రాజద్రోహ చట్టం అమలులోకి వచ్చిన 132 ఏండ్ల తర్వాత తొలిసారిగా సుప్రీంకోర్టు దానిని తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం ఇప్పుడు ఎందుకన్న చర్చ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఈనిర్ణయం తీసుకోవటం విశేషం. విచిత్రమేమిటంటే.. బ్రిటీష్ సామ్రాజ్య దాస్యశృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల్ని నాటి పరాయి ప్రభుత్వం ఇదే చట్టం కింద రాజ్యద్రోహులుగా ప్రకటించి జైలు శిక్షలను విధించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి క్రూరమైన చట్టం కొనసాగటం దారుణం.
‘రాజద్రోహ చట్టం వలస పాలన కాలం నాటిది. దాన్ని గాంధీజీ, తిలక్లపై ప్రయోగించారు. స్వతంత్ర భారతంలో అది అవసరమా?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గత ఏడాది జూలైలో విచారణ సందర్భంగా ప్రశ్నించటం గమనార్హం. 1962 కేదార్నాథ్ కేసులో కూడా ఈ చట్ట రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా ఈ చట్టాన్ని పాలకులు ప్రయోగిస్తున్నారు. 2015-20 మధ్యకాలంలో 356 కేసులు నమోదు చేసి 548 మందిని అరెస్టు చేశారు. మొదటిసారి 1973లో, ఇందిరాగాంధీ హయాంలో అరెస్టు వారెంట్ లేకుండా రాజద్రోహ నేరారోపణతో అరెస్టులు మొదలయ్యాయి. ఇంకా దాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. జర్నలిస్టులు, మేధావులు, అసమ్మతివాదులపై 124 ఏ కేసులు మోపుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొన్నది.
జాతీయోద్యమకాలంలో స్వాతంత్య్ర సమరయోధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాడుకున్న సెక్షన్-124 ఏ అతి క్రూరమైనది. దీనితోనే నాటి ప్రభుత్వం తిలక్, గాంధీలకు జైలుశిక్ష విధించింది. తిలక్ ‘కేసరి’ అనే మరాఠి వారపత్రికను పుణెలో స్థాపించి, దేశభక్తి పూరితమైన రచనలను అందించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం సెక్షన్ 124ఏ ప్రకారం తిలక్ మీద రాజద్రోహ నేరం మోపింది. 1897లో ఆయనకు 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది.1908లో మరొకసారి ఇదే సెక్షన్ను ప్రయోగించి ఆరేండ్ల ప్రవాస శిక్షను విధించింది. ఈ సందర్భంగా తిలక్ బెయిల్ కోసం నాడు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న మహమ్మద్ అలీ జిన్నా కృషిచేసినా ఫలితం లేకపోయింది. 1916లో ఇదే సెక్షన్ కింద రాజద్రోహనేరం మోపినప్పుడు మాత్రం తిలక్ శిక్ష నుంచి తప్పించుకోగలిగారు.
1908లో కోర్టు తీర్పు మీద తిలక్ ప్రకటన చరిత్రాత్మకమైనది. ‘జ్యూరీ తీర్పు ఏమైనప్పటికీ నేను చెప్పదలుచుకొన్నది నేను నిరపరాధిని మాత్రమేనని. అయితే దైవ సంకల్పమే విధిని శాసిస్తుంది. స్వేచ్ఛ కన్నా బాధాతప్త జీవితమే నా లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని భగవంతుడు భావించాడేమో. అందుకే విధి ఈ విధంగా నిర్ణయించి ఉండవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం తిలక్ ప్రకటనను ముంబై హైకోర్టులోని ప్రధాన హాలులో ఒక శిలాఫలకం మీద ఆవిష్కరించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ నాటి ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగ్లా వెలువరించిన సందేశం న్యాయవ్యవస్థకే మార్గదర్శకమైనది. ‘దేశాన్ని ప్రేమించిన నేరానికి తిలక్ శిక్షించబడ్డారు. మన సమకాలీన వ్యక్తులు మన పట్ల వెలువరించే తీర్పులు అంత ఘనమైనవేమీ కావు. భవిష్యత్తులోని చరిత్ర ఇచ్చే తీర్పుకై మనం వేచిచూడాలి’ అని అన్నారు. తిలక్పై చరిత్ర ఇచ్చిన తీర్పు.. గతంలో విధించిన శిక్షలను తప్పు పట్టింది. తిలక్ చర్యలు దేశం కోసం పోరాడే ప్రతివ్యక్తికి ఉన్న హక్కుకు ప్రతీకలు. అవి న్యాయ సమ్మతమైనవి.
1922 మార్చి 18న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైనప్పుడు గాంధీజీ చేసిన ప్రకటన చరిత్రాత్మకమైనది. ‘నా చర్యలు మీ చట్టం దృష్టిలో ఘోరమైన నేరం. కానీ నా దృష్టిలో మాత్రం నా దేశం పట్ల పౌరునిగా నిర్వహించిన విద్యుక్త ధర్మం. నిర్దోషినైన నాకు శిక్షను విధించమని మీ చట్టం మిమ్మల్ని నిర్దేశిస్తున్నది. అటువంటి చట్టం కుళ్లిపోయిందని మీరు భావిస్తే మీకున్న ఒకేఒక మార్గం మీ ఉద్యోగానికి రాజీనామా చేయడం. లేదా మీ చట్టం ఉన్నతమైనదని, అది ఈ దేశ ప్రజలకు మేలుచేసేదనీ, నా చర్యలు దేశ ప్రయోజనాలకు హానికరమని మీరు భావిస్తే కఠినశిక్షను విధించవచ్చు’ అన్నారు గాంధీ.
మహాత్మాగాంధీ కూడా 124 ఏ సెక్షన్ కింద రాజద్రోహ నేరం మోపబడి జైలు శిక్షకు గురయ్యారు. గాంధీ సంపాదకుడిగా ‘యంగ్ ఇండియా’ పత్రిక అహ్మదాబాద్ నుంచి వెలువడేది. అందులో 1921-22 కాలంలో ప్రచురించిన నాలుగు వ్యాసాలు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. గాంధీతో పాటు ప్రచురణకర్త శంకర్లాల్-గలాభాయ్ మీద రాజద్రోహ నేరం మోపారు. 1922లో ఈ నేర విచారణ ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ విచారణ దేశంలోని చట్టాలకు-నైతిక విలువలకు మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించబడింది. గుజరాత్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి షెలాత్ విచారణను ఈ విధంగా వర్ణించారు… ‘సోక్రటిస్ను మినహాయిస్తే, చరిత్రలో మానవాళి మీద ఇంత ప్రభావం చూపిన విచారణ మరేదీ లేదు. ఈ విచారణల్లో చట్టానికి, నైతికతకు మధ్య పోరాటం సాగింది. సోక్రటీస్ గానీ, గాంధీజీ గానీ తమను విచారించిన న్యాయవ్యవస్థ పట్ల ఒకే విధం గా ప్రవర్తించారు. తాము నమ్మిన సత్యమే చట్టం కన్న గొప్పదని ఇరువురూ భావించారు. అయినా చట్టం విధించిన శిక్షను హుందాగా స్వీకరించారు.
1922 మార్చి 18న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో గాంధీజీ తన ప్రకటన చదువుతున్నప్పుడు కోర్టులో గంభీర వాతావరణం ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వం ముందు గాంధీ ముద్దాయిగా నిలబడ్డాడా లేక భగవంతుని ముందు, మానవత ముందు బ్రిటిష్ ప్రభుత్వమే ముద్దయిగా నిలబడిందా అన్నట్టుగా ఉన్నది.
గాంధీకి ఆరేండ్ల జైలు విధించారు. శిక్ష విధిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి బ్రూం ఫీల్డ్ కలవరానికి లోనయ్యాడు. ‘కాలక్రమంలో ప్రభుత్వం మీ శిక్షను తగ్గించి మిమ్మల్ని విడుదల చేయగలిగితే- నాకన్న ఎక్కువ సంతోషించేవారు ఎవరూ ఉండరు’ అన్నాడు ఆయన. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య మనుగడకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో అవసరం. ఆ స్వేచ్ఛను అణగదొక్కే ఈ ఐపీసీ సెక్షన్-124ఏను శాశ్వతంగా సమాధి చేయాలి.
– బసవరాజు నరేందర్రావు
99085 16549