టోక్యో ఒలింపిక్స్లో పోటీలు ప్రారంభమైన రోజే.. రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వదేశంలో అడుగుపెట్టిన సమయంలో.. ఆమె రాక కోసం ఇంఫాల్ విమానాశ్రయంలో 150 వాహనాల కాన్వాయ్ కొలువుదీరింది!
పతకం నెగ్గిన కాసేపటికి ‘ఇప్పుడు నాకు పిజ్జా తినాలనిపిస్తున్నది’ అని చాను నోటి నుంచి ఓ మాట వచ్చిన వెంటనే.. ప్రముఖ పిజ్జా ఉత్పత్తి సంస్థ డొమినోస్ జీవితకాలం ఆమెకు ఉచితంగా పిజ్జాలు అందించేందుకు ముందుకొచ్చింది! ఈ రెండు సందర్భాలూ ఆమె విజేతగా నిలిచిన తర్వాతవే.. కానీ అంతకుముందేంటి..?
తన గ్రామం నుంచి ఇంఫాల్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్కు వెళ్లేందుకు సరిపడ డబ్బులు లేకపోవడంతో.. మీరాబాయి లారీ డ్రైవర్లను బతిలాడుకొని గమ్యాన్ని చేరేది!! కఠోర శిక్షణ కారణంగా ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలకు కూడా హాజరు కాలేకపోయేది!! మెడల్ గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న చాను.. అంతకుముందు ప్రాక్టీస్లో మునిగిపోయి తన పుట్టిన రోజును మరిచిపోయిన సందర్భాలెన్నో!! చిన్నప్పటి నుంచి తలపై బరువులు మోయడంతోనే తన కూతురు ఎత్తు పెరగలేకపోయిందని ఆమె తల్లి పడ్డ బాధ వర్ణానాతీతం. ఇలా ఈ చాంపియన్ విజయ గాధ వెనుక ఉన్న వెతలను ఓసారి పరికించి చూస్తే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 30 కిలోమీటర్ల దూరంలోని ఓ మారుమూల గ్రామమైన నాంగ్పోక్ కాక్చింగ్లో జన్మించిన సైఖోమ్ మీరాబాయి చానుకు బాల్యం నుంచే బరువెత్తడం అలవాటైంది. కట్టెలు కొట్టడమే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబంలో జన్మించడంతో.. గుట్టలపైకి వెళ్లి కట్టెల మోపులు ఎత్తుకురావడం ఆమెకు నిత్యకృత్యం. పన్నెండేండ్ల వయసులోనే తన సోదరులు మోయడానికి ఇబ్బంది పడుతున్న బరువులను చాను సునాయాసంగా ఎత్తి చుట్టు పక్కలవారిని ఆశ్యర్య పరిచేది. ఈ ఉత్సాహమే ఆమెను లిఫ్టింగ్వైపు అడుగులు వేసేలా చేసింది. మంచినీళ్ల క్యాన్లు మోయడం నుంచి మొదలైన ప్రస్థానం.. టోక్యోలో 202 కేజీల (స్నాచ్లో 87, క్లీన్ అండ్ జెర్క్లో 115) బరువుతో ఒలింపిక్స్లో భారత్కు తొలి రజత పతకం తెచ్చే వరకు నిరాటంకంగా సాగింది.
రియో ఓటమి నుంచి..
కొండలు గుట్టలపై పరుగులు తీయడంతో పాటు.. బరువులెత్తడంతో చాను శరీరం చిన్నప్పుడే దృఢంగా మారడం గమనించిన తల్లి ఓంగ్బీ లైమా ఆరంభంలో కాస్త ఆందోళన చెందినా.. కూతురి బలమైన సంకల్పాన్ని గుర్తించి వెన్నుదన్నుగా నిలిచింది. తన కూతురు ఎప్పటికైనా ఒలింపిక్ పతకం నెగ్గుతుందని బలంగా నమ్మిన ఆ తల్లి.. మీరాబాయికి ఒలింపిక్ రింగులను పోలిఉన్న దిద్దులు చేయించింది. మంచి అంచనాల మధ్య రియో (2016) ఒలింపిక్స్ బరిలో దిగిన మీరాబాయి మూడు ప్రయత్నాల్లోనూ నిర్దేశించుకున్న బరువు ఎత్తడంలో విఫలమై.. కన్నీటితో ఇంటికి చేరింది. ఈ దశలో మరో అమ్మాయి అయితే ఓటమి ఒప్పుకునేదే కానీ.. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగించిన చాను మాత్రం తన సత్తా ఏంటో నిరూపించాలని బలంగా భావించింది. ఐదేండ్ల పాటు కఠోర దీక్షతో శిక్షణ కొనసాగించింది. ఎట్టకేలకు నాలుగడుగుల 11 అంగుళాల ఎత్తు.. 49 కిలోల శరీర బరువుతో టోక్యోలో అడుగుపెట్టిన చాను తన బరువు కంటే నాలుగింతలు ఎక్కువ ఎత్తి పడేసింది. రియో నుంచి ఫినిక్స్ పక్షిలా పైకెగిరిన చాను.. టోక్యోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
ఎదిగే కొద్ది ఒదుగుతూ..
పతకం నెగ్గి ఇంటికి తిరిగి వచ్చాక చాను పీటపై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అప్పటికే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మీరా.. ఓ సాధారణ అమ్మాయిలా కింద కూర్చోవడం యావత్ దేశాన్ని కట్టిపడేసింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటలకు నిలువెత్తు సాక్షంగా నిలిచిన మీరాబాయి.. కెరీర్ ఆరంభంలో తనకు సాయం చేసిన సుమారు 150 మంది ట్రక్ డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరో మెట్టు పైకెక్కింది. కెరీర్లో ఓ స్థాయికి చేరగానే నడిచిన మార్గంతో పాటు.. సాయం చేసిన చేతులను మరిచిపోయే ఈ రోజుల్లో .. ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు మూటగట్టుకున్నాక కూడా చాను తన మూలాలను మర్చిపోని విధానం నేటి యువతరానికి స్ఫూర్తి పాఠం.