4 ఏండ్ల లోపు వారికి హెల్మెట్ తప్పనిసరి: కేంద్రం ముసాయిదా
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: బైక్పై వెళ్తున్నప్పుడు పిల్లల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రిత్వ శాఖ పలు ప్రతిపాదనలతో ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేండ్లలోపు పిల్ల లు బైక్ వెనుకాల కూర్చుంటే వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదని పేర్కొంది. 9 నెలల నుంచి 4 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలు తప్పనిసరిగా క్రాష్ హెల్మెట్ ధరించాలని తెలిపింది. రక్షణ కోసం లైఫ్ జాకెట్ లాంటి జాకెట్ను పిల్లలకు తొడుగాలని, ఆ జాకెట్కు ఉన్న స్ట్రాప్స్ను డ్రైవర్ నడుముకు బెల్ట్ మాదిరిగా చుట్టుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.