్తి చేసుకుని, జీవనం గడుపుకో’ అని తెలిసినవాళ్లంతా చెప్పసాగారు. కానీ, మదనాంకుడికి ఆ మాటలు చెవికి ఎక్కేవి కావు. ఆకతాయితనంతో ఊరంతా తిరిగేవాడు. యవ్వనవిలాసాలు అతని హృదయాన్ని ఆక్రమించాయి. అద్దంలో చూసుకుని, మీసాలు దువ్వుకుంటూ, కన్నులు చిట్లిస్తూ ఏకాంతంలో వెర్రివికారాలు పోతుండేవాడు.
ఒకనాడు మదనాంకుడు మహాకాళుని ఆలయానికి వెళ్లాడు. దేవతాదర్శనం కోసం వచ్చిన యువతుల సౌందర్యచాతుర్యాలను వర్ణిస్తూ చాలాసేపు అక్కడక్కడే తిరిగాడు. కొంతసేపటికి జనాలు పల్చబడ్డారు. ఇంకా అక్కడే ఉన్న మదనాంకుణ్ని.. ముఖమండపంలో ఒక సుందరమైన విద్యాధర కన్యక విగ్రహం ఆకర్షించింది. ఆ విగ్రహాన్ని తనివితీరా చూస్తూ, మోహావేశం పట్టలేక కౌగిలించుకున్నాడు.
యాదృచ్ఛికంగా అంతకుముందే రాగవతి అనే విద్యాధర కన్య ఒకామె ఆలయానికి వచ్చింది. స్వామిని అర్చించిన అనంతరం మంటపంలో విగ్రహాన్ని చూసి, తన విద్యామహిమ చేత ఆ విగ్రహాన్ని ఆవేశించి, దానిలో విశ్రాంతి తీసుకోసాగింది.
మదనాంకుడు ఆ విగ్రహాన్ని కౌగిలించి, ముద్దుపెట్టుకోబోతుండగా.. దానిలో ఆవేశించి ఉన్న రాగవతి.. రత్నకంకణాలతో అలంకరించి ఉన్న తన చేతిని బయటికి తీసి అతని బుగ్గ గిల్లింది.
మదనాంకుడు చటుక్కున ఆ చెయ్యి పట్టుకున్నాడు.
అప్పుడు రాగవతి అతనికి కనిపించకుండానే..
“మహాభాగా! నేను అపరాధిని. నా తప్పు క్షమించు. నా చేయి విడిచిపెట్టు” అన్నది.
“నువ్వెవరో కనిపించకుండానే మాట్లాడుతున్నావు. కనిపిస్తేనే కదా.. క్షమించడం” అని పలికాడు
మదనాంకుడు.
అప్పుడు రాగవతి తన యదార్థరూపంతో అతనికి దర్శనమిచ్చింది. ఆమె భూషణాల కాంతులు కన్నులకు మిరుమిట్లు గొలుపుతుండగా.. ఆమె సౌందర్యాతిశయాన్ని చూసి విభ్రాంతుడయ్యాడు మదనాంకుడు.
అప్పుడామె..
“సుందరుడా! నేను విద్యాపరుడనే విద్యాధర చక్రవర్తి కూతురిని. నాపేరు రాగవతి. హిమాలయాలకు సమీపంలోని పుష్కరావతి మా నగరం. ఈ విగ్రహంలో మా కులానికి చెందిన కన్యకారూపం ఉండటం చూసి, అదృశ్యరూపంగా ఇందులో విశ్రాంతి తీసుకుంటున్నాను. అంతలో నువ్వు వచ్చావు. కేవలం ఒక విగ్రహాన్ని చూసి నువ్వు మోహించగా లేనిది.. మదనుని మోహనాస్త్రంలా కనిపిస్తున్న నిన్ను నేను మోహించడం అబ్బురమా?! ఇది నేను చేసిన పని కాదు. ఆ విగ్రహంపై నువ్వు చూపిన అనురాగానికి మారుగా.. నేను దాని పక్షం వహించి, నీ చెక్కులు మీటాను. అంతే! ఇక సెలవిప్పిస్తే వెళ్లిపోతాను” అన్నది.
“రాగా! నా హృదయం లాక్కుని వెళ్లిపోతాననడం న్యాయమేనా?! నన్ను కామాగ్ని పాలుచేసి పోతావా?! పాణిగ్రహణం చేసిన తరువాత పతిని సతి విడిచిపోవడం తగదు కదా!”.. దీనంగా ప్రశ్నించాడు మదనాంకుడు.
“సుందరుడా! నా హృదయం నీయందు తగులుకున్నది. కాకపోతే నేనలా చేస్తానా? కానీ, మేమెన్ని దేశాలు తిరిగినా.. రాత్రికి ఇల్లు చేరుకోవాలి. లేదంటే మా నాన్న దండించగలడు. అందువల్ల నేనిక్కడ ఎల్లకాలమూ ఉండలేను. నువ్వు నాయందు బద్ధానురాగుడవైతే మా ఊరికి వచ్చి కలుసుకో. అక్కడే నీ కోరిక తీరగలదు” అని చెప్పింది రాగవతి.
అందుకు మదనాంకుడు నిరాశతో..
“తరుణీ! వట్టి ఆశ పెట్టిపోతావెందుకు? మీ నగరం ఎక్కడ ఉన్నదో నేనెరగను. ఇష్టముంటే నన్ను వెంటపెట్టుకుని పోరాదా?!” అని అడిగాడు.
“మనోహరా! నేనిప్పుడు నిన్ను నాతో తీసుకుపోలేను. దారిలో కొందరు విద్యాధరలు నాతో కలిసివస్తారు. వారి కంటపడితే ప్రమాదం రాగలదు” అని బదులిచ్చింది రాగవతి.
“అయ్యయ్యో! నేను ఒంటరిగా మీ లోకానికి రాగలనా?! నువ్వేదో గుర్తులు చెప్పినా మీ లోకం నా కంటపడదు కదా! నీ దర్శనం నా మరణానికే వచ్చినట్లుంది” అని బేలతనాన్ని ప్రదర్శించాడు మదనాంకుడు.
రాగవతి అతణ్ని ఓదారుస్తూ..
“కార్యసాధకులకు అసాధ్యమంటూ లేదు” అని చెప్పి, అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
ఆమె వెళ్లిన దిక్కునే చూస్తూ, అంతకంతకూ విరహవేదన భరించరానిది అవుతుండగా ఎలాగో ఇల్లు చేరుకున్నాడు మదనాంకుడు. తల్లి అన్నం తినమని ఎంత బతిమాలినా వద్దన్నాడు. ఎంతసేపూ..
“ఎక్కడి ఉజ్జయిని? ఎక్కడి పుష్కరావతి?! అయ్యయ్యో.. అక్కడికి నేనెలా పోగలను?!” అంటూ పలవరించసాగాడు.
అతని పలవరింతలు చూసి, దయ్యం సోకిందని భావించిన తల్లి దిష్టి తీసిపారేసింది.
ఆ మరునాడు ఎలాగో అతికష్టంమీద భోజనం ముగించి, ఎవరికీ చెప్పకుండా హిమాలయాల దిక్కుకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. ‘అదృష్టముంటే రాగవతిని కలుసుకుంటాను. లేకుంటే దారిలోనే మరణిస్తాను. ఇంటిలో ఉంటే మాత్రం ఈ ఒంటిలో పుట్టే కాకలు నన్ను పట్టిపరిమార్చేలా ఉన్నాయి’ అనుకుంటూ నడక సాగించాడు.
దారిలో అతనికి దేశాటనం చేస్తున్న మరో ముగ్గురు యువకులు తోడయ్యారు. నలుగురూ కలిసి వినోదాలు మాట్లాడుకుంటూ కొన్నిరోజులు ప్రయాణం చేశారు. ఒకనాడు వారు తురకలు పాలించే ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడ బస దొరుకుతుందేమోనని విచారిస్తుండగా, అధికారులు చుట్టుముట్టారు.
“హిందువులు ఈ పట్టణంలో ప్రవేశిస్తే సుంకం కట్టాలి. సొమ్ము బయటికి తీయండి” అన్నారు.
అందుకు వారు..
“అయ్యో! బళ్లకు, గుర్రాలకు సుంకం కానీ, మనుషులకు సుంకం ఏమిటి? ఇదెక్కడైనా ఉందా? అయినా ఇవ్వడానికి మావద్ద ఏమీ లేదు” అని దీనంగా పలికారు.
వారిమాటలు ఆలకించిన అధికారులు పెడరెక్కలు విరిచికట్టి దండనాథుని ముందు నిలబెట్టారు. అతను విచారణ చేయకుండానే..
“వీళ్లను ఖైదులో తోయించండి” అని ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు.
తురకలు వాళ్లను చెరలో తోసి, పాదాలకు గొలుసులు వేశారు. ఆ ప్రదేశం ఒకప్పుడు సిద్ధక్షేత్రం. ఆపదలను పోగొట్టే దుర్గాదేవి ఆలయం ఒకటి అక్కడే ఉండేది. చెరలో పడ్డ తరువాత మదనాంకుడు తమకు వచ్చిన ఆపదను గట్టెక్కించమని దుర్గాదేవినే యాదృచ్ఛికంగా మనసులో వేడుకున్నాడు. ఆ స్థల మహత్యమేమిటో కానీ దేవి వెనువెంటనే కరుణించింది. ఆవిడ మహిమతో సంకెళ్లు విడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి.
నలుగురూ చెరసాలనుంచి బయటపడి, ఆ పట్టణం దాటిపోయారు. తెల్లవారేదాకా ఆగకుండా పరుగెత్తి పోయారు. అప్పుడు మదనాంకునితో పాటు వచ్చిన వారు..
“మిత్రుడా! ఇటుపైన ఉత్తరదేశమంతా తురుష్కుల పాలైంది. వారికి దయ, సత్యం, శౌచాలు లేవు. మేం ఇదివరకు మూడుదిక్కులు తిరిగి చూశాం. కానీ, ఇంతటి చిక్కులు ఎన్నడూ పడలేదు. గొప్పగండం గడిచింది. రాత్రి మనం తప్పించుకోలేకపోతే ఈపాటికి ఉరితీసి ఉండేవాళ్లు. ఇంక చాలు. మేమీ దిక్కులో యాత్రలు మానేసి ఇళ్లకు పోతాం. నువ్వు కూడా మాతో రా” అన్నారు.
దానికి మదనాంకుడు..
“నేను తప్పనిసరిగా హిమాలయాలకు వెళ్లాలి. భగవంతుడే నాకు తోడు రాగలడు. మీరు క్షేమంగా వెళ్లిరండి” అన్నాడు.
ఒంటరిగా ముందుకు కొనసాగాడు.
మరికొన్నిరోజుల ఒంటరి ప్రయాణం తరువాత మదనాంకునికి నలుగురు బైరాగులు కనిపించారు. మాటలమధ్యలో వారు కూడా హిమాలయాలకే పోతున్నారని తెలిసింది.
“మంచి సహవాసం లభించింది. నన్ను కూడా మీతోపాటు తీసుకుపోండి” అని మదనాంకుడు వారిని కోరాడు.
వారు సమ్మతించడంతో కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. దారిలో అనేక నదీనదాలను, పర్వతాలను, మహారణ్యాలను దాటుకుంటూ వెళ్తున్నారు. ఒకనాటి సాయంకాలానికి వితస్తానది కనిపించింది. దానిని తెప్పలతో దాటి అవతలి ఒడ్డుకు చేరేసరికి సూర్యాస్తమయం కావచ్చింది.
ఇంతలో వారికి కొందరు కట్టెమోపులతోఎదురుపడ్డారు.
“అయ్యా! చీకటి పడుతున్నది. మీరిటు ఎక్కడికి పోతున్నారు? ఈ పైన ఊళ్లేమీ లేవు. అంతా మహారణ్యమే! కొంతదూరంలో ఒక శూన్యాలయం మాత్రం ఉంది. రాత్రిపూట ఆలయంలో ఉన్నవారిని యక్షిణి వచ్చి తినేస్తుంది. వెనక్కుపోండి” అని హెచ్చరించారు.
కానీ బైరాగులు ఒప్పుకోకుండా..
“మేము నిత్యం శ్మశానాల్లోనే గడుపుతుంటాం. భూత బేతాళాలు మమ్మల్ని చూస్తే పారిపోతాయి. మాకేమీ భయం లేదు” అన్నారు.
“సరే.. మేము చెప్పవలసింది చెప్పాం. తరువాత మీకర్మ” అంటూ వాళ్లు తమదారిన పోయారు.
మదనాంకుడు భయపడుతూ..
“స్వాములూ! వెనక్కుపోదామా?” అన్నాడు.
బైరాగులు అతనికి ధైర్యం చెబుతూ..
“ఆ యక్షిణిని ఎలా పరాభవిస్తామో నువ్వే
చూద్దువుగాని రా” అని పలుకుతూ శూన్యాలయానికి తీసుకుపోయారు.
అక్కడ మానవుల ఎముకలు గుట్టలుగా పోగుబడి ఉన్నాయి. బైరాగులు ఒకచోట శుభ్రం చేసి, విభూతితో ముగ్గు వేశారు. కుండం తవ్వి, నిప్పు రాజేశారు.
రక్షామంత్రాలు పఠిస్తూ దానిచుట్టూ కూర్చున్నారు.
అర్ధరాత్రి అయ్యింది.
మానవ కంకాళాలతో తయారుచేసిన కిన్నరవాయిద్యాన్ని చేత పట్టుకుని వాయిస్తూ.. శృంగోత్పాదిని అనే యక్షకాంత ఆకాశం నుంచి అక్కడికి వచ్చింది. బైరాగులతో కలిసి నాట్యం చేయసాగింది. మధ్యమధ్యలో ‘హుంపటు స్వాహ శృంగావుత్పాదయతాం’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఒక బైరాగిని తీక్షణంగా చూసింది.
వెంటనే ఆ బైరాగికి నెత్తిపై కొమ్ములు మొలుచుకుని వచ్చాయి. అతను నృత్యంచేస్తూ వెళ్లి, నిప్పుల్లో నిలబడ్డాడు. సగం కాలిన అతని శవాన్ని ఆ యక్షిణి శుభ్రంగా తినేసింది. తరువాత మరో బైరాగిపై కూడా తన మంత్రాన్ని ప్రయోగించింది. అతనికి కూడా నెత్తిన కొమ్ములు మొలిచి, నిప్పుల్లో పడ్డాడు. యక్షిణి అతణ్నీ భక్షించింది.
ఆ ఘోరహత్యలు చూసి, మదనాంకుడు బెదిరిపోయాడు.
‘అనవసరంగా వీళ్ల మాటలు విని వచ్చాను. ఈ యక్షిణి నన్ను కూడా భక్షిస్తుంది కాబోలు. నాకు చావు తప్పేదెలా?’ అని మధన పడసాగాడు.
ఈలోపుగా శృంగోత్పాదిని వరుసగా ముగ్గురినీ తినేసింది. మత్తులో ఊరికే నాట్యం చేయసాగింది. ఆ మత్తులో ఆమె చేతిలోని కంకాళ కిన్నరవాద్యం నేలకు జారింది. తటాలున మదనాంకుడు ఆ కిన్నరను చేతిలోకి తీసుకున్నాడు. దానిని వాయిస్తూ, యక్షిణి మంత్రాన్ని పఠించాడు. నాట్యం చేస్తూ తన చూపులు ఆ యక్షిణిపై వ్యాపింప చేశాడు.
అంతలో యక్షిణికి కొమ్ములు మొలుచుకువచ్చాయి. అప్పటికి దానికి ఒళ్లు తెలిసింది. ప్రాణభయంతో కొట్టుకుపోతూ..
“మహాసత్వా! నీ సాహసం అత్యాశ్చర్యకరమైనది. ఆ మంత్రపఠనం మానెయ్యి. లేకపోతే నేను చచ్చిపోగలను. ఆడదాన్ని.. నిన్ను శరణుజొచ్చాను. రక్షించు” అని వేడుకుంది.
“ద్రోహురాలా! ఇతరులను వడియాలలా నమిలివేశావు కదా!? నీ చావుకింత భయమెందుకు?! నీకున్న భయం ఇతరులకు మాత్రం ఎందుకుండదు?! భూతదయ లేకుండా ఎన్ని హింసలు చేశావో.. నిన్ను చంపితే నాకు పుణ్యమే కానీ పాపము లేదు. నిన్ను చంపి లోకోపకారం చేస్తాను” అని పలికాడు మదనాంకుడు.
అతణ్ని చూసి మరింత హడిలిపోతూ..
“మహాసత్వా! నన్ను చంపకపోతే నీకొక ఉపకారం చేసిపెడతాను. నువ్వు రాగవతిని కలుసుకోవడానికి వెళ్తున్నావు కదా! కాలినడకన ఎన్నిరోజులు ప్రయాణించగలవు?! నేనైతే నిన్నొక్క రాత్రిలోనే అక్కడికి చేరుస్తాను. దయచేసి నన్ను వదలిపెట్టు” అని ప్రాధేయపడింది.
దాంతో మదనాంకుడు.. ‘ఇకపై ఎవరినీ మోసం చేయను’ అని ఆ యక్షిణి చేత మాట తీసుకుని, మంత్రపఠనాన్ని విరమించాడు. వెంటనే శృంగోత్పాదిని అతణ్ని తన భుజంపై ఎక్కించుకుని, ఉత్తరదిక్కుగా
తీసుకుపోయింది.
హిమాలయ ప్రాంతానికి చేరుకునేసరికి
సూర్యోదయమైంది.
“మహాభాగా! మాకు రాత్రిపూట కానీ, ఆకాశసంచార సామర్థ్యముండదు. నువ్వు ఇక్కడే సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకో. చీకటిపడగానే వచ్చి, పుష్కరావతికి తీసుకుపోతాను” అన్నది యక్షిణి.
(వచ్చేవారం.. కోతిగా మారిన మానవుడు)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ