బాల్యం గురించి ఎవర్ని అడిగినా పాత రికార్డులు తిప్పుతారు.ఇంట్లోంచి పారిపోయి ఒకరోజంతా దోస్తుల దగ్గర ఉన్నామనో, మెట్ల కింద దాక్కుని చీకటిపడ్డాక ఇంట్లోకి వెళ్లామనో, గ్యారేజ్లో గురకపెట్టి నిద్రపోయి, తెల్లారేసరికి కాలింగ్ బెల్ నొక్కామనో.. చాలా కథలే వినిపిస్తారు. నిజమే, ఇలాంటి సంఘటనలు చాలా జీవితాల్లో ఉంటాయి. కానీ, స్మార్ట్ఫోన్ యుగంలో ఈ ధోరణి ప్రమాదకరం. పిల్లల చుట్టూ బూచాళ్లే!
తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గర చేతిలో ట్రావెల్ బ్యాగ్తో అమ్మానాన్నలకు కనిపించాడు. ఆఫీసు నుంచి తిరిగొస్తూ బిడ్డను చూశారు. ‘ఎక్కడికి? ఆ బ్యాగ్ ఏంటి?’ అని నిలదీశారు. ‘ఇంట్లోంచి వెళ్లిపోతున్నా’నని మహా ధైర్యంగా చెప్పాడు. ఇద్దరూ ఆ షాక్ నుంచి తేరుకొనేలోపు, పారిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. చీకటి పడినా కొడుకు జాడ తెలియక పోయేసరికి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ అబ్బాయి గోవాలోని ఒక హోటల్లో బస చేశాడని పోలీసులు తెలుసుకున్నారు. ఆ బాలుడి ఫోన్లో ‘డిస్కార్డ్’ అనే యాప్ ఉందనీ గుర్తించారు. అందులోని ‘ప్రైవేట్ రూమ్’ అనే ఫీచరే పిల్లల కొంప ముంచుతున్నది. దాని ద్వారానే ఆన్లైన్ స్నేహితులతో చాలారోజులు చాట్ చేశాడు. అందరూ 13 నుంచి 17 ఏండ్లలోపు వారే. ఇండ్లలోంచి పారిపోవడం ఎలా? ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రాంతంలో ఉండాలంటే, ఎంత డబ్బు కావాలి? భోజనం, వసతి సౌకర్యాలు ఎక్కడుంటాయి?.. తదితర విషయాలపై పుంఖానుపుంఖాలుగా చర్చించారు. ‘ఇంట్లోంచి పారిపోవడానికి సరైన ప్రణాళిక ఏంటి?’, ‘చాలా ఒత్తిడిలో ఉన్నా. అమెరికా లేదా యూరప్ వెళ్లిపోవాలంటే ఎలా?’, ‘ముంబైకి చెక్కేయడానికి నా దగ్గరున్న 50వేలు సరిపోతాయా?’ మొదలైన ప్రశ్నలూ సంధించారు. ఇలాంటి కేసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, మహారాష్ట్రలలో బాగా పెరుగుతున్నాయి.
ఏమిటీ ‘రన్ అవే ఫ్యామిలీ?’
ఒంటరితనంతో బాధపడుతున్న టీనేజ్ పిల్లలను తప్పుదోవ పట్టించేందుకు పుట్టుకొచ్చిందే ‘రన్ అవే ఫ్యామిలీ’. రెడిట్, డిస్కార్డ్ మొదలైన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో చాలా సర్వర్లు లేదా ఆన్లైన్ చాట్రూమ్స్ ఉంటున్నాయి. వాటన్నిటిలో ‘రన్ అవే ఫ్యామిలీ’ ఉంటుంది. ఇందులో పదహారు, పదిహేడేండ్లలోపు టీనేజీ పిల్లలు వేలమంది ఉంటారు. ఉదాహరణకు ‘రెడిట్’లోని రన్ అవే కమ్యూనిటీలో సుమారు 8 వేల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. ‘డిస్కార్డ్’ యాప్లో 18 సర్వర్లు ఉన్నాయి. ఒక్కోదాంట్లో వేలమంది బాలబాలికలు. కొన్నయితే, 17 ఏండ్లలోపు పిల్లలకే అని ప్రత్యేక నిబంధన పెట్టాయి. మానసికంగా కుంగిపోతున్నవాళ్లు, ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నవాళ్లు ఈ వలలో ఎక్కువగా పడుతున్నారు. అందులో చాలామంది నగరవాసులే.
పెంచే పద్ధతి మారాలి..
‘పిల్లలు ఇలాంటి ఆన్లైన్ ట్రాప్లలో పడటం బాధాకరం. అయితే, ఇందులో పొరపాటు పిల్లలదే అనడం తప్పు. అలాగైతే, సమాజంలోని అందరు పిల్లలూ అలానే చేయాలి కదా? పిల్లల్లో మానసిక కుంగుబాటు, ఆత్మన్యూనత, ఇంట్లోంచి పారిపోవాలన్న ఆలోచన కచ్చితంగా పెంపకంలో లోపాలే. అతిగా భయపెట్టడం, విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడం, తమ పనుల్లో బిజీ అయిపోయి పట్టించుకోకపోవడం.. మంచి పద్ధతులు కాదు. యుక్త వయసు పిల్లల ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అందువల్ల వాళ్లను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు వాడుతున్నప్పుడు కచ్చితంగా గమనించాలి. ఇలాంటి కేసుల్లో పిల్లలకు, తల్లిదండ్రులకూ కూడా కౌన్సెలింగ్ అవసరం’ అని చెబుతున్నారు సైబర్ సైకాలజిస్ట్ నిరాలీ భాటియా.