సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్.. మూడో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసే ప్రయత్నం చేసింది. ఇంగ్లిష్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆసీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. మిడిలార్డర్ బ్యాటర్ మిషెల్ మార్ష్ బంతికో పరుగు చొప్పున శతక్కొట్టాడు. బ్యాటర్లు మరోసారి విఫలం కావడంతో ఇంగ్లండ్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తొలి రోజే ఆటను రసవత్తరంగా మార్చింది.
లీడ్స్: సహచరులంతా చేతులెత్తేసిన చోట ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ (118 బంతుల్లో 118; 17 ఫోర్లు, 4 సిక్సర్లు) తన విలువ చాటుకున్నాడు. మార్ష్ వన్డే తరహాలో దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్తో యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (4), ఉస్మాన్ ఖవాజా (13), మర్నస్ లబుషేన్ (21), స్టీవ్ స్మిత్ (22), అలెక్స్ కారీ (8) విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్ష్ మొండిగా పోరాడాడు. ట్రావిస్ హెడ్ (39) తో కలిసి ఐదో వికెట్కు 155 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. ఈ జంట 168 బంతుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం. మార్ష్ దంచుడుతో ఒక దశలో 240/4తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్..
23 పరుగుల వ్యవధిలో మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 5, క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. బెన్ డకెట్ (2), హ్యారీ బ్రూక్ (3) విఫలం కాగా.. క్రాలీ (33) పర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది. జో రూట్ (19), జానీ బెయిర్స్టో (1) క్రీజులో ఉన్నారు. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్లో పుంజుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించాల్సిన స్థితిలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.