దేవాలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో గర్భగుడి వెనుక తాకుతారు! అలా చేయడం మంచిదేనా?
శ్యామ్ప్రసాద్, శంకరంపేట
‘దక్షిణావర్తేన దేవముద్దిశ్య భ్రమణమ్’ దేవాలయంలోని దైవాన్ని ధ్యానిస్తూ కుడి వైపు నుంచి గర్భాలయం చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవుడి గర్భాలయం ఉండే ప్రదేశం రెండు భాగాలుగా ఉంటుంది. అందులో పడమర వైపు ఉండే రెండో సగభాగాన్ని వరుసగా బ్రహ్మ, మానుష, దైవ, పితృ, పిశాచ భాగాలు అని పిలుస్తారు. బ్రహ్మ భాగంలో అర్చన పాత్రలను, మానుష భాగంలో మూలవిరాట్టు పరివారాన్ని ఉంచుతారు. దైవ భాగంలో మూలవిరాట్టును ప్రతిష్ఠిస్తారు. దేవుడి వెనుక ఉండే పితృభాగంలో, మూలమూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వస్ర్తాలను ఉంచుతారు. చివరిదైన పిశాచ భాగంలో స్వామివారి శస్ర్తాది ఆయుధాలను పెడతారు.
ఆ కారణంగా గర్భగుడి వెనుక ఉండే గోడ పిశాచాలది అనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. కానీ, అది కేవలం అపోహ మాత్రమే. గర్భగుడిలోని మూలవిరాట్టును తాకలేరు కాబట్టి, దైవానుగ్రహం కోసం తపిస్తూ చాలామంది దైవానికి చాలా దగ్గరగా ఉండే గుడి వెనుక గోడను భక్తితో తాకుతారు. తద్వారా మూలమూర్తిని తాకిన అనుభూతిని పొందుతుంటారు. మరోరకంగా చూస్తే, గుడి శిఖరం దైవానికి శిరస్సు వంటిది. ఆ శిఖరాన్ని తలచుకొని దైవానికి నమస్కారం చేయాలని గుడి వెనుక భాగాన్ని తాకుతారు. ఈ మేరకు ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం ఎంత మాత్రం దోషం కాదు. అయితే, ప్రదక్షిణలు ఎన్ని చేశామనే దానికన్నా, ఎంత నిదానంగా, ఎంత శ్రద్ధతో చేశామన్నది ప్రధానం. సంకల్పశుద్ధితోపాటు స్వచ్ఛంగా నిగ్రహంతో ప్రదక్షిణలు చేసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370