చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
యుద్ధభూమిలో చొచ్చుకుపోతున్నాడు జాయప. పృథ్వీశ్వరుణ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశాడు.
ఒకానొక దుర్ముహూర్తాన యుద్ధరంగంలో గణపతిదేవుడు – పృథ్వీశ్వరుడు ఎదురుపడ్డారు. ఇద్దరూ విల్లు ఎక్కుపెట్టి బాణాలు విసురుకుంటున్నారు. అప్పటికే 70 ఏనుగులతో పది గజబృందాలను సిద్ధంచేసి ఉంచాడు జాయప. ముందుగా రూపొందించిన వ్యూహంలో భాగంగా.. జాయప కొమ్ముబూరను ఉధృతంగా మోగించాడు. అంతే.. ఆ ఏనుగులు ఒక్కసారిగా పెద్దపెట్టున ఘీంకారం చేశాయి. యుద్ధ క్షేత్రమంతా దద్దరిల్లింది.
డెబ్భై ఏనుగులు అలా నిర్విరామంగా చెవులు చిల్లులు పడేలా ఘీంకరిస్తుండటంతో.. శత్రుసేనలే కాదు, కాకతీయ సేనలు.. సేనానులు కూడా భయంతో వణికిపోతున్నారు. అంతటి భీకర యుద్ధభూమిలో కూడా జాయప ఓ కంట గణపతి
దేవుణ్ని, పినచోడుణ్ని కనిపెడుతూనే ఉన్నాడు.
హఠాత్తుగా శత్రు సర్వసైన్యాధ్యక్షుడు సర్వేశ్వరసేనాని పినచోడుని పైకి లంఘించడం చూసిన జాయప పెద్దగా అరిచాడు..
“కంటకా.. నాతండ్రి!”..
మరి కంటక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అతడు విసిరిన బల్లెం ధాటికి శత్రు సర్వసైన్యాధ్యక్షుడి తల
తెగి అవతల పడింది.
అదే అదనుగా పృథ్వీశ్వరుడు గణపతిదేవుని పైకి బల్లెం విసిరాడు. అంగరక్షకులను దాటి అది గణపతి
దేవుని వైపు వాయువేగంతో వెళ్తున్నది. జాయప పది అడుగుల దూరంనుంచి చివ్వున ఎగిరి, ఆ బల్లేన్ని
అందుకుని.. మరో చేతిలోని ఖడ్గాన్ని గణపతిదేవుని
వైపు లాఘవంగా విసిరాడు..
“చక్రవర్తీ! నరకండి వాడి తలను..” అన్నాడు మహోగ్రంగా.
గణపతిదేవుడు అదే వేగంతో ఖడ్గాన్ని అందిపుచ్చుకుని.. పృథ్వీశ్వరుని తలను ఒక్కవేటుతో తెగనరికాడు.
తెగిన పృథ్వీశ్వరుని తల.. శరీరం నుంచి వేరుపడ్డది. మెడభాగం నుంచి రక్తం ఉవ్వెత్తున కారుతుండగా, కిందపడి గిలగిల కొట్టుకుని.. కాసేపు తన్నుకులాడింది పృథ్వీశ్వరుని దేహం.
కొద్ది క్షణాల్లోనే.. ఆగిపోయింది శాశ్వతంగా!!
అరిచాడు జాయప..
“హరహర మహాదేవ! మహారుద్రేశ్వరా!” అంటూనే కొమ్ముబూర మోగించాడు.
అప్పుడు ఆపేశాయి ఆ ఏనుగులు.. తమ
ఘీంకారాన్ని.
అంతా మారణహోమం.. రణరంగ బీభత్సం!
తెగిపడిన తలలు.. వేడినెత్తురు కక్కుతున్న మొండాలు.. కదులుతున్న ప్రాణాలున్న చేతులు..
కాళ్లు.. వేళ్లూ!
గిలగిల కొట్టుకుంటున్న సైనికులు.. గుర్రాలు.. పచ్చి నెత్తురు వాసన.. ఒళ్లు గగుర్పొడుస్తున్న దృశ్యం!
ఎవడు బతికున్నాడో.. ఎవడు చచ్చాడో తెలియని
పైశాచిక యుద్ధముగింపు బీభత్సం!
అదో శ్మశాన దృశ్యం.. అదో నీరవ నిశ్శబ్దం!!
ముందు తేరుకున్నది కంటక. లేచి పృథ్వీశ్వరుని కేతనాన్ని, ఛత్ర చామరాలను.. కిరీటం లాంటి తలపాగాను ఏరుకుంటూ..
“కాకతీయ సామ్రాజ్యానిదే విజయం. మనదే.. యుద్ధ విజయం మనదే!” గొంతెత్తి అరుస్తున్నాడు.
మరికొన్ని గొంతులు కలుస్తున్నాయి. శత్రుసేనలు కత్తులు కిందపడేసి.. మోకాలిపై కూర్చుంటున్నారు లొంగిపోయి.
చౌండ.. పినచోడుడు.. తర్వాత గణపతిదేవుడు.. సుబుద్ధి, నాగంభట్టు, త్రిపుర.. మరికొందరు వీరులు!
ఒడిలో వాలిన విజయాన్ని నమ్మబోయే ముందటి లిప్తకాలపు తాత్విక నిశ్శబ్దత..
జాయప మధ్యగా కరవాలం ఎత్తి నిలబడి ఉన్నాడు.. విజయ దరహాసంతో రొప్పుతూ.. శరీరం రక్తసిక్తం!
అందరూ.. ముఖ్యంగా గణపతిదేవుడు జాయపను తదేకంగా చూస్తుండగా, పినచోడుడు పరుగున దగ్గరికి వెళ్లి జాయపను హత్తుకున్నాడు. “కుమారా!”..
“తండ్రిగారూ! గాయాలేమీ కాలేదు కదా!?”..
గణపతిదేవుడు అప్రతిభుడయ్యాడు. వారి బంధుత్వం ఆయనకు స్పష్టమైంది.
ఏమిటీ?.. నిజమేనా?.. నేను చూస్తున్నదేమిటి? జాయప.. పినచోడుని కుమారుడా??
దూరం నుంచి నెల్లూరు తిక్క భూపాలుడు, కమ్మమండలం బల్లయా, కొండపడమటి రాజు, చాగి మహారాజు, ధరణికోట సర్వసైన్యాధ్యక్షుడు, సేనానులు, సమాహర్తలు, అధ్యక్షులు, మంత్రాంగవేత్తలు, వైద్యబృందాలు బిలబిలమంటూ రాసాగారు. క్షతగాత్రులై రక్తసిక్తమైన శరీరాలతో, నొప్పులతో సతమతమవుతున్నా.. యుద్ధ విజయం అందరికీ ఉత్తేజాన్ని ఇస్తున్నది.
చౌండ కదిలి.. పృథ్వీశ్వరుని తలను అందరూ చూసేలా ఎత్తి పట్టుకున్నాడు.
మెల్లగా మొదలైన చప్పట్లు.. జయజయ ధ్వానాలతో.. విజయ శంఖారావాలతో.. అరుపులు.. కేకలతో యుద్ధభూమి మారుమోగిపోతున్నది.
ఎవరో అన్నారు గట్టిగా..
“కందుక క్రీడ.. వాడి శిరస్సుతో కందుక క్రీడ ఆడాల్సిందే!”..
“అవును.. ఆడాల్సిందే! ఎన్నోసార్లు అదే మాటతో కాకతీయ చక్రవర్తిని అవమానించాడీ ధూర్తుడు. ఇప్పుడు ఇక్కడ మనమధ్య వాడి శిరస్సు!” అంటూ చౌండ చేతిలోని ఆ తలను లాగి, కింద వేసి.. కాళ్లతో తొక్కసాగాడు తిక్కభూపాలుడు.
తర్వాత ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. ఆ తలను తన్నుతుండగా, గణపతిదేవుడు కదిలి ఆ శిరస్సును చేతిలోకి తీసుకున్నాడు.
“ఇది.. కాకతీయ సామ్రాజ్య విజయానికి చిహ్నం!” అంటూ పైకి ఎగరేశాడు.
చౌండ పట్టుకుని మళ్లీ ఎగరేశాడు. తిక్క పట్టుకుని తనూ ఎగరేశాడు. ఓపిక ఉన్న రాజులు, సైన్యాధ్యక్షులు, బయటనుంచి వచ్చిన యుద్ధవీరులు శత్రు శిరస్సును ఎగరేశారు.. కొట్టారు.. తన్నారు.. పదిమంది యుద్ధ ముఖ్యులు..
కందుక క్రీడ.. ఆడుతున్నారు.
ఉద్రేకంగా.. ఉద్వేగంగా.. అరుపులతో.. వికటాట్టహాసాలతో.. డస్సిపోయింది శరీరాలైనా.. గెలుపు ఇచ్చిన ఉత్తేజంతో పృథ్వీశ్వరుని ఖండిత శిరస్సుతో బంతి ఆట ఆడి ఆడి.. ఓపిక ఉన్నతవరకూ ఆడి, అలసి సొలసి ఆగారు ఆనందంతో.. యుద్ధ విజయులైన మహా
వీరులు.. సామంత రాజులు.
అప్పుడే ఎవరో దిగ్భ్రాంతితో పెద్దపెట్టున అరిచారు.
అందరూ ఆ అరుపు వచ్చినవైపు తలతిప్పి చూశారు.
ఆ మరుభూమిలో కత్తిగాట్లతో.. రక్తసిక్తమైన దేహాలతో నిండిన శవాలపై ఎగిరి నర్తిస్తున్నాడు జాయప.
నటరాజులా.. ముఖ్యంగా పృథ్వీశ్వరుని శరీరంపై ఆనందతాండవం చేస్తున్నాడు.
ఉధృతంగా ఏదో మగతలో ఉన్నట్లు.. అందరూ విభ్రమంగా చూస్తున్నారు.
ఆ రుద్రదేవుడే పూనినట్లు.. యుద్ధభూమే నాట్యరంగమైనట్లు..
అసలు చేతులకు తోడు వెనుక చేతులున్నట్లు.. ఓ చేయి వర్తులాకారంలో గుర్రున తిరుగుతూ సృష్టి స్థితి – లయ కారకమైన కాలాన్ని చూపుతున్నట్లు.. ఓ చేతిలో డమరుకం మోగుతున్నట్లు.. ఓ చేతిలో అగ్ని మండుతున్నట్లు.. ఓ చేయి అభయహస్తంగా.. మెడలోని నాగులు బుస్సుబుస్సున కదలాడుతున్నట్లు.. శిఖలోని గంగమ్మ ఉద్వేగంతో ఊగిపోతున్నట్లు.. కాళ్ల కింద అపస్మారకుడిలా మరుగుజ్జులా ముయలకుడిలా.. మూర్ఖంతో యుద్ధం చేసి మరణించిన పృథ్వీశ్వరుని పార్థివదేహం.. జాయప నృత్త ఉధృతికి చితికిపోతున్నది.
సాక్షాత్ నటరాజులా ఉద్వేగంతో ఊగిపోతూ
నర్తిస్తున్న జాయపునికి.. సమస్త కాకతీయ స్కంధావారం సంభ్రమంతో అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించింది.
ప్రతి యుద్ధమూ చరిత్రాత్మకమైనదే! భారత భూ
భాగంపై జరిగిన చక్రవర్తి స్థాయి యోధులు పాల్గొన్న ప్రతి యుద్ధమూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎక్కడో ఒకచోట లిఖితమై ఉంది.
ఈ సంఘటన శ.సం.1129 ప్రభవ మార్గశిర మాసం కృష్ణపక్షం సప్తమి శనివారం సంభవించినట్లు చరిత్ర లిఖించింది. అప్పటికి జాయప వయసు.. పదిహేడు సంవత్సరాలు!!
వెలనాడు యుద్ధం విజయవంతంగా పూర్తయిన మరునాడు..
స్కంధావారంలో గణపతిదేవుని గొల్లెన..
పట్టుబాలీసుపై చక్రవర్తి పడుకొని ఉండగా.. రాజ
వైద్యులు ఆయన వెన్నుపూసకు పసరు లేహ్యంతో చికిత్స చేస్తున్నారు.
యుద్ధానంతరం పిష్టపురపు సప్తాంగాల స్వాధీన కార్యక్రమం జరుగుతున్నది. సంధి విగ్రహి గన్నమ నాయకుడు నిర్వహిస్తున్నాడు. అడిగిన వాటికి పిష్టపురం సంధి విగ్రహి జవాబిస్తున్నాడు. ఈవల తలవాల్చి కూర్చున్న పిష్టపుర సేనానులు అడిగినప్పుడు
వివరిస్తున్నారు.
దగ్గరగా మరో ఆసనంపై పినచోడుడు.. పక్క ఆసనంపై చౌండ. ఇద్దరూ అలసటగా, భారంగా కూర్చుని.. జరుగుతున్న సంభాషణ వింటున్నారు. ఈ తతంగమంతా జరుగుతుండగా గణపతిదేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి.
అతని కళ్ల ముందు జాయపుడు. మూసినా – తెరిచినా ఆ యుద్ధ దృశ్యం.. తన మీదికి వస్తున్న ఈటెను వడిసి పట్టుకున్న జాయప, మరో చేతిలోని ఖడ్గం తనవైపు గిరాటేయడం.. అందుకున్న తను పృథ్వీశ్వరుని తలను ఖండించడం. ప్రతిక్షణం.. రోమాంచితమైన ఆ దృశ్యం అతని కళ్ల ముందు కదలాడుతున్నది. అదో మైమరపు.. అదో దిగ్భ్రమ.. అదో అవ్యక్తానందం.. మరపురాని మధుర ఘటన.
ఆ ఏనుగులు శత్రుసైన్యాన్ని నిశ్శబ్దంగా చుట్టుముట్టడం ఏమిటి?.. జాయప కొమ్ముబూర ఊదడం.. ఒక్కసారిగా అవి ఘీంకారాలు చెయ్యడం.. దాదాపు పాతిక ఘడియలు విరామంలేకుండా.. ఎవరు చెప్పారు? ఎలా నేర్పారు? యుద్ధవీరులైన సేనానులు పోరాటం చెయ్యడం వేరు. ఆ గిరిజనయోధుడు ఎవడు? ఆ బ్రాహ్మణ యోధుడు.. మరో ఇద్దరు ముగ్గురు! అంతా కలిసి ముందే యుద్ధతంత్రం పన్నినట్లు.. అది అభ్యాసం కూడా చేసినట్లు.. మొత్తం పృథ్వీశ్వరుణ్ని చుట్టుముట్టడం.. ఘడియల సమయంలో అందరినీ నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయడం.. అంతిమంగా పృథ్వీశ్వరుని
శిరస్సును తను ఖండించేలాగా తన చేతికి ఖడ్గాన్ని అందించడం.. ఎంత అద్భుతమైన ప్రణాళిక! ఎంత అమోఘమైన నిర్విఘ్నమైన నిర్వహణ! ఇదంతా ఆ నాట్యకారుడు జాయపుడు చేశాడంటే.. ప్చ్! మేను పులకిస్తుంది. గుండె చమరిస్తుంది. ఇంతటి యుద్ధవ్యూహం తన జన్మలో చూడలేదు. వినలేదు కూడా!
ఈ నాట్యకారుడు జాయపుడు పినచోడుని కుమారుడట. అంటే.. ద్వీప యువరాజు. నీలాంబ కుటుంబపు వాడు అనుకున్నాడు తను. నాట్యకారుడిగా తన ముందు నర్తించి, తన సహాయంతో గుండయామత్యుని వద్ద శిక్షణ పొందుతూ కొత్త నాట్యరూపకాన్ని రాజ్య ప్రయోజనం కోసం రూపొందించిన సృజనాత్మక కళాకారుడు. ‘ఒక మంచి నాట్యకారుడు యుద్ధం ఎలా చేస్తాడు?’ అని తన అభిప్రాయం. అందుకే వద్దన్నాడు. యుద్ధభూమికి వచ్చి చస్తానంటే అభ్యంతరం ఏముంటుంది..
కానీ వచ్చాడు. ఎవరో సహాయపడ్డారు. ఎక్కడో దూరిపోయాడు. ఇంత ప్రతిభ ఉండబట్టే.. సరాసరి తనను అడిగాడు. ఎంత ఆత్మవిశ్వాసం?! ఇవ్వాళ ఇక్కడ ఎంత యుద్ధంచేశాడు.. ఓహ్! ఊహిస్తేనే శరీరం
జలదరిస్తున్నది.
“మహారాజా! విశ్రాంతి తీసుకోండి. తక్షణ విధివిధానాలు సంధివిగ్రహి గన్నమ నాయకుడు పూర్తిచేస్తాడు”.. అంటూ లేచాడు మల్యాల చౌండ.
“ఆ.. జాయపుడు.. ఎక్కడ??” అప్రయత్నంగా
అడిగాడు గణపతిదేవుడు.
“జాయపుడు.. గాయాలకు చికిత్స తీసుకుంటున్నాడు. మిమ్మల్ని కలుస్తాడు. మీరు ఇప్పటికి పదిసార్లు వాణ్ని అడిగారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. వాణ్ని
పిలిపిస్తాను. మిమ్మల్ని వచ్చి కలవమని!” అన్నాడు
పినచోడుడు.
చక్రవర్తిని వదలి ఇద్దరూ బయటికి వచ్చారు.
వెలనాడు రాజధాని దనదప్రోలుపురంలో రాజ
ప్రాసాదం.. మహారాజు ఆంతరంగిక మందిరం.
పినచోడుని సింహాసనం పక్కన వేసిన ప్రత్యేక ఉన్నతాసనంపై చక్రవర్తి గణపతిదేవుడు ఆసీనుడై ఉన్నాడు.
ముందర పినచోడుడు.. మహా ప్రధాని గంగాధరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు చౌండ సేనాని, సకల సేనాధిపతి రేచర్ల రుద్రసేనాని.. పినచోడుని తమ్ముళ్లు.. ఉచితాసనాలలో కూర్చుని ఉన్నారు.
పినచోడుని వెనక.. కుమారుడు జాయప తలవంచుకుని నిలబడి ఉన్నాడు.
అంతా విశ్రాంతిగా ఉన్నా.. అక్కడ కొంత గంభీర వాతావరణం తారట్లాడుతున్నది. కారణం.. గణపతి
దేవుని స్థిరగంభీర ప్రవర్తన. పక్షం రోజులుగా ఆయన తీవ్ర ఆలోచనామగ్నులై ఉన్నాడు.
ఆయన ఏం అలోచిస్తున్నాడో.. ఎవ్వరికీ అంతుబట్టడం లేదు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284