న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 53 కేజీల రెజ్లింగ్ కేటగిరీలో ఆమె టాప్సీడ్. ఈసారి మెడల్ పక్కా అన్న అంచనాలతో వెళ్లింది. కానీ క్వార్టర్ఫైనల్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టింది వినేష్ ఫోగాట్ ( Vinesh Phogat ). ఇది చాలదన్నట్లు ఆమె ఇండియాకు తిరిగి రాగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఆమె.. ఇక రెజ్లింగ్కు తిరిగొస్తానో లేనో అని చెప్పడం గమనార్హం. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు రాసిన కాలమ్లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇండియాలో ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని నాకు తెలుసు. ఒక్క మెడల్ పోయిందంటే ఇక అంతే. పని ముగిసినట్లే. నేనె ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు. రాకపోవచ్చు కూడా. అప్పుడు నా కాలు విరిగినప్పుడే బాగుందనిపించింది. ఇప్పుడు నా శరీరం విరగలేదు కానీ.. నేను మాత్రం కుంగిపోయాను అని వినేష్ చెప్పింది. ఒలింపిక్స్కు ముందు 2017లో కాంకషన్కు గురవడం, ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్ బారిన పడి కోలుకోవడం గురించి కూడా ఆమె చెప్పింది.
రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అయిన ఆమె.. మానసిక సమస్యలను కూడా ఎదుర్కొన్నది. సైకాలజిస్ట్ను కూడా కలిసింది. కానీ ఈ సమస్యను ఇండియాలో ఎవరూ పెద్దగా పట్టించుకోరని అభిప్రాయపడింది. సిమోన్ బైల్స్ను చూడండి. తాను ఒలింపిక్స్కు మానసికంగా సిద్ధంగా కాలేదని చెప్పి ఈవెంట్స్ నుంచి తప్పుకుంది. అదే ఇండియాలో చెప్పి చూడండి. రెజ్లింగ్ వదిలేయడం కాదు.. కేవలం సిద్ధంగా లేనని చెప్పి చూడండి ఏం జరుగుతుందో అని వినేష్ చెప్పింది.