న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు పోలీసులకు చీవాట్లు పెట్టింది. అలాగే ఎస్హెచ్ఓతో సహా మరొకరికి కోర్టు రూ.25వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భజన్పురా పోలీసులు చేసిన విజ్ఞప్తిని సైతం కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సందర్భంగా కర్కర్దూమా అదనపు సెషన్స్ కోర్టు అల్లర్ల కేసు దర్యాప్తు నిర్లక్ష్యంగా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు విషయంలో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలని, ఈ విషయానికి సంబంధించి తగిన చర్యలు తీసుకునేలా తన ఉత్తర్వు ఆదేశాలను పోలీస్ కమిషనర్కు పంపాలని జడ్జి ఆదేశించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో గతేడాది అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మహ్మద్ నజీర్ అనే వ్యక్తి కన్నుకు గాయమైంది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గతేడాది మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అయితే అల్లర్ల ఘటనతో సంబంధం లేదని ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో ఆయన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను సమర్థించిన కోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అక్టోబర్లో ఆదేశించింది. ఈ ఉత్తర్వును పోలీసులు సెషన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఫిర్యాదుదారుడి పేరు సైతం అందులో ఉందని పోలీసులు వాదించారు.
బాధితుడు ఫిర్యాదు చేసిన వ్యక్తులపై ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులను కోర్టు మందలించింది. విచారణ సమయంలో ఢిల్లీ హైకోర్టు నిబంధనల ఆదేశాలను పోలీసులు అనుసరించలేదని పేర్కొంది. దర్యాప్తు నిర్లక్ష్యంగా, హాస్యాస్పదంగా ఉందని, దర్యాప్తు సమర్థవంతంగా సాగలేదంటూ మందలించింది. దర్యాప్తు చేయకుండా నిందితుడికి క్లీన్చిట్ ఎలా ఇచ్చారంటూ అంటూ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ‘కేసు మొత్తాన్ని పరిశీలిస్తే నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోందని’ కోర్టు పేర్కొంది. ఈ మేరకు కేసును సరైన పద్ధతిలో విచారణ జరపాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది.