జరిగిన కథ : తమిళజం పాలకుడు చోళరాజు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి తెలిసింది. దాంతో ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట్టింది. అంతకుముందే జాయప నేతృత్వంలో ద్వీప సైన్యపటాలం.. కాంచీపురం మీద దాడిచేసింది. కులోత్తుంగ చోళుడు.. చిత్తుచిత్తయిపోయి, ఓటమిని అంగీకరించాడు. ఇక్కడ నెల్లూరులో నల్లసిద్ధి తలతో కాకతీయ వీరుల కందుక్ర కీడ సాగింది. విజయ సింహనాదం చేసిన గణపతిదేవుడు.. నెల్లూరులో మహారాజుగా మనుమసిద్ధిని తిరిగి గద్దెనెక్కించాడు.
ఇద్దరు భార్యలతో సాంసారిక జీవితాన్ని అత్తవారింట ఉండి అనుభవిస్తున్న గణపతిదేవుడు.. మధ్యాంధ్ర ప్రాంతంలోని సామంతుల మధ్య సయోధ్యకు ఈ కాలాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నాడు. ఆ సమయంలోనే సామంత రాజ్యాలపైనా, యువ యోధులపైనా దృష్టి కేంద్రీకరించాడు. ఈ ఆలోచనకు మూలం జాయపుడు. అతని వీరోచిత పోరాటాలు, యుద్ధ మంత్రాంగాలు స్వయంగా చూసి ప్రభావితుడైన చక్రవర్తి.. అలాంటి మరికొందరిని ఎంపిక చెయ్యాలని వాంఛిస్తున్నాడు. అలాంటివారిలో గణపతిదేవుని దృష్టిని ఆకర్షించినవాడు ఏరువనాడుకు చెందిన ఏరువ భీముడు!
అప్పుడే అనుమకొండ నుంచి వార్తాహరుడు తెచ్చిన వార్త చదివి.. గణపతిదేవుడు ఆందోళన చెందాడు.
సకల సేనాధిపతి రుద్రదేవుడు తీవ్ర అస్వస్తతకు
గురయ్యారన్నది ఆ వార్త. వెంటనే నారయ నాయకుడు పల్లకి ఏర్పాటు చేయగా.. ధనుర్ధారులైన లెంకల మధ్య బలిష్ఠులైన బోయలతో పల్లకి సిద్ధమైంది. అధిరోహించబోతున్న బావగారిని ఆగమని పరుగు పరుగున వచ్చి.. చెవిలో శుభవార్త చెప్పాడు జాయపుడు.
నారాంబ తల్లి కాబోతున్నదన్నది ఆ శుభవార్త.
తన్మయుడైన గణపతిదేవుడు..
‘శుభవార్త! నిజంగా శుభవార్త విన్నాం. ఇది రుద్రదేవులకు కూడా శుభవార్త. అక్కడేం చెడువార్త వినిపించదు. శుభం భూయాత్..’ అనుకుంటూ పల్లకి అధిరోహించాడు.
ఊహించినట్లే అనుమకొండలో రుద్రసేనానికి ప్రాణాపాయం తప్పింది. గుండె సంబంధిత వ్యాధిగా వైద్యులు చెప్పి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. గణపతి తిరిగి ద్వీపకోటకు వచ్చేసరికి మరో శుభవార్త అందించాడు జాయప. పేరాంబ కూడా
తల్లి కాబోతున్నది. ఆయన పులకించాడు.
అనుమకొండ నుంచి వస్తూ మరో యువనాయకుణ్ని ద్వీపానికి తీసుకువచ్చాడు గణపతి.
“ఇతను రాజనాయకుడు. రేచర్ల రుద్రయగారి మేనల్లుడు. మంచి యోధుడు!”.
జాయపుడు, ఏరువ భీముడు, రాజనాయకుడు.. రాజత్రయం. త్రిసముద్ర సంయుక్తంలా.. కాకతీయ సామ్రాజ్యపు భవిష్యత్తులా ఉన్నారు.
“మనం దక్షిణాదిన కంచి వరకు ఉన్న పరిస్థితులను, సంస్కృతిని చూశాం. రాజ్యాధినేతల ప్రతాప విక్రమాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మీరు మన ఈశాన్య తెలుగుప్రాంతాల ప్రజలు, భాషలు, సంస్కృతిని పరిశీలించండి. కళింగం వరకు ఉన్న చిన్నచిన్న రాజ్యాలను ఏకం చేసి, మంచి పాలకులను ప్రోత్సహించి ఆంధ్ర సామ్రాజ్యానికి ఎల్లలు నిర్ణయించండి!”.. మార్గదర్శనం చేశాడు గణపతిదేవుడు.
ముగ్గురికీ ఈ మార్గం కొత్తే! సరసిపురం నుంచే తెలుగుభాష కొత్త యాసతో వింతగా ఉంది. అయితే సరసిపురం, వేంగి.. గోదావరి నది పరివేష్టిత రాజ్యాలు కావడంతో పూర్తి నీటి వసతులతో బంగారు పంటలతో.. ద్వీపం కన్నా మరింత పచ్చగా, కంటికి ఇంపుగా ఉన్నాయి. ప్రజలు కూడా పనీపాటలతో తీరిక లేకుండా ఉన్నారు.
అలాంటి వాటిలో కొలనిపురి, వేంగి విషయ, ఏడు మాడెములు, పన్నెండు మన్యప్రాంతాలు, కిమిడి విషయలోని ఉదయగిరికోట.. ఆపై కళింగ రాజ్యం ముఖ్యమైనవిగా గుర్తించారు రాజత్రయం.
ఈ రాజ్యాల రాజులు ఎవరో రాజత్రయానికి తెలియదు. వారు ఆయా రాజ్యాల ప్రజల్లో తిరిగారు. వారి అభిప్రాయాలు విన్నారు. పాలకుల ఆగడాలు తెలుసుకున్నారు. భరించలేని క్రోధావేశాలతో దాడిచేశారు. చిన్నచిన్న రాజ్యాలను ఏకంచేశారు. కొన్నిచోట్ల మంచి రాజులను ఎంపికచేసి పట్టాభిషిక్తులను చేశారు. కొన్నిటిని పక్క రాజ్యాలలో కలిపారు.
దాదాపు రెండేళ్లకాలం ఉత్తరాంధ్రంలో యుద్ధక్షేత్రంలో పోరాడి, ఓడ్రదేశంలోని బొక్కర రాజ్యం, బస్తరు ప్రాంతంలో చిన్నరాజ్యం చక్రకోట్యం, మాల్యవంత పర్వతప్రాంతాల వరకూ విజయబావుటా ఎగురవేసి.. తగిన అనుభవాలతో విజయాట్టహాసాలతో తలగడదీవి చేరారు రాజత్రయం.
గణపతిదేవుడు, పినచోడుడు స్వాగతం చెప్పారు. కానీ, వారి ముఖాలలో విజయగర్వం లేదు. యువ రాజత్రయం చెప్పింది సాధించారన్న ఆనందం లేదు.
అక్క.. ఈ ఇంటికోడలు. హక్కుదారు. కాబట్టి ఇక్కడే ఆమె జీవితం గడుస్తుంది. మరి తన జీవితం ఏమిటి? అప్పట్లో తను సాధారణ సమాజంలో బాలుడు. ఇప్పుడు రాజనగరి వ్యక్తిగా జీవించాలట. వీధులలో తిరగడం అలవాటైన తను.. ఇక్కడ ఉండగలడా? ఉండాలి.. ఎన్నో ఏళ్లు అక్కలకు దూరమై, వాళ్లకోసం పరితపించిన తను అక్కతో ఉండాలి.. ఉండితీరాలి.
కారణం.. ఆ ఇంట సంభవించిన విషాదాలు.
నారాంబ, పేరాంబ కూడా మగబిడ్డలనే ప్రసవించారు.. ఓ మాసం అటూ ఇటుగా! కానీ, ప్రసవించిన వెంటనే కమ్మిన ధనుర్వాతంతో పేరాంబ శివసాయుజ్యం పొందింది.
ఇద్దరూ తన బిడ్డలుగానే ఎత్తుకుని కనిపించింది గణపతిదేవుని పక్కన.. ఒంటరైన నారాంబ.
ఓ అక్క మరణవార్త విని హతాశుడయ్యాడు జాయపుడు. అప్పుడే మరో విషాదవార్త. తల్లి దాయాంబ కూడా కూతురి మరణవార్త విని గుండె ఆగి మరణించింది. కుప్పకూలిపోయాడు జాయపుడు.
‘శివా.. ఎంత అన్యాయం చేశావయ్యా!?’..
ఇద్దరు మేనల్లుళ్లను చూస్తూ సముద్రమంత విషాదాన్ని గుండెల్లో దాచుకోక తప్పలేదు జాయపునికి.
గణపతిదేవుడు, జాయపుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇక ద్వీపంలో ఉండలేకపోయాడు గణపతి
దేవుడు. అనుమకొండకు తిరిగి పయనమయ్యాడు.
జాయపుడు కూడా కొంతకాలం అనుమకొండలో ఉండి వస్తానని తండ్రికి మాట ఇచ్చి, చక్రవర్తి వెంట ఆయన పటాలంతో కలిసి పల్లకి అధిరోహించాడు.
అనుమకొండ రాగానే ఉదయపు సభ కొలువుతీర్చి భార్యను, బిడ్డలను పరిచయం చేసి.. జాయపునికి సేనాని హోదా ఇచ్చి, కొలువులో ఉన్నతాసనం కల్పించాడు గణపతిదేవుడు.
కాకతీయకోట అనే బృహత్తర ప్రదేశంలో ప్రధానమైనవి మూడు కట్టడాలు. ముఖభాగంలో సగర్వంగా, సమున్నతంగా భాసించేది రాజ సంస్థానం. మహాసామ్రాజ్యపు అధికారిక కార్యకలాపాల నిర్వహణా కేంద్రం. వేర్వేరు అధికారిక నియోగ భవన సముదాయం.
రెండవది రాజప్రాసాదం. మహారాజుగారి అధికారిక నివాస భవనం. మూడవది రాజనగరి. రాజవంశీకుల నివాస భవన సముదాయ ప్రదేశం.
మహారాజుగారి నివాస భవనంలో భాగమే అంతఃపురం.
గణపతిదేవుడు నారాంబతో రాజనగరికి ప్రవేశించకముందే.. అంతఃపురాన్ని రెండుభాగాలు చేసి, ఇద్దరు భార్యలకు వేర్వేరు అంతఃపురాలు.. వాటికి వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేయించాడు.
జాయపునికి కూడా రాజనగరిలో రాజబంధువుల నివాసాల వద్ద ప్రత్యేక భవంతిని ఏర్పాటు చేయిస్తా
నన్నాడు గణపతిదేవుడు.
అక్క, తమ్ముడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
“వాడు నా మందిరంలోనే ఎల్లప్పుడూ నా కళ్లముందే ఉండాలి. వాడికి ఇక్కడ అంతఃపురంలోనే ప్రత్యేకగదిని కేటాయించండి చాలు!”.. తెగేసి చెప్పింది నారాంబ.
“అక్క చెప్పిందే వేదం కదా బావగారు..” అన్నాడు తమ్ములుంగారు.
“భార్యామణి చెప్పిందే నాకూ వేదం కదా..” అంటూ రాజప్రాసాదంలోనే జాయపునికి కేవలం రాత్రి పడక నిమిత్తం ఓ మందిరాన్ని ఏర్పాటుచేశాడు గణపతి. అది ఆయన పక్కగది.
జాయపుడు ఎదురు మాట్లాడలేదు. నారాంబ పులకించి పోయింది.
రాజనగరి పూర్తిస్థాయి నగరం. నివాస భవనాల ముందూ వెనకా పరిచారికల, రక్షణభటుల, గూఢచారుల నివాసాలు తదితరాలు ఉంటాయి. వీటిమధ్య దేవాలయాలు, ఉద్యానవనాలు, సరస్సులు, వ్యాయామశాల, సమావేశ మందిరం, రవాణా జంతువుల కోష్టాగారాలు.. రథాలుండే చావడులు.. తదితరాలు కూడా లోపలే ఉంటాయి. ఇవన్నీ కేవలం మహారాజుగారితోపాటు లోపలి నివాసుల కోసమే నిర్మితమయ్యాయి.
మొదటిరోజు రాజనగరి అంతా కలియ తిరిగాడు జాయపుడు.
తను ప్రథమంగా రాజప్రాసాదంలో అడుగిడిన చోటు నాట్యమందిరం. తొలిగా అక్కడికి వెళ్లాడు ఆనందంగా. గణపతిదేవుడు లేకపోవడంతో కార్యక్రమాల సందడి లేక ప్రశాంతంగా, గంభీరంగా ఉంది రంగ మండపం. కాలుపెట్టబోతూ సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు. లోపలికి వెళ్లాడు. రంగస్థలం పైకి ఎక్కాడు. యవనిక మౌనంగా కదలాడుతున్నది.
పనిలేని నాట్యకారునిలా..
ఎక్కడో లీలగా మృదంగధ్వని.. నట్టువాంగ గజ్జెల సవ్వడి.. ప్రాంగణంలోనా.. మనసులోనా!?
స్పందనతో శరీరమంతా గగుర్పాటుకు గురయ్యింది.
తొలి ప్రదర్శన వేళ తన స్పందన గుర్తొచ్చింది. ద్వంద్వ ధోరణి.. అటు అక్కలకు దగ్గరగా ఉన్నట్లు భావన. ఇటు అక్కలు కనిపిస్తారో లేదో తెలియని ఉత్సుకత. నీలాంబను అడగలేడు. తన భావనలు మాటల్లో పెట్టలేని కౌమారత్వంవల్ల లోలోన పడిన తపన. మొత్తం నాట్యోత్సవాల అన్నిరోజులూ ఇదే సంఘర్షణ.
అర్థంకాని ఆవేశం.. అర్థమే లేని దుఃఖం. అన్నీ
గుర్తొచ్చాయి.
గణపతిదేవునిపై ఓ చూపు.. పాత్రధారణపై మరో చూపు.. అతలాకుతలం అయ్యేవాడు. గుండెలు మండిపోతున్నా ఏడవడానికి లేదు. తోటినటులంతా కబుర్లతో కేరింతలు కొడుతుంటే.. తను మౌనంగా లోలోన
ఏడవడం. ఓహ్!
కానీ, సూక్ష్మగ్రాహి గణపతిదేవుడు తనను.. తనలోని ప్రతిభను సరిగానే గుర్తించాడు.
నాట్యమండపం వద్దకు వెళ్లాడు. ఓ గొప్ప నాట్యకారుడు.. ఓ భరతముని.. ఓ నటరాజు.. మౌనంగా
గంభీరంగా ప్రసన్నంగా చూస్తున్నట్లు..
‘ఎలా ఉన్నావోయ్!?’ అని పలకరిస్తున్నట్లు..
మత్తవారిణులపై చతికిల బడ్డాడు. పక్కగా గాలికి ఊగిసలాడుతున్న గడ్డిపువ్వు..
‘నీ నాట్యం గుర్తుంది నాకు’.. అన్నట్లు అభినందనగా నాట్యమాడుతున్నది.
దానిని ఆత్మీయంగా.. సున్నితంగా ముట్టుకున్నాడు. పసిబిడ్డ బుగ్గలు నిమిరినట్లు..
‘ఇక్కడే ఉంటావుగా!?..’ ఎవరో అన్నట్లు.. గాలి అడుగుతున్నది. ఆ భవనాలు అడుగుతున్నాయి. ఆ సైనికులు, భటులు, పరిచారికలు అందరూ అటూ ఇటూ తిరుగుతున్నవారంతా.. అడుగుతున్నారు అన్నట్లు గాలి రివ్వు రివ్వున చుట్టూ గింగరాలు తిరుగుతున్నది.
లేచాడు. అందరూ తమతమ పనుల్లో చురుగ్గా తిరుగుతున్న ఉద్యోగులు.. జాయపుణ్ని చూస్తూ మందస్మితంగా పలకరింపుగా, గౌరవంగా కదులుతున్నారు.
అప్పుడు వాళ్లను చూసి ఎంతో భయపడటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. అలా ఆ రోజంతా రాజప్రాసాదంలోని అన్ని ప్రాంగణాలను.. అన్ని భవనాలను.. పోతూ వస్తూ ఆత్మీయంగా చూస్తూ తిరుగాడాడు.
“నిన్ను కాకతీయ సేనానిగా నిర్ణయించి ప్రకటించింది.. తమరు ఓరుగల్లులోనే ఉండాలని. తిరిగి ద్వీపరాజ్యానికి వెళ్లాలన్న ఆలోచనలు పెట్టుకోకు. అవసరమైనప్పుడు మేమే పంపిస్తాం..” బావగారి నిర్ణయ ప్రకటన.
ఇకపై అక్క, తను ఇక్కడే ఉండబోతున్నారు.
అక్క.. ఈ ఇంటికోడలు. హక్కుదారు. కాబట్టి ఇక్కడే ఆమె జీవితం గడుస్తుంది. మరి తన జీవితం ఏమిటి?
అప్పట్లో తను సాధారణ సమాజంలో బాలుడు. ఇప్పుడు రాజనగరి వ్యక్తిగా జీవించాలట. వీధులలో తిరగడం అలవాటైన తను.. ఇక్కడ ఉండగలడా?
ఉండాలి.. ఎన్నో ఏళ్లు అక్కలకు దూరమై, వాళ్లకోసం పరితపించిన తను అక్కతో ఉండాలి.. ఉండితీరాలి.
అక్క నారాంబ, పిల్లలు బావగారితో సంతోషంగా ఉండటం జాయపునికి ఎంతో తృప్తిని కలిగించింది.
‘ఇంతకంటే మరేం కావాలి!?’..
గణపతి, నారాంబ జంటను ఎంతో అపురూపంగా.. రెప్ప వెయ్యకుండా చూసుకుంటాడు జాయపుడు.
తన ఏడేళ్ల పోరాటం.. అందుకోసమే కదా!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284